మునుపటి నా మాట
ఒకనాటి ఉద్యాన (నందన) వనము – నేడు కనుము Click to Zoom వచ్చేసింది కదా- నందన నామ సంవత్సరం! ఇవాళేమిటీ? మార్చి 23. ఉగాది కాబట్టి చైత్ర శుద్ధ (శుక్ల) పాడ్యమి. అంటే చంద్రుడు ‘మీ మనసుల్ని ప్రభావితం చేసేది నేనే కాబట్టి , ఆ సూర్యుడి దయ వల్ల నెలా నెలా వెన్నెల ఇచ్చేది నేనే కాబట్టి నా తిరుగుడు కూడా గమనించి నన్నూ లెక్కలోకి తీస్కోండర్రా’ అని మన పూర్వీకులకి చెప్పడం చేత వాళ్ళు ‘ఆ(, నిన్నెవడు లెక్క చేస్తారోయ్ ‘ అని అనకుండా , కిందా మీదా పడీ లెక్కలు కట్టబట్టీ పన్నెండు ‘చాంద్ర మాసాలు’ ఉన్నాయని తేలింది. అంతే కాదు చంద్రుడి గతి వల్ల అతని రోజు కాస్త ‘తిథి’ అయింది. సూర్యుడికేమో ‘తేది’ దక్కింది. సూర్యుడికి ఎక్కువ రోజులు కేటాయించక పొతే మండి పడడూ? చంద్రుడు మాత్రం పాపం తక్కువ రోజులతోనే చల్లబడ్డాడు. వీరి రోజుల తేడా సంవత్సరానికి దాదాపు పదకొండు. అందుకనీ రెండేళ్లకో, మూడేళ్ళకో ఒకసారి చంద్రుడికి ముప్ఫై ‘అధిక’ తిథులిచ్చి ఆ లోటు పూర్తిచేస్తూ వస్తున్నారు. అలా ఈ ఏడాది మనకో ‘అధిక భాద్రపద’ మాసం వస్తోంది. మార్చి ఇరవై న ‘వసంత విషువత్’ ( సాధారణంగా మార్చి ఇరవై ఒకటిన వస్తుంది. ఈ ఏడాది ‘లీపు’ సంవత్సరం కనుక ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్కువ కనుక , ఈ వసంత విషువత్ మార్చి ఇరవైన వచ్చింది) వచ్చి ‘ వెలుగూ చీకటి సమానత్వం’ అంటూ ఘోషించింది. ఇక ఇప్పటినుంచి సూర్యుడు తన ప్రతాపమంతా మన మీద –అంటే కేవలం మన తెలుగువాళ్ళ మీద అని కాదు, మొత్తం భారతీయులందరి మీదా- చూపిస్తాడన్న మాట. పిల్లలకేమో పరీక్షలైపోయి తల్లులు మెట్టింటి ఎండలు కన్నా పుట్టింటి ఎండలు వెన్నెల్లా ఉంటాయని ప్రయాణాలు కడుతుంటే , తల్లి మమత కొలువునే మరచిన మంత్రిగారు ‘సామాన్యుడి టికెట్ రేట్ పెంచే రాయి’ ని విసిరేశారు సభలో. ‘అది రాయి కాదు, కలికి తురాయి’ అని ఆయన అపోహ పడ్డారు. ‘అయితే కాసుకో అని తల్లి మమతల కోవెల నుంచే మరో ‘రాయి’ విసిరారు. ఆ రాయి కరక్టైన కోణంలో 'ముకుళిత' హస్తం విసిరితే సరిగ్గా రైల్వే ట్రాక్ లో పడింది. ఇక ట్రైన్ టిక్కెట్ రేట్లు పెరగవు, మన నడుములు విరగవు అని తల్లులు ఒయ్యారంగా నడవొచ్చు. ఇదంతా – ఖర నామ సంవత్సరం చివర్లో జరిగినా ‘నందన’ వచ్చిన వేళా విశేషం అని ‘పంచాంగ శ్రవణం’ లో ఈ పాటికి ఘోషించే ఉంటారు.
0 Comments
ఫాల్గుణ కృష్ణపక్షం అంటే కూడ సద్గుణ కృష్ణ(శాస్త్రీయ) పక్షమే! 1 Nov 1897 - 24 Feb 1980 ఒక వారం ఆగమన్నాను. తీరా చూస్తే ఓ పక్షం రోజులు గడిచినట్టున్నాయి. మీరు గానీ ఆశతో ఎదురు చూసేరో ఏమో? కృష్ణశాస్త్రి గారి పాటలు మరిన్ని వినాలనే ఉత్సుకత మీలో ఉందో ఏమో? నా దురాశ కాదు కానీ, ఈ ఫాల్గుణ మాసమంతా ఆయన ధ్యాసలోనే మిమ్మల్నీ గడిపేయమన్నాను. ఈ శిశిరం ఇలా వెళ్లిపోనీండి, ఎంచక్కా వసంతం వచ్చేస్తుంది. 'ఖర' నామ సంవత్సరం కొరకొర చూస్తోంది, ఎందుకంటే ‘నందన’ ఉగాది ఇంకెంతసేపు నా రాక అన్నట్టు ఉవ్వీళ్ళూరుతుంటేనూ! ఫాల్గుణ కృష్ణ పక్షంలో తొలి విడత మీరు చూసిన దృశ్య గానాలు ఇవీ : కనులు చూసినా పాటే- రెండు కనులూ తెరిస్తే చాలు నాలుగు వీడియోలు కృ.శా గారి శైలిని అద్భుతంగా అభినయించిన నటీనటుల్ని ఎదుట ఉంచాయి అని మీరూ అంటారు. సాహిత్య సంగీతాలతో పాటు నటన ఏకం అయ్యేలా చూడగలగడం దర్శకుడి బాధ్యత. అందులోనూ- కృ.శా పాట అనగానే అంతర్దర్శనం ఎరిగి ఉండాలి. మొదటిది- ‘ఇది మల్లెల వేళ యనీ’ పాట ( చిత్రం: సుఖదు:ఖాలు- శివరంజనీ, మిశ్ర పీలూ ఛాయల్లో కోదండపాణి అమోఘంగా సృష్టించి, సుశీలమ్మ చేత ఎంత ఆర్ద్రంగా పాడించారూ! పాట దృశ్యం అలా అలా చూసేయక దర్శకుడు తీసుకున్న శ్రద్ధని కాస్త గమనించారు కదూ. ఆలాపన నుంచి ముక్తాయింపు వరకు ఎంత సమయం పట్టిందీ, పాట సన్నివేశంలో గోడ గడియారం ఏం చూపుతోంది అనేది గ్రహించారు కదూ). కృష్ణశాస్త్రి గారి ఈ పాట - ఆనాడూ అందరినీ ఆలోచనలో పడేసింది. ఈ పాట శాస్త్రిగారు రాసి ఇచ్చిన తరువాతే స్వర కర్త కోదండపాణి ట్యూన్ కట్టారు. ఆ రికార్డింగ్ లో శాస్త్రి గారు దగ్గరుండి చాలా తృప్తి చెందారని దాసరి వారు చెప్పారు. కొంతమంది మాత్రం ఆ పాట రికార్డింగ్ కోసం వెళ్ళే లోపల ‘ఇది మల్లెల మాసమనీ, ఇది వెన్నెల వేళ యనీ’ అని ఉండేది కాస్త అటూ ఇటూ అయి పోయిందని లేనిపోనివి సృష్టించి చెప్పారు. అదే గనుక నిజమైతే ప్రత్యక్ష సాక్షి దేవులపల్లి ఊరుకునే వారా? ‘మేఘమాల’ పాటల పుస్తకంలోనూ దిద్దుబాటు ఉండేదే! అందరూ అనుకునేది ఆ పాట పల్లవిలో వసంత ఋతువూ, కార్తీక మాసం కలగలిసి పోయాయి అనే. ఆ చిత్రంలో నాయికది అర్ధాంతరంగా ముగిసి పోయే పాత్ర. ఆమె గాయని. అలా బ్రతుకు ముగిసిపోక ముందే ఆమె రేడియో కోసం పాడే పాట అది. ఆమె బేలతనం ఇంకొకరి తొందరపాటు తనానికి బలి కావడం ఒక భవిష్యత్ దర్శనం. కోయిలకి మావి చిగురులే తప్ప మల్లెల తోనూ, వెన్నెల తోనూ సంబంధమే లేదు. వెన్నెల ఏ మాసం లోనైనా రాత్రి వేళే వస్తుంది. ‘కార్తీక మాసంలో కరి మబ్బు ఉండదు’ కనుక ఆ మాసం లోని వెన్నెల మరింత తేజస్సుతో అగుపిస్తుంది. కోయిలకి మల్లెలూ, వెన్నెలా వసంతంలో అవసరమయ్యాయంటే అదంతా ‘ఆపోజిట్ జెండర్’ ఆకర్షణ వల్ల. ఈ ఆకర్షణే తొందరపాటుకి దారి తీసింది. ‘ఏ వసంత కోకిలా వాన వేళ పాడదు’ అని ఒక కవి సెలవిచ్చారు. అది నిజం కాదు. నిజమేనేమో అప్పుడింక మావి చిగురులుండవు కదా అనవచ్చు కొందరు. ఇంతకీ కోయిల కూసేది ఎందుకనీ? గజి’బిజీ’ ప్రపంచంలో కాకి గోల మధ్యన కాస్త ఊరట కలిగించే పంచమ స్వరం కోయిల కూత కనుక (ఇప్పటి కొత్త కవికి 'మాఘ మాస వేళ కోయిలమ్మ పాట' గురించి అనుభవముంది. ఎవరూ పల్లెత్తు మాట అనకూడదు). రెండవది - ‘కొంచెం కొంచెం బిడియాలు’ పాట ( చిత్రం: విజయం మనదే- మాటల్లో చెప్పలేని అన్న అనుబంధాన్ని సింధు భైరవి రాగంలో ఘంటసాల గారు స్వర పరిచి స్వయంగా పాడితే ఆర్ద్రత రాకుండా ఉంటుందా? పైగా – రచన కృ.శా. గారిదాయే! మూడవది- మనసూగే తనువూగే (భాగ్య రేఖ- హిందీ పాట ‘మన్ డోలే మేరా తన్ డోలే’ వరసలో సాగినా హిందీ పాటలో ఉండే నాగస్వరం (బీన్ మ్యూజిక్ ) లేని తెలుగు పాట ఇది. అడుగడుగునా కృ.శా వేసే పదజాలం ఒక ఆకర్షణ (హిందీ పాటను హేమంత్ కుమార్ స్వర పరిస్తే, బీన్ మ్యూజిక్ ఇద్దరు మేధావుల సమష్టి కృషి. వారు- కల్యాణ్ జీ, రవి. కల్యాణ్ జీ వీర్ జీ షా దివంగతులై కొన్నేళ్ళయ్యింది. ఈ మార్చి 7 న రవి శంకర్ శర్మ, బొంబాయి రవి అనబడు రవి మరణించారు. రవి హిందీ లోనే కాక మలయాళంలోనూ ఎన్నో చిత్రాలకి బాణీలు అందించారు. తెలుగులోనూ ఒక సినిమా ఉన్నట్టు గుర్తు. నాగిన్ రికార్డ్ కవర్ ప్రతి ముఖమూ ప్రసిద్ధమేలో సిద్ధం). నాలుగవది- ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ (ఏకవీర- మహదేవన్ ఇంటర్ల్యూడ్స్ మాత్రమే ఇచ్చిన ఈ పాట ఒరిజినల్ కంపోజర్ బి.గోపాలం గారు. కాంతారావు గారికిబాలు గళం చక్కగా అమరుతుందని కోదండపాణి ‘ఉక్కుపిడుగు’ చిత్రం లో ‘ఏ వూరు ఎవరు మీ వారు’ పాట ఇచ్చి నిరూపించారు. ఘంటసాల, బాలుల మేలు గళ కలయిక లో ఇది రెండవ పాట, తొలి పాటంత హిట్ కావడం దీని విశేషం. ముఖ్యంగా స్టేజి మీద ఇద్దరు గాయకులు పాడవలసివస్తే ఇవి వరాలు). (All the four videos are archived under 'devulapalli' in kanulu choosinaa paate). సినిమా సన్నివేశంలో ఈ పాటకి ముందు సంభాషణా రచయిత డాక్టర్ సినారెపాట పల్లవిలోని మాటలే పాత్రల చేత పలికించారు. స్క్రీన్ ప్లీ లో అటువంటి జాగర్తలు ఎన్నో తీసుకునీ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రసిద్ధ నవలని సినిమా కథగా మలిస్తే అది సామాన్య జనాన్ని అంతగా ఆకర్షించలేక పోయింది. అయితే అందరూ హర్షించినదేమిటంటే మేటి కవులిద్దరూ తమ తమ బాణీల బాణాలు ఎవరికి వారే సాటి అన్నట్టు అద్భుతంగా సంధించారు అన్నదే. ఇక్కడో చమత్కారం చెప్పుకోవాలి. ఘంటసాల, బాలుల కాంబినేషన్ లో వచ్చిన తొలిపాట ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ (మంచిమిత్రులు) సి.నా.రె. వారి రచన అయితే రెండవపాట ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ కృ.శా వారి రచన కావడం విశేషం. తొలి పాట లో ‘ఉదయం’, రెండవ పాటలో ‘రాత్రి’ రావడం చూస్తే కవి ‘సమయాలు’ అంటే ఇవేనేమో అనిపిస్తాయి. కనులు మూసినా పాటే- అష్ట దిక్కులు మార్మోగేలా ఓ ఎనిమిది కృ.శా మెలోడీలు చెవిని తాకాయి కదా. అన్నీ అరుదైనవే. సాలెగూటిని జల్లెడ పట్టి గాలించి చూసినా దొరకని పాటలవి. ముఖ్యంగా మాటలాడలేని కృ.శా వారికిష్టమైన ‘మాట’ ప్రసక్తి తీసుకొచ్చిన మూడు పాటలు ఉన్నాయే - సత్యం, రమేష్ నాయుడు, రాజేశ్వరరావు గార్లు ఒక్కొక్కరు వాటిని ఎంత వైవిధ్యంగా స్వర పరచారో గమనించే ఉంటారు. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|