మునుపటి నా మాట
కళ్ళు తెరిచి చూస్తుంది పసి పాప.
ఎదురుగా తన బొమ్మ చూపిస్తూ ఓ కనుపాప. ఆ కనుపాపలో ఉన్నది తన బొమ్మే అని తెలియని తనం. ఆ అమాయకపు చిరునవ్వే, ఆ ఆకలి ఏడుపే ఆ కనుపాప ధనం. కనుపాపకో పేరుంది. అమ్మ. కమ్మనైన అమ్మ మాట వేదం. కమ్మనైన అమ్మ చేతి వంట ఆహా. అమ్మ కొంగు తగలక పొతే అమ్మో. అమ్మ కనుమరుగైతే అయ్యో. జగన్మాత అమ్మలాగ వేద వాక్కుతో జగతిని పాలిస్తుంది. అన్నపూర్ణ అయి అమ్మ లాగ అన్నం పెడుతుంది. కొంగు చాటున మనల్ని దాచి గొడుగులా నిలుస్తుంది. కంటికి కనపడక దోబూచులాడిస్తుంది. అందుకే ఆమె అమ్మలగన్న అమ్మ. ఆమెకెన్నో రూపాలు. ఆమె వెన్నో భావాలు. ఆమె కొండ మీద కొలువుండగలదు. గుహల్లో విహరించగలదు. గ్రామాల్లో వసించగలదు. గుండెల్లో నిలువగలదు. బతుకమ్మ ఆమె. గాజులమ్మ ఆమె. నూకాలమ్మ ఆమె. పెద్దమ్మ ఆమె. కనక దుర్గమ్మ ఆమె. పైడి తల్లి ఆమె. కాళి మాతఆమె. సర్వ శక్తీ ఆమే.
0 Comments
పటౌడి లేరు. క్రికెట్ ఉంది, ఉంటుంది. క్రికెట్ జ్ఞాపకాల దొంతర్లలో పటౌడి ఆత్మ ఉంది. దేశంలో చూపులేని ఎవరో ఒకరికి అతని కన్ను దన్నుగా ఉండనుంది. ఇరవైవ ఏటనే ఒక కన్ను కోల్పోయిన పటౌడి బెంబేలెత్తి పోలేదు. క్రికెట్ మైదానం విడిచి పారిపోలేదు. ఆత్మ విశ్వాశం అంత గొప్పది. మొన్నటికి మొన్న మరణిస్తూ కూడా ఆయన మేలుకోరాడు. తన రెండో కన్ను ఎవరికైనా పనికి రాక పోదా అని అనుకున్నాడు. జీవితాంతం నేత్ర దానం మీదనే ప్రజల్లో అవగాహన తీసుకొచ్చిన వాడు తన వంతు కర్తవ్యం కూడా నెరవేర్చాడు. క్రికెట్ ఫీల్డ్ మీద ‘టైగర్’ అనిపించుకున్నాడు. అంటే ‘పులి’ అన్న మాట. అందుకే ఆయన్ని ‘పుండరీకాక్షుడు’ అంటున్నాను. పుండరీకాక్షుడంటే విష్ణువే. విష్ణువంటే ‘స్థితి’ కారుడు కదా. అసలు పటౌడి పుట్టినది ‘హరి’యాణ లోనే కదా. అంతెందుకు ఒక అష్టావధాని గారికి క్రికెట్టు, వాలీ బాలు, టెన్నిస్ వంటి పదాలిచ్చి రామాయణ ఘట్టం చెప్పమంటే ఆయన 'క్రికెట్టు' ని ఎంత సమంజసంగా 'చక్రి కెట్టుల' అని విరిచాడో తెలుసా. చక్రి అంటే విష్ణువే. హరికీ, క్రికెట్ కీ ఏదో సంబంధముంది కాబోలు. క్రికెట్ కి ఒక ఉన్నత ‘స్థితి’ కల్పించిన వాడు పటౌడి. బ్యాటూ, బంతీ, వికెట్లు, పరుగులు – ఈ నాలుగు స్తంభాల ఆట క్రికెట్. ఆ స్తంభాల మూల స్తంభం పటౌడి. పటౌడి ని క్రికెట్ MAP అంటున్నాను. Mansur Ali khan Pataudi కి సంక్షిప్త రూపమేమో అని అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఆ చిత్ర పటం సాయంతో క్రికెట్ ఉనికి, దిక్కులూ,ఎల్లలూ తెలిసాయేమో. అల్లా కావొచ్చు, ముక్కంటి కావొచ్చు, జీసస్ కావొచ్చు వారి చల్లని చూపు కోసమే జీవితాంతం మనిషి బతికేది. ఆ చూపు దీపమే మనల్ని నడిపిస్తూ రక్షిస్తోందని మన విశ్వాసం. కాలం తల్లి క్యాలెండర్ గా ముస్తాబై నవ మాసాలు మోసి తొమ్మిదో నెలని కంటే ఆ నెల బాలుడికి సెప్టెంబర్ అని పేరు పెట్టారు. సెప్టెంబర్ నెలా రావోయ్ (Come September) అంటూ గిటార్ మీద స్వాగత గీతం పాడారు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు వీళ్ళంతా చివరికి 'బరు'వు గా ఎందుకు మారారో, ఆ తరువాత వచ్చిన జనవరి,ఫిబ్రవరి చివరికి 'వర్రీ' గా ఎందుకు మిగిలారో తనకి తెలుసు కనుక 'మార్చి' నెల తన పంథా మార్చుకుంది. సరిగ్గా మార్చి 21 న సూర్యుడు భూమధ్య రేఖ పైకి వచ్చి సుఖమూ, దుఖమూ అనే పగలూ, రాత్రీ అంతటా సమానమంటాడు. అప్పటికి సూర్యుడు ఉత్తరాయణం చేస్తుంటాడు. మళ్ళీ మహానుభావుడు ఆ సూర్యుడు సెప్టెంబర్ 23 న భూమధ్య రేఖ పైకివచ్చి అప్పుడు కూడా పగలూ, రేయి సమానమంటాడు. అప్పటికి సూర్యుడు దక్షిణాయనం చేస్తుంటాడు. మెల్ల మెల్లగా చీకటి ఎక్కువ కాలం రాజ్యమేలేది ఆ పైనే. వానా కాలం కి ఉత్తర భారతంలో తెర పడేది సెప్టెంబర్ లోనే. చెన్నై మాత్రం చినుకుల కోసం ఆరాటపడేది ఈ నెలలోనే. తతిమ్మా చోట్ల అంతో ఇంతో గిలిగింతల చలి ఆశ్వయుజ ప్రారంభాన్ని సూచిస్తున్నట్టుగా వణికిస్తూ ఉంటుంది. అప్పుడు కాస్త వేడి, కాస్త ఉల్లాసం సమపాళ్ళలో కావాలి కదా. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఒక అడుగు జాడని ఆశ్రయించాలి. అది సాహిత్యంలో కావొచ్చు, సంగీతంలో కావొచ్చు. సాహిత్య పరంగా చూస్తే కనిపించే 'అడుజాడ గురజాడది' - అన్నారుశ్రీశ్రీ. శ్రీశ్రీ కి ముందు 'మహాకవి' అని ఇక్కడ అనబోవటం లేదు. ఎందుకంటే శ్రీశ్రీ దృష్టిలో 'మహాకవి' ఒక్క గురజాడ వారే కాబట్టి. ఇక సంగీతపరంగా చూస్తే కనిపించే అడుగుజాడ లెన్నో ఉన్నాయి. అందులో 'వేళ చూడ వెన్నెలాయె', 'వెన్నెల తెచ్చాడు మా పాపడు', ' వేదన తీరగ వెన్నెల తీరుగా' అని వెన్నెల జాడలో తన ముద్రను గుప్తంగా దాచేసుకున్న మరో గురజాడ వారి అడుగుజాడ కనిపిస్తుందా? మరో గురజాడా? అదెలా సాధ్యమ్? అవును, సాధ్యం కనకనే ఈ పూట నా మాట ఇలా ఇద్దరి గురించి---. Click to Zoom కొంప దీసి ఆ హెడ్డింగ్ నిజమనుకునేరు! అది ఎవరైనా కోరుకునేదే! ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవైన పసి బాలుడు కానున్న మన అక్కినేని. ఇప్పుడు లెక్క వేసి అక్కినేనికి ఇన్నేళ్ళా అని చెప్పడమెందుకు? నిత్య యవ్వనుడు. ముందు అక్కినేని వారికి మనసారా పుట్టిన రోజు శుభాకాంక్షలుతెలియజేద్దాం. ఫోటోలో పొడవాటి ఆయన, పొడవాటి గడ్డమున్న ఆయన- ఆయన ఎవరో కాదు. ఎంత తాపీగా ఆలోచించినా చప్పున గుర్తుకొచ్చే పేరు- తాపీ ధర్మా రావు. నిన్నఆయన్ని మనసారా సంస్మరించుకున్నాం మన ధర్మంగా, ఆయన జయంతి కనుక. బరంపురం లో పుట్టి మదరాసు నేలిన కలం తాపీ వారిది. ధర్మారావు నాయుడు గానూ, తాతాజీ గానూ చిరపరిచితులు. యూనివర్సిటీ ఇచ్చిన బిరుదు-'ఆంధ్ర విశారద'. ఆ కలం 'పాత పాళీ' మార్చి 'కొత్త పాళీ' అమర్చి 'ఇనప కచ్చడాలు' 'పెళ్లి-దాని పుట్టు పూర్వోత్తరాలు', 'దేవాలయం మీద బొమ్మలెందుకు?' వంటి వెన్నో ఎడాపెడా రాసేస్తే ముక్కున వేలేసుకుంది ఆంధ్ర జనాభా. ఆయన ఎంత తాత్వికుడో అంత సాత్వికుడు. ఎంత మాటపొదుపరో అంత హాస్య చతురుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇవాళ ఎనభై వసంతాలు చూసిన తెలుగు టాకీ ఆయన రచనలతోనే చిగురులు తొడుగుకొంది. 'మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే' పాట పాడుకుంటూ ఆచార్య ఆత్రేయ 'ప్రేమ నగర్' లో ప్రవేశిస్తున్నారు. అక్కడ కొంత దూరంలో 'అనురాగం' కాలనీ లో ఉంటున్న మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చెవిని పడ్డాయి ఆ మాటలు. 'ఇక్కడి కొచ్చేశాక ఇంకా మనసు-- మనిషీ అంటూ ఏమిటోయ్ ఆత్రేయులూ?' అంటూ సిల్కు పంచె, లాల్చీ దాల్చిన మరు మల్లె పువ్వంటి శాస్త్రి గారు నవ్వేశారు. 'అయ్యా.. నేను మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చి వచ్చి ఈ స్వర్గ సీమ లో పడ్డాను. అదీ ఈ సెప్టెంబర్ నెలలోనే. అదీ ఒక్క రోజు తేడాలో. ఎటొచ్చీ మరీ షష్టిపూర్తి చేసుకునీ ఇహ చాల్లే అని మీరు తనువు చాలించేరు. నేను ఇంకొన్నాళ్ళు నా మహా కాయాన్ని, తెలుగు పాట అనే మహా గాయాన్ని మోసుకొచ్చేను.' 'అవును కదూ. నేనా- సెప్టెంబర్ 12 న , నువ్వా 13 న , ప్చ్ ! అయినా తెలుగు పాట అనే మహా గాయం అంటావేం? తెలుగు వారి చేత తన్నులు తినడం ఖాయం!' 'కాకపొతే ఏమిటి చెప్పండి శాస్త్రి గారూ. మీతోనె తెలుగు పాట కదా - అది మీరు లేక ఎటూ దిక్కు తోచక జ్వరం తెచ్చుకునీ సంధి ప్రేలాపన చేస్తూ వచ్చి ఇంక లాభం లేదని కోమాలో పడిపోయింది' 'కోమా నయం కదా, కామా కన్నా' 'కామా వే, కోమా కాదు. ఎందుకంటే సంధి ప్రేలాపన మరీ హెచ్చయ్యింది' 'పోన్లేస్తూ. ఎవరి తరం వారిది.' 'మీరు రాసిన కథలు, మీ పాటలు మళ్ళీ మళ్ళీ చదివిస్తేనే గానీ తెలుగు బాగు పడదండీ' 'అన్నగారు సముద్రాల ఎంతో బిజీ గా ఉంటుంటే కొన్ని పాటలు రాశానని, నిజం చెప్పండనీ ఎందరో నిలదీసే వారు. మీ పేరెందుకు రాలేదు అని గొడవ చేసారు. పోనీ ఇద్దరి పేర్లూ చేర్చవచ్చు కదా అని గొణిగే వారు. ఇదంతా ఎందుకు. పోనీ నువ్వన్నట్టు నాదేదో వేరే తెలుగనుకుంటే దాన్ని పట్టుకునీ నా రచనలు పోల్చుకోవచ్చునే!' 'సముద్రాల వారు చక్కని ప్రాసలు వేస్తారు. మీరు కమ్మటి పదాలు రాస్తారు. ఇదే తేడా. ఇవి రెండూ కలబోసి ఆరుద్ర తన ముద్ర బయట పెట్టేడు. ఇక నేనంటారా-- నేను ఏది రాసినా 'మనసు' పెట్టి రాస్తానని ఒక నమ్మకమేర్పడి పోయింది తెలుగు ప్రజకి. నన్నేకంగా 'మనసు కవి' అన్నారు. అంటే అనననీండి కానీ నేను మాత్రం మిమ్మల్ని 'మన కవి' అంటాను. అంటేమనిషికి నచ్చిన కవి అని.' అవునా కాదా? అని అడగాల్సింది పోయి ఇంకా 'ఔనా నిజమేనా?' అని ఆశ్చర్యపోయే వారున్నారంటే ఆమె ఈ భూమ్మీద లేదు కనుక సరిపోయింది. ఉంటే మాత్రం 'మట్టిలో మాణిక్యం' లో చలం వదినలా పట్టుకు 'ఝాడించేది'. అంటే 'చండీ రాణి' లా చీల్చి చెండాడేస్తుందని అనుకుంటే తప్పు తప్పు. ఆమె కోపం గబుక్కున పొంగి పడిపోయే పాలవంటిది. ఆమె మనసు వెన్న లాంటిది. ఆమె గాత్రం కమ్మని పెరుగు లాంటిది. ఆమె మాట తీయ తేనియ. ఆమె నటన సెలయేటి ధీమా. వెరసి ఆమె పంచామృత పాళి. పేరు పి. భానుమతి. సెప్టెంబర్ 7 న ఆమె జయంతి. అదేం చిత్రమో 'వర విక్రయం' ఆమె తొలి సినిమా. ఇక మూడోది- 'ధర్మపత్ని'. ఐదో సినిమా 'కృష్ణ ప్రేమ'! ఇవన్నీ ఎంత నిజమో కృష్ణ ప్రేమ టైములోనే ఆమె పడిపోయారన్నది అంతే నిజం. ఎక్కడ? ప్రేమలో! రామకృష్ణ ఆమెలోని కళా తృష్ణ కి గొడుగై నిలిచారు. గృహమే కదా 'స్వర్గసీమ' అనుకునీ సాధారణ దంపతుల్లాగే బతికారు. మధ్య తరగతి 'గృహ ప్రవేశం' వారిది. వారి సంసార 'రత్న మాల' భరణి అనే కొడుకు రూపంలో అవతరించింది. ఆ కొడుకు పేరిట స్థాపించిన 'భరణి' సంస్థ వారికి 'రక్ష రేఖ'. ఇక ఎ.ఎన్.ఆర్ , ఎన్.టీ.ఆర్. వంటి 'అపూర్వ సహోదరులు' ఆమెతో నటించి 'నటీమణులందు ఈ భా.మ వేరయా' అని తేల్చి చెప్పేరు. Click to Zoom అవును- ఆ ప్రముఖులిద్దరూ నేడు లేరు. గురువారం రాత్రి (సెప్టెంబర్ 1, 2011), తెల్లవారితే శుక్రవారం అనగాశ్రీనివాస్ ఖలే అస్తమించారు. శుక్రవారం (సెప్టెంబర్ 2, 2011) నండూరి రామమోహన రావు ఆయన్ని అనుసరించారు. స్వరం.లయ, తాళం, గానం, భక్తి అన్నీ గణపతి దేవుడిలో ఉంటాయని కాబోలు ఎనభై వయసు దాటిన శ్రీనివాస్ ఖలే ఆత్మ ఆ బొజ్జ దేవరలో మొన్న నిమజ్జనమై పోయింది. మరాఠీ వారి ‘సంప్రదాయ ధ్యేయం’ ఆయన. నండూరి వారిది ఎనభై నాలుగేళ్ల సుదీర్ఘ జీవన యాత్ర. రచనా పాంథికుడిగా ఇంక నడవలేను, అలసిపోయానని ఆఖరి వాక్యానికి నిన్ననే ఫుల్ స్టాప్ పెట్టేశారు ఆయన. తెలుగు వారి ‘సంపాదకీయం’ ఆయన. ఖలే అంటే ఆరు శతాబ్దాల సంగీత బాణీ. ‘ఖలే కాకా’ గా ఆత్మీయుడైన పెద్ద దిక్కు. లతా దీదీ అన్నట్టు మరాఠీ సంగీత స్వర్ణ యుగానికి సంబంధించిన మూల స్తంభాలలో ప్రముఖుడు. లతా, భీమ్సేన్ జోషి వంటి రెండు భారత రత్నాల నొక చోట కూర్చోబెట్టి అందమైన స్వర మాల లో ఇమిడ్చిన గాన శిల్పి ఆయన. స్వంత బాణీ తో వాణీ సేవ చేసుకున్న పద్మ భూషణుడు. భాద్రపద మాసం, శుద్ధ చవితి తిథి అంటే ‘వినాయక చవితి‘ మనకి. భాద్రపద శుక్ల చతుర్థి – శ్రీ గణేష్ చతుర్థి మహారాష్ట్రలో. ప్రతి మాసం శుక్ల పక్షంలో వచ్చే నాల్గవ తిథి- చతుర్థి-ని వినాయక చతుర్థి అంటారక్కడ. ప్రతి నెలా బహుళ (కృష్ణ) పక్షంలో వచ్చే చతుర్థిని ‘సంకష్ట’ చతుర్థి అంటారు. శ్రావణ మాసం శుక్ల చతుర్థిని వినాయక నాగ చతుర్థి అంటారు. ఎందుకంటే ఆ మర్నాడు పంచమి నాడు ‘నాగ పంచమి’ కనుక. ఎడమ వైపు మీరు చూస్తున్న గణపతి పుణే లోని ప్రసిద్ధ దగ్డూ షేట్గణపతి మందిర మూర్తి. భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్ర దర్శనం నిషేధం. ఆకాశంలో నెలవంక ఇలవంక కవ్వించే రీతిలో చూస్తుంటే అప్రయత్నంగానే చూస్తాం. అయ్యో నిందలేనా అని ఆనక ఘొల్లుమంటాం. పాపం ఈ బోటు ఆకారం లో ఆకాశ నదిలో విహరించే చంద్రుడి బోటి వారికి శాపమేమిటో? అవును మరి- అంత పెద్ద బొజ్జతో గణపతి దర్శనమయ్యే సరికి శివుడి సిగలో హాయిగా కూర్చున్న ఈ బక్కపలచ వాడికి నవ్వొచ్చింది. అంతే ఫెడేల్న అంబ శపించింది. మిగతా పదకొండు నెలల్లో వచ్చే చతుర్థి నాడు జనం నిన్ను చూడొచ్చు కానీ ఒక షరతు – చూసినవారు ఉపవాసముండాలి అని పార్వతీ దేవిసవరించింది. అంతా మన మంచికేనేమో! ఆ రకంగా నెలకో మారు ఉపవాసముంటే ఆరోగ్యానికి మంచిదే. అసలు ఈ చవితి నాడు వినాయకుడు పుట్టాడా? కాదు. ప్రథమ పూజ పొందగలిగే ఏకైక వ్యక్తిగా, దైవిక శక్తిగా శివుడుగణపతిని ప్రకటించిన రోజు. గణపతి అనగానే తెలుస్తోంది- గణాలన్నిటికి అధిపతి అని. అందుకే మహా గణపతి కూడా. గణేశుడు- అంటే గణాల ఈశుడు. గణాల దేవుడు. ఏ పూజకైనా తొలి నామ పఠనం గణేష్ దే కనుక ‘ప్రధమేష్’ అయ్యాడు. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|