మునుపటి నా మాట
మూడు మాటల్లో – అదీ మూడు భాషల కలగా పులగం చేసి -చెప్పడం ఎందుకంటే ఇవాళ విలక్షణ గాయని శ్రీమతి వాణీజయరాం పుట్టిన రోజు (30 నవంబర్) కనుక. కాబట్టే- 'ఈరోజుమంచిరోజు-- మరపురానిది'. అందుకే- 'మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మా'. వాటితో పాటు చలికాలం 'ఎండలన్నిపూలజల్లులై' చెప్పే నమ్మలేని నిజం ఏమిటంటే- ఆమె కిప్ప్పుడు అరవై ఏళ్ళు అన్నది. ఇంకా ఇంకా అబ్బురపరిచే మాట ఏమిటంటే – ఇప్పుడూ ఆమె గళం మనం ఎప్పుడో డబ్భైల్లో విన్న గొంతులాగే ఉండడం. ‘బోలేరే పపీహరా’ హిందీ పాట ఒక సారి, ‘ఏళు స్వరంగళ్‘ తమిళం పాట ఒక సారి, ‘ఎప్పటి వలె కాదురా నా స్వామీ’ తెలుగు పాట ఒకసారి మనం మననం చేసుకుంటే గనుక, అవి ఆమెకు దక్కిన తొలి వరాలనే వివరాలు ముందస్తుగా తెలుసుకుంటే గనుక, అంతలోనే శంకరాభరణం, స్వాతి కిరణం లోని పాటలు మస్తిష్కంలో మసలుతుంటే గనుక ఆమె ఇప్పుడు అందిస్తున్న అనేక సీడీల లోనూ ఆమె గొంతు రవ్వంతైనా మారలేదనీ, పైగా ఇంకా ఇంకా బావుందనే నిర్ణయానికి రాగలం. అసలు పుట్టుకతోనే కోకిల స్వరం వరం తో పుట్టిన ఆమెకి ఏడాదికొక వరం చొప్పున కేటాయిస్తే ఈ అరవై వసంతాల్లో ఆమె అరవై వరాలు పొందినట్టే కదా. అవే తమిళంలో ‘వరంగళ్’ అయ్యాయి. కర్ణాటక కి చెందిన జయరాం అనే సితార విద్వాంసుడు తన జీవితంలోకి రాక ముందు ఆమె తమిళనాట వెల్లూరు అమ్మాయి. ఆ తరువాత సంగీతం ప్రవృత్తి గానే చేసుకునీ ముంబై లో అడుగు పెట్టిన బ్యాంక్ ఆఫీసరు. మహారాష్ట్ర ఎవరినీ ఊరికే వదిలేయదు. పైగా నాట్య సంగీతానికి అది పుట్టిల్లు. ఆమె కర్నాటక, హిందుస్తానీ అనే రెండు భిన్న సంగీత రీతుల్ని ఒకే త్రాట నడిపిస్తుంటే అంతటి ప్రతిభావంతురాలికి న్యాయం జరగాల్సిందే కదా. అప్పుడే దొరికారు ఆమెకి వసంత్ దేశాయ్ అనే గురువులు. నాట్యసంగీత కచేరీలలో ఆమె చేత పాడిస్తూ ప్రోత్సాహించారు. అప్పుడే జయరాం అనే సుగుణాకరుడు ‘నీ చేయి విడువను’ అని చేయూత ఇచ్చారు.
0 Comments
అన్నట్టే నాలుగు రోజులు గడిచాయి కనక మళ్ళీ మరిన్ని 'ఈల'పాటలు- పూర్తిగా తెలుగువే- వినిపించాలని, ఈలల మధ్య కా' సిన్ని మా' కబుర్లు కూడా చేర్చాలని ఇవాల్టి ప్రయత్నం. అలనాటి హీరో దేవానంద్ ఇప్పటి వయసు ఎనభై అయినా సినిమాలు (ఎవరు చూసినా చూడకపోయినా సరే ) తీసి 'పారేయడమే' ధ్యేయం గా పెట్టుకోవడం ఆశ్చర్యమే మరి. అదే ఎనభై వయసులో ఉన్న దర్శకుడుబాపు ఇన్నాళ్ళు ఆగి 'లవకుశ' ని తిరగ రాసి రమణ సాయం లేకుండానే 'శ్రీరామరాజ్యం' చిత్రకళా ఖండం చూపించి 'హిట్' లర్ అయి అందరి చేతా శాంతంగా బాల నయన తారక మంత్రం జపించేలా చేశారు. అయితే ఇదివరకే ఆయన లవకుశ సాంఘిక ప్రతిని ముత్యాల ముగ్గు గా తీర్చి దిద్దిన సంగతి మనకి తెలిసినదే. అహోబాపూ, ఈ లీల మీ పునర్దర్శనం కావడం మా చేత ఈల వేయిస్తోంది. దేవానంద్ తోనూ,బాపు-రమణ ల తోనూ ఇప్పుడు కొంచెం పనుంది. ఇప్పటికీ దేవానంద్ అందరికి గుర్తున్నా ఇంచుమించు ఆయన లాగ కనిపించే నటుడు రామ్మోహన్ (కనుకనేఆంధ్రా దేవానంద్ అనేవారు) ని మాత్రం చాలామంది మరిచిపోయే ఉంటారు. నట శేఖర కృష్ణతో తెలుగు తెరంగేట్రం చేసిన రామ్మోహన్ ( తేనెమనసులు ) కి తొలి తెలుగు రంగుల సాంఘిక చిత్రమే తొలి చిత్రం కావడంఆదుర్తి సుబ్బారావు కల్పించిన అదృష్టం. అయితే అందులో దాశరథి వారి దివినుండి భువికి దిగివచ్చే పారిజాతంపాట సముద్రపొడ్డున చిత్రీకరించడం వల్ల రామ్మోహన్ వేషధారణ కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. పైగా ఆదుర్తివారి పాటల్లో పాత్రలు ఊరికే గడ్డివాము మీద దేకుతుంటాయి ( తేనెమనసులు లో ఈ పాట లాగే బుద్ధిమంతుడు,పూల రంగడు పాటలు ఉదాహరణలు). రామ్మోహన్ కి వెంట వెంటనే ఆదుర్తి వారి దర్శకత్వంలోనే మరో మనసులు చిత్రం- కన్నె మనసులు- దక్కింది. రమణ గారి బుడుగు చెప్పే ప్రైవేట్ మాస్టారి గురించి బహుశాఆదుర్తి వారు విన్నారేమో ఆయన రామ్మోహన్ తోనే ప్రైవేట్ మాస్టర్ సినిమా తీశారు. 19 నవంబర్ – ఈ రోజుకో ప్రత్యేకత ఉంది- దివంగత ప్రధాని ఇందిరా గాంధి జయంతి. నవ భారతంలో తనదైన ఒక వినూత్న శైలిలో దేశాన్ని అభ్యుదయం వైపు నడిపించిన స్త్రీ మూర్తిగా, రాజకీయ నాయకురాలిగా ఆమె నంతా ఎరుగుదురు. ఒడిశా లో చివరి ప్రసంగంలో – తన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు దేశానికే అంకితం – అని ఉద్ఘాటించిన ధీరురాలు. చివరికి అనూహ్యంగా రాజకీయ చదరంగం లో పావుల కదలికలో తేడాలొచ్చి స్వీయ రక్షక భటుల తూటాలకే బలై పోయిన అమాయకురాలు. ఆమె పాలనలో ఆమె ప్రకటించిన ఎమెర్జెన్సీ అనేది తప్పు దారి పట్టిపోయి అదో చీకటి అనే భావన కలిగించింది ఆనాటి డబ్భైలలో. అది మినహాయిస్తే – మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం అని అంటూనే మన ఇందిరమ్మ కలలు కన్న మరో ప్రపంచం అని మహాకవి శ్రీశ్రీ వంటి వారి చేత కూడా పొగడ్తలందుకున్న ఏలుబడి ఆమెది. మరో కవి ‘ఆదర్శనారిఇందిరా గాంధి’ అంటూ ‘నేనూ నా దేశం – పవిత్ర భారత దేశం’ లో చరితార్దులైన వారి లిస్టులో ఆమెను చేర్చారు. బహుశా మొత్తం దేశంలో ఇలా రెండు తెలుగు పాటల్లోనే ఆమె ప్రసక్తి రావడం గమనించవచ్చు. ఎమెర్జెన్సీ ఎత్తివేయగానే దేశమంతటా ఒకటే ‘ఈలలు’. ఇందిరమ్మ సమక్షంలో తన ‘ఈలపాట’ వినిపించిన ఘనత మన కళ్యాణం రఘురామయ్య గారిదే. ఆయన ఎంతటి ప్రతిభావంతుడంటే అసలు పేరు వెంకట సుబ్బయ్య ఐతే తన ‘రఘురాముడి’ పాత్ర తో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారినే ఆశ్చర్య పరచి ఆయన నోటి చలువచేత ‘రఘురామయ్య’ గా మారిపోయారు. ఇక కలకత్తా లో రవీంద్ర కవినే మెప్పించి ఆయన ద్వారా ‘దక్షిణ నాటక కోయిల’ అనే బిరుదు పొందారు. ఒక పక్క నాటకం, సినిమా, పాట, పద్యం – అనే చతుర్విధ కళల తో పాటూ ‘కూ’ అనే పంచమ స్వరం పలికించే కోయిల లాగ ‘ఈల పాట’ ఒకటి బోనస్ గా సంపాయించుకున్నారు. అలా పంచముఖు డయ్యారు. ఆయన్ని ‘మురళి లేని కృష్ణుడు’ అని అనే వారు. నాలుక కింద వేలూని అదే వేణువుగా మార్చుకునీ ఆయన కీర్తనలు ఆలాపించేవారు. ఆయన మరణానికి పూర్వం విజయ చిత్ర మాస పత్రిక ఆయన మాటలు, ఇందిరమ్మ సమక్షంలో ఆయన ఈల పాట వినిపించినప్పటి ఫోటో ప్రచురించింది. ‘తిరుగు లేని మాట’ దారిలో ఒక సారి తిరిగి వచ్చి ఇటు వస్తారా? Click to zoom నాలో నేను: సప్త స్వరాలు ఎన్ని? ఏమిటా ప్రశ్న? అందులోనే జవాబు ఉంటేనూ? సరిగమ పదని - అలా ఎందుకున్నాయి? సరిగ పదమని- ఎందుకుండవూ అనేగా నీ సందేహం. ఇవన్నీ సకారం గానే ఎందుకున్నాయి? సర్వేశ్వరుడి 'సర్వే' లో తేలిందేమిటి? మీతో నేను: అనగనగా ఒక విజయనగరం. కొందరికేమో విజీనారం. రైల్వే స్టేషన్ బోర్డ్ కయితే Vizianagaram. అక్కడ పులపాక వారింట శేషమ్మ, ముకుందరావు ల సంతానం ఒకటుంది. పేరు సుశీల. ఈ పాపాయివి పెద్ద చెవులు. ఎన్ని భాషలైనా ఇట్టే ఇమిడిపోగలవు. త క తె అని ఎవరో తాళం వేస్తే అవి తమిళం, కన్నడం,తెలుగు గా గ్రహించి ఆ మూడు భాషల్లో ఎప్పటికైనా సినీ గీతాలు పాడి తీరడం పాడి కదా అని పట్టు పరికిణీ దశలోనే పట్టు బట్టిన పండితురాలు. తండ్రి కోర్టు కెళితే చేతినిండా దస్తావేజులే కాని ఇంటికి తిరిగి వస్తే అదే చేతినిండా వీణ మీటు మోజులే. ఆయన 'తాన' అంటే 'తందనాన' అని తల్లి కూడా వప్ప చెబుతుంది. ఇంత చక్కని నేపధ్యం - చిన్న సుశీలని చిత్ర సీమ కి అచిరకాలంలోనే 'నేపధ్య గాయని' గా నెలకొల్పేందుకు దోహదం చేసింది. అప్పటికి ఏ చోట విన్నా రెండు చెవులకీ విందుగా ఇద్దరి గాత్రాలు - సుశాస్త్రీయంగా ఎం ఎస్ సుబ్బులక్ష్మి వారిదొకటి, సలిలతంగా లతా మంగేష్కర్ వారిదొకటి- విన్పిస్తున్నాయి. అలాంటి విందు అందుకోవడేమే కాదు, వారిలా తానూ అందివ్వాలని పట్టుదల పెరిగింది. 2: ముందు నువ్వు 'అన్నా అన్నా విన్నావా' అని ట్యూన్ లో పాడుతూంటే వింటున్నాను- అదా సంగతి- ఏదీ మన సుసర్ల దక్షిణామూర్తి గారి గురించేనా నువ్వంటున్నదీ? 1: నూటికి నూరు శాతం ఆయన --- అదే ఆ మహానుభావుడి గురించే. 2: ఆ పాట కూడా ఆయన కట్టినదే—ఐతే ఇబ్బంది ఏమిటంటే దాని మాతృక ఓ హిందీ పాట, బొంబాయి రవి అంటారే ఆయన కట్టినది. 1: అలాంటివి తెలుగు సినిమాల్లో తప్పని గానీ, సరి అనిగానీ అనలేం. తప్పని సరి –అంతే! 2: శ్రీశ్రీ జోకులాగ ఉందే- 1: నువ్వన్న ఆ పాట – 'చందామామా దూర్ కే పుయే పకాయీ బూర్ కే' . గమ్మత్తేమిటంటే సుసర్ల వారి చాలా పాటల్లో చందమామ, వెన్నెల ఉంటాయి. అలా ఈ హిందీ చందమామా కూడా తెలుగయ్యాడు. 2: అంటే గుర్తొస్తున్నాయి- ‘చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో’ అన్నది సంతానం నుంచి ఒకటి, ‘చల్లని రాజా ఓ చందమామా’ అన్నది ఇలవేల్పు నుంచి ఒకటి, ‘అందాలా చందమామా’ అన్నది సంసారం నుంచి ఒకటి. ఇంకా-- 1: సుసర్ల వారూ, సుశీల పాడిన యుగళ గీతం ఉంది కదా- చల్లని పున్నమి వెన్నెలలోనే ఒళ్ళు దహించే వేడి ఎందుకో? – అది కూడా ఇలవేల్పు సినిమా నుంచే. 2: ఇదేదో పింగళి వారు రాసిన ‘వెన్నెలలోనే వేడి యేలనో వేడిమిలోనే చల్లనేలనో’ పాటని తలపోస్తోందే! ‘తూర్పు పడమర ఎదురెదురు- కలవని దిక్కులు కలవవని’ సినిమా పాట చెప్పింది. నిజానికి ఆ మాటలు కళా రంగానికి, ముఖ్యంగా సినీ రంగానికి ఎంతమాత్రమూ నప్పవు. తూర్పు, దక్షిణం,పడమర, ఉత్తరం – ఈ నాల్గు దిక్కుల నిత్య సంచారి సూర్యుడు. ఒక చోట ఉదయిస్తే ఒక చోట అస్తమించడమన్నది భూమాత కల్పిస్తున్న దాగుడుమూతల ఆట, భ- అనే అక్షరం ప్రకాశానికి చెందినది. దానికి ఉకారమిచ్చి, దీర్ఘమిస్తే – భూ-అనే ధాతువు ‘పుట్టి’ , భూ: అనే స్త్రీ వాచకమై ‘భూమి’ కి చోటిస్తుంది. భూప: అంటే భూపతి లేదా రాజు అనేగా అర్ధం? ఇనుడు- అంటే సూర్యుడు. వెరసి భూపేనుడు అనే మాటకి ఏమిటి అర్ధం అనేది వేరే చెప్పనక్కర్లేదు. కాని వేయి కిరణాల సూర్య తేజస్సుతో మహారాజ ఠీవితో వెలిగిన వాడే ‘భూపేన్ హజారికా' అంటే అతిశయోక్తి అనుకోరు కదూ. అన్ని దిక్కులకూ ఒక్క సూర్య కాంతే జీవం పోస్తుంది. అలా ప్రపంచం ఎప్పుడూ నొచ్చుకోని, ఎల్లవేళలా మెచ్చుకున్న ఏకైక వ్యక్తి ‘భూపేన్ హజారికా’ అనే ‘రాజు’ అంటే అదీ ‘సత్యం’ కాదు అని ఎవరైనా అనగలరా? భూపేన్ సూర్యుడు తూర్పున (అసోం లో) ఉదయించడం, పడమట (ముంబైలో) అస్తమించడం ( 05 నవంబర్ 2011, 86 యేళ్ళు ) కాకతాళీయం కాదేమో, దైవ నిర్ణయమేనేమో! అంతే కదా- ఈ దీపం పేరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఈ దీపం వెలిగే ముందు ఆ దీపం ఆరిపోలేదూ- పొట్టి శ్రీరాములు గా తెలిసిన ఆ దీపం సదా స్మరణీయం.. ఈ దీపం ఎందుకు వెలిగింది? – చుట్టూ అలముకున్న చీకట్లు చీల్చడానికనీ. ఆ దీపం ఎందుకు మలిగింది? – అప్పటి చీకటి రాజ్యం తన మొండి పెత్తనం అనే గాలిని విసిరినందుకు. దీపం అవసరం ఎప్పుడుంటుంది? – మా తాతగారు రూళ్ళ పుస్తకం ఒకటి పెట్టి అందులో ‘కలం’ వాడి కొన్ని సూక్తులు రాసుకునే వారు. అందులోది ఒక సూక్తిగురుదేవ్ రవీంద్ర కవిది నాకు బాగా గుర్తుంది. ‘అస్తమిస్తూ అస్తమిస్తూ సూర్యుడు అనుకుంటాడు- అయ్యో నే వెళ్లి పోతున్నానే, ఇక లోకానికి దిక్కెవరూ? అని. మట్టి ప్రమిదలో మిణుకు మిణుకుమంటున్న తైల దీపం అంటుంది- ‘ నా చేతనైనంత నే సాయపడతాను ప్రభూ, అని.’ ‘సూర్యుడి ముందు దివిటీ’ అనే నానుడితో కొట్టి పారేస్తాం కానీ, ఇదిగో ఇలా సూర్యుడు మలిగి నప్పుడే దీపం వెలిగితే ఒక ధైర్యం, ఒక రక్ష, ఒక స్థైర్యం ఏర్పడతాయి. అలా దీపం అవసరం అర్థమౌతుంది. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|