మునుపటి నా మాట
"నమస్కారం మాస్టారూ...ఇవాళ భోగీ పండగ. రేపు సంక్రాంతి. తరువాత కనుమ!" మూడు పండుగల ముచ్చట్ల మధ్య మన అందరి ఇళ్ళల్లో సుఖశాంతులు వర్ధిల్లాలని నా ఆశ బాబూ.. "మాస్టారూ... మిమ్మల్ని ఇలా తలుచుకోగానే పాట రూపంలో ప్రత్యక్షమైపోతున్నారు కదా.. కొందరికో కోరిక కలిగింది. ఈ చలికాలం సందర్భంలో మాస్టారి పాటల్లో ఎంచి మరీ ‘చలి’ పాటలు ఇవ్వొచ్చు కదా అని. ఒకరైతే మీరు ఆస్తిపరులు సినిమాలో పాడిన చలి చలి చలి వెచ్చని చలి .. పాట కావాలని అడిగారు. అసలు మీ పాటలే ఒక ఆస్తి. చలికి వణికినా, వేడికి ఉస్సురనినా, వానలో తడిసినా, దప్పిక కలిగినా...ఒక్కొక్క అనుభవానికి ఒక్కొక్క పాట అమర్చుకుంటూ పోతూ ఆ సంపదకి మురిసిపోయే వారంతా ఆస్తిపరులే." మహానుభావుడు ఆత్రేయకి చలి వెచ్చగా తోచినట్టే మహాకవి శ్రీశ్రీకి నీడ వెచ్చగా తోచింది. ఒక బెంగాలీ గీతం వరసలో నా హృదయంలో నిదురించే చెలీ ...అనే పాట రాసిన శ్రీశ్రీ గారు ఒక చోట ‘నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ’ అని అంటారు. అలా రెండు వెచ్చని పాటలు నా చేత పాడించారు, మాన్యులు మహదేవన్, రాజేశ్వరరావులు. "చినుకు పాటలకి ఆద్యుడైన ఆత్రేయ గారు చిటపట చినుకులు పడుతూ ఉంటే ...కలిగే చెప్పలేని హాయి ‘వెచ్చగ’ ఉంటుందని.. సాపేక్ష సిద్ధాంతం మేడీజీ అన్నట్టు చెప్పారు. మామ మహదేవన్ చినుకుల అనుభూతిని ఎంత గొప్పగా పలికించారూ అటు వాయిద్యాలతో, ఇటు మీ గళాలతో. రాజేశ్వరరావు గారికి మీరు ఎంతో అభిమాన గాయకులు. అయితే ఆయన స్వరాలు కూర్చిన రెండు చిత్రాలు- మిస్సమ్మ,విప్రనారాయణ ..చిత్రాల్లో మీ చేత పాడించలేదు. ఆయన పేరులోని రెండో భాగంలో మీరున్నా మొదటి భాగంలో రాజ అనే మాట ఉండడం చేత ఎ. ఎం. రాజా వారు ముందుకొచ్చారో, ఏమో ...ఊరికే లెండి అంటున్నా.."
ఆ సినిమాల్లో రాజా చక్కగా పాడారు బాబూ.. అప్పు చేసి పప్పుకూడు సినిమాలో నేనూ రాజా ఉభయులం పాడలేదూ? అదీ మా రాజేశ్వరుడి చలవే కదా? మాయాబాజార్ చిత్రంలో యుగళగీతాలు ఆయన స్వర పరచినవే. తతిమ్మావి నేను చేశాను. "సుందరాంగుల ముందు పురుషుల భావావేశం ఎటువంటిదో బ్రహ్మచారులైన పింగళి వారు ఎంత నిర్మొగమాటంగా ఆ రోజుల్లో సెలవిచ్చారండీ...ఆత్రేయ,శ్రీశ్రీ గార్ల ప్రస్తావన వచ్చింది కనక మీతో ఒక విషయం ముచ్చటించనా అండీ?" ఒకటేమిటి బాబూ... వారి ముచ్చట్లు చెప్పుకొంటూ ముజ్జగాలు ఇట్టే చుట్టి రావొచ్చు. "అదేనండీ.. వారు వీరైతే అన్నట్టు వీరిరువురూ వైవిధ్యంగా చెరొక పాట రాశారు. అవి మీరు పాడిన సోలోలు. సాధారణంగా పాటలో ‘మనసు’ మాట పడితే అది ఆత్రేయ కలం అనీ, ‘మనిషి’ అనగానే శ్రీశ్రీ కలం అని శ్రోతలు పోల్చుకునేవారు. అలాంటిది ‘కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి చానా’ అనే పాటని ఆత్రేయ రాస్తే ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము’ అనే పాటని శ్రీశ్రీ రాశారు. ఈ వైవిధ్యాన్ని అంతే వైవిధ్యంతో మీరూ పాడారు. ఇది మాకొక వరం." వరం అని అనుకోగానే సరిపోదు. మహా నటగాయని ఎస్. వరలక్ష్మి, నేనూ పాడిన మా పామర్తి వరస ‘నీ సరి మనోహరి’ మన శ్రోతలకి అందివ్వు బాబూ. పామర్తి వారు శ్రీ తిరుమతమ్మ కథలో నా నోట మంచి కళ్యాణ గీతికను పాడించారు కూడా. "సమయానికి గుర్తు చేశారు మాస్టారూ... బభ్రువాహన చిత్రంలోని ఆ పాటతో పాటు ఆమె నటించగా మీరు పాడిన ఒక పాట సన్నివేశం చూపిస్తాను. ఇవి రెండూ మహానటుడు నటరత్న నందమూరి తారకరామారావుని మన కళ్ళముందు నిలుపుతాయి. ఇదే జనవరిలోనే, ఇలా ఈ మూడు పండగల సమయంలోనే ఆ తారకరాముడు మనందరినీ కాదని దూర తీరాల తారాలోకం చేరుకున్నారు, పూవై విరిసిన పున్నమి వేళ చీకట్లు మిగిల్చి." అంటే.. అది మా లోకమే కదా బాబూ.. అదిగో ఆయన తనదైన శైలిలో ..రక్తసంబంధం సినిమా ఫోటో స్టిల్ అభినయిస్తూ నా ఎదురుగా కూర్చునీ నవ్వుతున్నారు. ఇంతకీ రామారావుగారూ, వరలక్ష్మి గారూ నటించిన ఆ రెండో పాట మా పెండ్యాల వారి భాగేశ్రీ కదూ బాబూ .. "అంతే కదండీ...అలిగితివా సఖీ ప్రియా కలత మానవా....పాట ప్రారంభంలోనే ఆ ‘అకారం’ మీద మీరు ఎన్టీ ఆర్ వారి ఆకారం నిలిపారు...అనితరసాధ్యం అండీ మీ ఈ ఉభయ తారక కుశలోపరితనం... ఉభయ తారలంటే రెండో ఆయన అక్కినేని వారు. మాకో అనుమానం...మీ కళ్ళలోకి తేరిపారా చూస్తే వీరిద్దరూ చెరోవైపు కనిపిస్తారేమో అనీ... మాస్టారూ... అక్కినేని వారు గతేడాది డిసెంబర్ 30 సాక్షి వార్తా పత్రికలో అపర దానకర్ణులు చిత్తూరు నాగయ్య గారిని స్మరించుకున్నారు. యోగి వేమన చిత్రంలో నాగయ్య గారు కేవలం తన వీపు చూపడం కాదు వీపు నటించేలా చేశారు అని ఆయన అన్నారు. ప్రతి నటుడికి తన పూర్వ పథంలో నిలిచిన నటుడు ఆదర్శమౌతారు కదండీ.." నటులకే కాదు..మావంటి గాయకులకూ అంతే. ప్లే బ్యాక్ రాక ముందు సినీ రంగాన రాణించినవారందరూ నట గాయకులే. ఇక నాకు సర్వత్రా పూజ్యులు నాగయ్య గారు, మరొకరు నన్ను వెన్ను తట్టి నడిపిన మిత్రులు నాగేశ్వరులు. వీరు నాకు నాగ దేవతలు. నాగయ్యగారికి నేను పాడాలని ఎప్పుడూ ఆశించలేదు. ఆయన నా తొలి సినీ మార్గదర్శి. అక్కినేని హీరో అయిన శాంతినివాసం లో తమ్ముడు శ్రీనివాస్ చేత పాడించాను, నాగయ్య గారు నటించే పాటని. కాని ఎన్టీఆర్ గారు శ్రీరాముడైన లవకుశ చిత్రంలో మాత్రం వాల్మీకిగా నటించిన నాగయ్య గారికి పాడడం కూడా నా వంతైంది. "నాగదేవతలు అని మీరన్నారు...మంచి మాట సెలవిచ్చారు.. పూలరంగడు చిత్రంలో నాగయ్య గారు, ఎ ఎన్ ఆర్ గారు తండ్రీ కొడుకులుగా నటించారు. ఒకరికొకరు తెలియని దశలో చెరసాలలో కలుసుకునీ వారుభయులు పాడుకునే ...చిల్లర రాళ్ళకు మొక్కుతువుంటే ....అనే పాట అది. నటగాయకులైన నాగయ్యగారు, మీరూ ఆ పాట పాడారు. మీరుభయులు కలిసి పాడిన పాట బహుశా ఇదొక్కటే. ఇది కూడా మాకు ఆ రకంగా ఒక దివ్య వరం. మీరూ నట గాయకులే. శేష శైలవాస శ్రీవేంకటేశ...పాట వినడమే కాదు చూడడం కూడా మీ అభిమానులకి ఒక వరం." బావుంది బాబూ.. వరం వరం అంటూ మరి జనవరి సగంలోకి వచ్చేశావు కదా.. నాకు గుర్తున్నంత వరకు సంక్రాంతి పాటలు రెండు నేను పాడినట్టు గుర్తు.. అవి వరాలేనా , కావా? "ఎంత మాటండీ మాస్టారూ... మీ ప్రతి పాట మాకో వరాల మూట... ఈ పూట నా మాట – మీ పాట వరాల మూట. అసలు ‘జనవరి’ అంటేనే జనం వరించిన అని అర్థమేమో. అది మీకు తగునేమో. మీ సంగీతంలో వచ్చిన పల్లెటూరు చిత్రం అరవై ఏళ్ళక్రితం వచ్చిందండీ. అందులో ఉంది మీ తొలి సంక్రాంతి పాట. అరవైయేళ్ళ కాల చక్రం పునరావృతం అవుతుంది కనుక అదే నందన నామ సంవత్సరంలో ఇప్పుడు మేమున్నాం. ఎటొచ్చీ ఈ సారి నందనం అంత కళకళ లాడుతూ లేదు. మీరు దేవత చిత్రంలో పాడినట్టు ఒకనాటి ఉద్యానవనము నేడు కనము.." ఆ పాట పల్లవిలో శ్రీశ్రీ కవిగారన్నట్టు అంతా ఆ కనపడని వాడి గారడీ బాబూ. "ఆ పాటలో అంతటా ‘నీ’ అనే చెబుతారు కానీ వేలెత్తి దేవుడా అని ఎక్కడా ప్రస్తావించ లేదు. అబ్బో.. ఆ పాట గురించి శ్రీశ్రీ గారు ఇలా చెప్పారండీ... ‘బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక ..’ అనే పల్లవి వీటూరిది. అతని అనుమతి మీద, పద్మనాభం కోరిక మీద ప్రారంభంలోని సాకీ తో సహా దీన్ని పూర్తి చేశాను. కీర్తిశేషుడు కోదండపాణి తయారు చేసిన బాణీ రచయితను తికమక పెట్టేదిగా ఉంది. కష్టపడి నేను రాసిన పాటలలో ఒకటిగా దీనిని చెప్పుకోవాలి’ –అనీ” ఆ రోజుల్లో రచయితలు, సంగీత దర్శకుల మధ్య ఇలా ఒడంబడిక, ఒద్దిక ఉండేవి బాబూ. ఇప్పుడు కోదండపాణి గారినే తీసుకో.. ఈయన మహదేవన్ గారిని గురువుగా భావిస్తారు. మహదేవన్ గారికి ఒక సినిమాలో ఈయన బాణీ కట్టి ఇచ్చారు. నీ పేరు వేస్తానోయ్ అని మామ అంటే ఈయన ససేమిరా వద్దన్నారు. అంతకు ముందు కూడా పాణి తమిళం వెర్షన్ ఒకటి తాను చేసిస్తే తెలుగు వెర్షన్ కి మామ మెరుగులు దిద్దారు. "అవునండీ మాస్టారూ... ఆత్మబంధువు చిత్రంలో అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ...పాట, పాణి పదండి ముందుకు చిత్రం కోసం చేసిన ‘మనసు మంచిది వయసు చెడ్డది’ పాటల మధ్య కొంచెం పోలికలుంటాయి. రెండూ యుగళ గీతాలే. రెండూ మీరూ,సుశీల గారూ పాడినవే. రెండు చిత్రాలూ ఒకే ఏడాది..అంటే..1962 లో విడుదలయ్యాయండీ. యాభై ఏళ్ళు అయిపోయాయి. దేన్నీ మరువలేం! ఒక్కొక్కటి ఒక్కొక్క పండగలా అనిపిస్తాయి. కొన్ని మరీనూ...సంక్రాంతి లాగ!" సంక్రాంతి ...అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం లేదా సంక్రమించడం అని కదా అర్థం. అలా పన్నెండు రాశుల్లో జరుగుతున్నా ఈ మకరరాశి సంక్రమణం మాత్రమే కష్టజీవులకి ఎంతో హర్షదాయకంగా ఉంటుంది. గోరువెచ్చని సూర్యుడు ముందు ముందు ప్రచండుడైనా సువృష్టి నిచ్చి తమ పొలాల పంటకు సంతృప్తినిస్తాడని ఆశిస్తూ నలుగురితో ఆనందాన్ని పంచుకుంటారు. పల్లెటూరు సినిమా నాటికి వచ్చిన సంక్రాంతి పాటకి తరువాతి కాలం నాటికి వచ్చిన సంక్రాంతి పాటకి రాజకీయ చైతన్యం బాగా వచ్చిందనిపించదూ? "అవును మాస్టారూ... అమాయక కష్టజీవుల లౌకిక చైతన్యమే రాజకీయ మార్పుల్ని తీసుకు రాగలదు. అందుకు కవి తనవంతు ముందడుగు వెయ్యాలి. ‘కష్టజీవి’ కి రెండు వైపులా ఉండేవాడే కవి అని శ్రీశ్రీ గారు చెప్పేవారు." ఆ మాట నిజం చేస్తూ కొసరాజు కవిగారు సంక్రాంతి పాట రాస్తే నేను, సహ గాయకులతో పాడాను. నా మొదటి సంక్రాంతి పాట నేను స్వర పరచినది, మాన్యులు ఎమ్మెస్ రామారావు గారు పాడారు. చివరిలో ఆలాపన మాత్రమే నాది. చిత్రం ఏమిటంటే నా రెండు సంక్రాంతి పాటల రచయితల పేర్లలో ‘రాఘవ’ నామం ఉండటం! "ఆ రెండో పాట-కొసరాజు రాఘవయ్య చౌదరి గారి ---ఈనాటి సంక్రాంతి అసలైన పండగ... కష్టజీవులకది యెంతో కన్నుల పండుగ......అన్నదే కదండీ...సినిమా పేరు- మంచిరోజులొచ్చాయి. 1972 లో విడుదల." నలభై ఏళ్ళ క్రితం కదా.. అంతకు ముందు మంచిరోజులు వస్తాయి అని ఓ చిత్రం వచ్చింది. ఒక గమ్మత్తైన వరసని కోదండపాణి కూర్చారు. తెల్లనివన్నీ పాలనుకోకోయ్...అని నేను పాడినట్టు గుర్తు. "ఆ..సినిమా యాభైయేళ్ళ క్రితం వచ్చిందండీ.. అందులో జగ్గయ్య, జమున నటించారు. మంచిరోజులొచ్చాయి..సినిమాలో అక్కినేని,కాంచన నటించారు." ఆ రెండు సినిమా పాటలతో పాటు ఓ చిన్న ట్విస్టు ఇస్తూ జగ్గయ్య, కాంచనల మీద చిత్రీకరించిన పాట ఒకటి చప్పున తేగలవా బాబూ? "మీరంటుంటే.. నేవింటుంటే... నూరేళ్ళు అయినా ...మంచి రోజులు వచ్చాయి అని అన్నా, మంచిరోజులు వస్తాయి అని అన్నా మీ మంచి మంచి పాటల్నే ప్రేమిస్తాం, మేమిస్తాం." సరే బాబూ .. ప్రేమించి చూడు... "దొరికేరు పాట దొరగారు.. ఇక మమ్ము విడలేరు... అదేనండీ.. ప్రేమించి చూడు చిత్రం లోని శ్రీశ్రీ గారి రచన పాట వినిపిస్తాను...మాస్టారూ.. అందాల నటుడిగా పేరు పొందిన శోభన్ బాబు గారికి మీరు మంచి మంచి పాటలెన్నో పాడారు. నర్తనశాలలో ‘ఎవ్వరికోసం ఈ మందహాసం’ వింటుంటే సుసర్ల వారు వయోలిన్ పైన చూపించిన ఒయ్యారపు స్వర గమనం కూడా కనిపిస్తుంది. నటుడు శోభన్ మాకు లేరు. ఈ జనవరి పధ్నాలుగున ఆయన జయంతి. ఇందాక మీరు ‘రాఘవ’ అని గుర్తుచేశారు. మీ ప్రియ శిష్యుడు జే.వి.రాఘవులు ఒక టీవీ కార్యక్రమంలో మిమ్మల్ని తలచుకునీ వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఆయన శోభన్ బాబు నటించిన ‘జీవన తరంగాలు’ చిత్రంలో మీరు పాడిన మూడు పాటలు అద్భుతంగా స్వర పరిచారు. ‘ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు’ అని ఆత్రేయగారు అన్నట్టు రాఘవులు గారున్నారు మా మధ్య. బహుశా అందమైన మీ గురుశిష్య బంధానికి ముగ్ధులై ఆత్రేయగారు ‘ఈ అందానికి బంధం వేశానొకనాడు... ఆ బంధమే నాకందమైనది ఈనాడు’ అనే పాట రాశారు కాబోలు!" అదిగో.. శ్రీశ్రీ, ఆత్రేయ గార్లు ఇటు వైపు ఓ చూపు చూసి శోభన్ బాబు వైపు నడిచి పోతున్నారు. అదిగదిగో... మల్లెమాల అని మనం పిలుచుకునే ఎమ్మెస్ రెడ్డి గారు శోభన్ బాబు పేరు వినగానే రెండు కాయితాలు తీసుకొచ్చారు... చీటికిమాటికి చిటపటలాడే చిన్నది ఇపుడేమన్నది? అని ఒక దాని మీద , సంగమం సంగమం అనురాగ సంగమం ..ఇంకొక దాని పైన రాసి ఉన్నాయి. "నాగ దేవతలతో మొదలెట్టిన సంభాషణ ‘కోడెనాగు’తో ముగించమనా మాస్టారూ? ఉంటానండీ,, మళ్ళీ మిమ్మల్ని ఆన్ పబ్లిక్ డిమాండ్ రిపబ్లిక్ డే కి ఓ రోజు ముందు పిలుస్తాను.. మాటివ్వండి ప్లీజ్..." పాటిస్తాను! -డా. తాతిరాజు వేణుగోపాల్ , 13 జనవరి 2013 (పండుగ ప్రతేకం: 1967 జనవరి ‘విజయచిత్ర’ సంచిక నుంచి కొన్ని విశేషాలు 1992 విజయచిత్ర సంచికలో పున: ప్రచురిత మయ్యాయి. ఆ పాతికేళ్ళ కాలంలో వి.చి. బాహ్య రూపం ఎంతో మారిపోయింది. ఇప్పుడు వి.చి. లేదు. ఆ పత్రిక సమర్పించిన మధుర స్మృతులే మిగిలాయి. వి.చి. సౌజన్యంతో, వారికి కృతజ్ఞతలతో ఒక పేజీ మీరు 'తిరుగులేని మాట' లో చూస్తూ చదవండి. అందులో స్టారు ఎన్టీ ఆర్ ఉన్నారు. మాస్టారు ఘంటసాల ఉన్నారు.) (ఇక్కడ చెప్పుకున్న పాటలు అన్నీ కాకపోయినా ఇంచుమించు అన్నీ కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే ..లలో చూడండి, వినండి.)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|