మునుపటి నా మాట
‘అసలు రిపబ్లిక్ డే అనే కాదండీ, దేశంలో ఏ పండగొచ్చినా ఆ రోజు కన్నా మూడు రోజుల ముందరి నుంచే పండగ హడావుడి టీవీల్లో కనిపిస్తుంది. ఆ పండగని గుర్తు చేసే సినిమాలు ఊ తెగ వచ్చేస్తాయి. మీ కాలం నాటివి కాని రోజాలు, పాండేలు, నాయక్ లు, ఐ లవ్ మై ఇండియాలు కనిపిస్తుంటాయి,వినిపిస్తుంటాయి. గత వారం చెప్పినట్టు ఎవరెంత ముందర చూపిస్తే టీవీలకంత ఘనత అన్నమాట. మరి ఇవాళ రిపబ్లిక్ డే నాడు మీతో పొద్దుటే ముచ్చట్లాడుతుంటే టీవీ ధ్యాస లేదాయె! మీ పాటలు కనీసం ఒకటీ అరా వస్తాయో రావో? అర – అని ఆశ్చర్య పోతున్నారా? అంతే లెండి – సగం పాట వేస్తేనే ఎవ్వరూ రికార్డింగ్ చేసుకోరని అలా చేస్తుంటారు. అంతా కాపీ చేస్తున్నా ఎవరి రైట్ లు వారివి. అలా టీవీల పుణ్యమా అని ఏ రోజు ఏ పండగ అన్నది జనావళికి ఇట్టే తెలుస్తోంది. నా భయం అల్లా ...ఎక్కడ మీ పాటలు ఇంకొకరికి, ఇంకొకరి పాటలు మీకు సమర్పిస్తారేమో అనే. ఇప్పుడు నేనన్న అల్లా అన్నది తెలుగు పదమే (నేను రాస్తున్నప్పుడల్లా దీవించు భగవాన్). అయితే నిన్న (ఈ ఏడాది జనవరి ఇరవై అయిదున ) ‘ఈద్ ముబారక్’ అని మన దేశంలో ఉన్న మా చిన్న మిత్రుడు ఆలీ గారికి, విదేశంలో ఉన్న మా పెద్ద మిత్రుడు హకీమ్ గారికి చెప్పి ఇలా ఈ రోజు మీతో సంభాషిస్తుంటే చప్పున గుర్తొచ్చింది-‘ఒకే కుటుంబం’ చిత్రంలో ఒకనాడు మీరు పాడిన ‘అందరికి ఒక్కడే దేవుడు’ అన్న పాట. దాశరథి వారి కలం, కోదండపాణి గారి స్వర మేళనం, మీ ‘ఎన్టీఆర్’ గాత్రాభినయం – ఒక త్రివేణీ సంగమం. మూడు ధర్మాల మిశ్రమం ఆ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు (ముందు తమిళంలో, తరువాత చాలా ఏళ్ళకి తెలుగులో) మన ‘రక్త కన్నీర్’ నాగభూషణం గారు. ఓ పదేళ్ళ క్రితం హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూశామండీ ఒక ఆటో ఆసామి తన ఆటో మీద ఇలా రాయించుకున్నాడు – Ram in Ramjaan, Ali in Diwali ! సామరస్యం ఎంతబాగా ఊహించాడాయనా... మీరు బడే గులాం ఆలీ ఖాన్ గారికి మీ ఇంట ఆతిధ్యమిచ్చారు. ‘మీరుండగా నేను పాడటమేమిటీ’ అన్న మహమ్మద్ రఫీ గారిని స్నేహమయంగా ఆదరించారు. మీలా అందరూ ‘మనమంతా గాయకులం, మనదంతా ఒకటే కులం’ – అనుకుంటే ఎంత ప్రగతి, ఎంత ఉన్నతి! అలాగే ఇవాల్టి యువత –‘మనమంతా యువకులం, మనదంతా ఒకటే కులం’ అనే మాటకి కట్టుబడి, మీరు ఒకానొక పాటలో చెప్పినట్టు ‘కారే చెమటకి విలువ వస్తుందోయ్ వస్తుంది (కొసరాజు రచన)’ అన్న సత్యాన్ని గ్రహించి చెమటోడ్చి (అన్నీ అరచేత అమరే యంత్రాలే కనుక చెమటోడ్వడం కుదరని రోజులే అయినా) సాధించే మార్గం అనుసరిస్తే ఇక పైన ‘జయం మనదే’ అని కాలర్ ఎగరేయవచ్చు.. అప్పుడు ఎంత బావుంటుందో దేశం! బాగుండి, ఒకప్పుడు మీ పాటలో విన్నట్టు ‘మన ఊరే భారతదేశం మనమంతా భారతీయులం’ అనే నినాదం ఊరూరా మార్మోగుతుంది.
[నాగభూషణం గారి పేరు వినగానే ఆయనకి గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడిన ‘మాయా సంసారమోయి తమ్ముడూ’ పాట, ఓహో అది ఆయనకి పాడిన పాటా అని ఆశ్చర్య పోయేలోగా ‘మామా మామా మామా ..ఏమే ఏమే భామా’ (కొసరాజు రచన) పాట సగంలో కలల్లో తేలుతూ ఆయన రావడం గుర్తొస్తుంది. అంతలోనే మీరు ఆఖరుసారిగా ఆయనకి పాడిన ‘ఏడుకొండల వెంకటేశ్వరా నీవైనా ఈ మనుషులకు బుద్ధి చెప్పరా’ (కొసరాజు రచన) అన్నది మదిలో మెదిలి నెమ్మదిగా నవ్వు తెప్పిస్తుంది. అలాంటి నా.భూ. గారు నభూతో.. అన్నట్టు ఈ ‘ఒకే కుటుంబం’ (తమిళం నుంచి) ‘తిరిగి’ తీశారు (ఈ రోజుల్లో ఏదైనా బావుంటే ‘ఇరగ దీశారు’ అంటారండి)]. త్రివేణీ సంగమం అంటే గుర్తొచ్చింది- ఇప్పుడు మహా కుంభ మేళా జరుగుతోంది అలహాబాదులో, అంటే ఒకనాటి ప్రయాగలో. ప్రయాగ అనగానే మీ ‘గుండమ్మకథ’ పాట ఒక్కటి అందరి మనస్సులో ఒక ‘రికార్డ్’ నెలకొల్పింది చూడండీ.. అది గుర్తుకు రావాలి . 'ప్రేమయాత్రలకు బృందావనము, నందనవనము ఏలనో , తీర్థ యాత్రలకు రామేశ్వరము,కాశీ, ప్రయాగ లేలనో' ...అని పింగళి కవివర్యులు మాబాగా సెలవిచ్చారు. ఇది వినో ఏమో, ఈ నందన నామ సంవత్సరంలో చాలామంది ఇక్కడ వద్దు, ఇక్కడ ఉంటే పాదయాత్రలే అని విదేశాలకు ప్రేమయాత్ర నిమిత్తం వెళ్లి వస్తున్నారు. చూశారా మాస్టారూ, డబ్బున్నా పేద రైతులా కష్టపడడం ఆ సినిమా హీరో పాత్ర చూపిస్తే , డాలర్లు పండించుకోవడానికి డాబులు పోవాల్సి వస్తోందిప్పుడు. ఇక వర్తమానంకొస్తే...కుంభమేళాలో సంగమ స్నానానికి ఏఏ రోజులు అనువైనవో (రేపు జనవరి ఇరవై ఏడు –పుష్య పొర్ణమి కదండీ, మకర సంక్రాంతి తరువాత ఇదే రెండవ పవిత్ర దినం) ఒక బ్యాంకు వారు బస్టాండ్లో బోర్డు వేళ్ళాడదీశారండీ. ఇంకానయం- మా ఎటిఎం కార్డులు నీట మునిగినా ఏం కావు అని చెప్పలేదు. ఎటిఎం అంటే మీ కాలంలో ‘అంతా తారుమారు’ అనే అర్థంలో చెప్పుకునేవారేమో ..ఇప్పుడు అది ధన బొక్కసం మాస్టారూ. యంత్రం మన ధనం మనకిచ్చేస్తుంది అడిగిన తక్షణం. ఆ మధ్య ఆ యంత్రం దగ్గర పగలు,సాయంత్రం, రాత్రి ..అన్నివేళలా పాటలు వినిపిస్తామని అన్నారు. పోన్లెండి, మంచిదే. అయితే మీరు పాడిన ‘ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’ –పాట ఒక్కటి చాలక్కడ. అయితే ఎదుటి వాడి ధనం మాకు ఇంధనం అని అక్కడే దొంగ కాచుకు కూర్చుంటేనే ఇబ్బంది. దానికోసం కెమెరా పెట్టింది లెండి సిబ్బంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ‘మూడో కన్ను’ వల్ల అన్నీ తెలుస్తున్నాయి, ఏదీ... పుణ్యకాలం గడిచిపోయాక. నాగభూషణుడైన ఆ పరమ శివుడి మూడో కన్ను విలువ ఇలా ఇప్పుడు తెలుసుకున్నాం లెండి. శివుడు నిజంగా గొప్ప దేవుడు కదండీ. నిరాడంబరుడు.. ఊరికే బట్టలూ,ఆభరణాలకి డబ్బు జల్లేస్తే ఎలా? చివరికి మిగిలేది బూడిదే కదా అని హెచ్చరిస్తాడు. తనలో సగమైన గౌరమ్మను కొలువకపోతే మనకి ‘శక్తి’ రాదన్నాడు. తన నెత్తినున్న గంగమ్మను నీట ముంచితే భుక్తి లేదన్నాడు. అలంకార ప్రియుడు విష్ణువైతే అతని కలియుగావతారమే మన ఇలవేల్పు వేంకటేశ్వరుడు. ఎప్పుడూ తన కుడి చేతిని పాదాలవైపు చూపిస్తాడు. ఆయన పాద దర్శనమే మహా భాగ్యంగా చూడాలి. ఒంటినిండా ఎన్ని బంగారు తొడుగులూ, పూల దండలూ ఉన్నా వట్టి పోయిన పాదాలు చల్ల బడితే ప్రయోజనం లేదని గిచ్చుతాడు చిద్విలాసంగా. పైగా సూటిగా ఆయన కళ్ళలోకి చూడనియ్యక ఘాతం నెపంతో అడ్డు కూడా పెట్టుకున్నాడు. ఆ దేవుని రెండు కళ్ళూ ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు కదండీ. పరమ శివుణ్ణీ, వెంకటపతినీ మన దేవులపల్లి కవి గారు ఒక పాట పల్లవిలో ఇలా రెండు ముక్కల్లో ఎంతబాగా అన్నారూ...శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మ వాన –తిరుమలపై వెంకన్న కనువిప్పేనా కరుణించు ఎండా వెన్నెలలైనా ! ఆ పాట మీరు పాడినదే. ఆయన రచనే మరొకటి- పాతాళ గంగమ్మ రారారా ...అన్నది మీరూ, సుశీలమ్మ గారూ పాడిన పాట. ఉండమ్మా బొట్టు పెడతా చిత్రం లోనివి. ఉండండి కాశీనాథుని విశ్వనాథుడి భుజం తట్టి అడుగుతా. ‘త్రివేణీ సంగమ పవిత్ర భూమి’ అని మీరు ఒకానొక ‘బడిపంతులు’ గారి నోట పలికారు, 'భారత మాతకు జేజేలు' అంటూ. అయ్యయ్యో ..ఈ మధ్య అండీ పన్నెండేళ్ళ క్రితం ఒక మంత్రి వర్యులు మూడువేలమంది కాలేజీ పంతుళ్ళకి ఆమ్యామ్యాం సాయంతో జాబులిచ్చినందుకు జవాబుగా జైలు శిక్ష పడింది. సరిగ్గా పన్నెండళ్ళకి వచ్చిన కుంభ మేళా సమయంలోనే ఇలాంటి గుంభన విషయాలు బయటపడడం విశేషమే కదండీ. మన స్వాతంత్ర్య సంగ్రామం ఒక ‘మరపురాని కథ’ అనుకుంటే ఆ కథలో మీదీ అలనాడు ఒక ప్రముఖ పాత్రే. చెయ్యని నేరానికి జైలుకు వెళ్ళారు. పద్యానికో నెల చొప్పున శిక్ష పడింది మీకు. దేశం కోసం పోరాడిన ఆ నేపధ్యం మీకుండబట్టి ‘గంగా యమునా తరంగాలతో ...ఎంత చల్లనిది మనదేశం’ అనేటువంటి పాటలు మీరు అవలీలగా, దేశభక్తి నిలువెల్లా ఉట్టిపడేలా పాడగలిగేవారు. అవి మాకు మన దేశంలో ఉన్నంతవరకు నిజంగా ఒక్కొక్క మంత్రోపదేశం అని అనుకుంటాం. ఇప్పుడు మంత్రోపదేశం అంటే ఎర్రకోట పైన జెండా ఎగరవేసి మంత్రి ఇచ్చే ఉపదేశం అనే అర్థమే ఉందండి, అదీ మైకుల వంటి సాయంతో. కనుక అది కేవలం ‘యంత్రోపదేశమే’ లెండి. పైగా తెలుగువారికి మ,య రాయడంలో ఎప్పుడూ ఇబ్బందే. ‘మయ సభ’ని కొందరు ‘యమసభ’ అని రాస్తారు. నిజానికి ఇవాళ దేశంలో ఏ సభ జరిగినా అద్భుతంగా ‘డెకరేట్’ చేసి మయసభ ని తలపిస్తారు, కాని పట్టుమని పదినిమిషాలు కాగానే అది కాస్త యమసభ అయి కూర్చుంటుంది. మయసభ, యమసభల మధ్య సగటు మనిషికి అంతా ‘అయోమయసభ’ గా తోస్తుంది. అసలు మహాకవి శ్రీశ్రీ గారితో వచ్చిన చిక్కేమిటంటే ఉన్నమాట ఉప్పెనలా పాట రూపంలో ఊదేయడం! ఫలానా వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయ్... అని ఎంత ధైర్యంగా ఆయన ఆ రోజుల్లోనే చురక వేశారూ. దేశంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనేవి రెండూ నాణానికి ఇరువైపులని అంటే ఏది బొమ్మ? ఏది బొరుసు? అనే సందేహం రావొచ్చు. పోనీ ‘వెలుగునీడలు’ అందామంటే ఏది వెలుగు? ఏది నీడ? అని మరో అద్వైతం సమస్యాయే! ఏది ఏమైనా ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా....అందరూ సుఖపడాలి నందానందనా ’... అని ఈ నందన నామ సంవత్సరం ముగిసేలోగా మరోసారి అనుకోవడంలో తప్పు లేదు కదండీ. రాజకీయంగా ఏ పక్షంలో ఉంటేనేం? మంచికాలం వస్తే ఎంచక్కా మీరు ఒకనాడు పాడిన ‘జేబులో బొమ్మ’ పాటలోలా అమ్మ వరమిస్తే మంత్రి కావడం ఎంత సేపు? ఇటీవల మరో టర్మ్ విజయం పొందిన అమెరికా అధ్యక్షుడు తన ఆలికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్నారో తెలుసునా అండీ... జయం మనదే, విజయం మనదే అని ఒక అక్షరం ముక్క ఎక్కువ చేర్చి ఎంత గట్టిగా అరచినా వెనుక ఓ స్త్రీ మూర్తి ఉందన్న విషయం విస్మరించకూడదని ఆయన ప్రపంచానికి తెలియజేశారు. అయితే పాపం ఆయన ఉపన్యసిస్తున్న వేళ ఆయన గారాల పట్టి అమాయకంగా ఆవలిస్తుంటే ‘మూడో కన్ను’ ఇట్టే పసిగట్టేసింది. ఆవలింతకు అన్న ఉన్నాడు అనే సామెత మనదైతే ఆవలింతకు నాన్న ఉన్నాడు అనే సామెత వారిదౌతుందేమో ఇక మీదట. మాస్టారూ ...ఇలాగే ఒకనాటి రిపబ్లిక్ డే కి ఒక రోజు ముందు 1970 లో మీకు ‘పద్మశ్రీ’ ప్రకటించారు కదండీ. అంతకు ముందు స్థానం వారికీ, ద్వారం వారికీ, రేలంగి వారికీ, అక్కినేని వారికీ, నందమూరి వారికీ ఆంధ్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి వారిని గౌరవించింది. నాగయ్యగారికీ, భానుమతీ రామకృష్ణ గారికి తమిళనాడు పద్మశ్రీ ఇప్పించింది. ఇంకా కళ్యాణం రఘురామయ్య (ఈలపాట) గారు, వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, అల్లు రామలింగయ్య గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, కళా తపస్వి విశ్వనాథ్ గారు పద్మశ్రీ లు కాగలిగారు. మీరున్నప్పుడే బి.ఎన్.రెడ్డి గారికి పద్మభూషణ్ దక్కింది కదండీ. మీరు దివికి తరలి వెళ్ళిన రెండేళ్ళకి దేవులపల్లి వారిని పద్మభూషణ్ అన్నారు. కొంగర జగ్గయ్య గారికి లేటుగానే ఆ గౌరవం లభించింది. మీకు తెలుసునా అండీ.. పి.సుశీల గారికి 2008లో ప.భూ గౌరవం లభించింది. భానుమతీ రామకృష్ణ,లీల, బాలు గార్లని తమిళనాడు ప్రభుత్వం ప.భూ. తో గౌరవించింది. కవి, ఆచార్యులు డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు, ‘ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగి పోయాడమ్మా’అని అంతా అనుకోనేలా బాలసుబ్రహ్మణ్యం గారు పద్మశ్రీ నుంచి పద్మభూషణ్ కు ఎదిగారు. మాకు తెలిసి ఆంధ్రకు చెందిన ఒకే ఒక్క పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి వారే. వీరందిరితో మీకు అనుబంధం ఉంది కనుక ఇవన్నీ చెబుతున్నాను. మీ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘పాండవవనవాసము’ చిత్రంలో మీరు బాలమురళి గారి చేత సూర్య స్తుతి పాడించడం విశేషం. ఆ పద్యం వినిపించనా అండీ? నిజానికి చూపించాలి కూడా, ఎందుకంటే ఈ రోజు మహా నటుడు గుమ్మడి గారి వర్ధంతి! ఈ ఏడాది అయినా గాయని జానకి గారిని ‘పద్మ’ పురస్కారం వరిస్తుందో లేదో... తమిళం వాళ్ళు మాత్రమే ఆ ఇచ్చే ప్రయత్నం చెయ్యగలరు అని లోలోపల జరుగుతున్న మా గొణుగుడు విన్నట్టున్నారు – హమ్మయ్య! ఆవిడ ఈ ఏడాది పద్మభూషణ్ కాగలిగారండీ..తానా వల్ల కాదు త.నా వల్లనే! కాని ఏం లాభం? ఆమె ‘అలుక చూపి అటు వైపు తిరిగితే’ అయ్యో.. అవార్డు అగపడదని తెలిసింది. ఉందిలే మంచికాలం ముందు ముందునా (శ్రీశ్రీ రచన) ...అని నిర్మాత శ్రీ దగ్గుబాటి రామానాయుడు గారు తొలి సినిమాతోనే ఆశావాది అని అనిపించుకున్నారు కదండీ.. ఆయన పద్మభూషణ్ అయ్యారు ఈ ఏడాది. 'దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్ (కొసరాజు రచన)' ....అని ఒక పక్కన సంబరపడుతున్నా ఇంకా ఎందరో మహానుభావులున్నారు కదా వారందరి గుర్తింపు ఇంకెప్పుడు? అని లోలోపల గొణుగుడు....ఇంకా బాలాంత్రపు రజనీకాంతరావు గారినీ, రావు బాలసరస్వతీ దేవి గారిని మనవాళ్ళు విస్మరిస్తూనే ఉన్నారండీ. మువ్వన్నె జెండా రూపశిల్పి మన పింగళి వెంకయ్య గారిని దేశమంతా ‘భారత రత్న’ గా పిలవబోతున్నట్టు విన్నాం, ఔనా నిజమేనా? ఔనా కలలేనా? అట్టులే అగునా? ఆశలు అట్టడుగున పోవునా? ఆశ లేదండీ.. ఆశ దోస అప్పడం ...ఎందుకండీ ఏదో ఇచ్చేస్తున్నట్టు వార్తాహరులు ముందే ఊహించి చెప్పడం! రజనీకాంతరావు గారి జన్మదినం ఈ జనవరి 29 నండీ మాస్టారూ..తొంభైమూడేళ్ళ రజనీ గారు విశాఖ సముద్రం లైట్ హౌస్ లా ఆ ఒడ్డున జ్ఞాపకాల వెలుగులు వెదజల్లుతూ ప్రశాంతంగా ఉన్నారు. రజనీ గారు ఆకశావాణికి అంకితమయ్యారు కదండీ. సినిమాని వ్యావృత్తిగా అనుకున్నారు.ఇందాక ఎటిఎం అంటే మీకు ‘అంతా తారుమారు’ అనే అర్థం ఉండి ఉండవచ్చు అని జోకేను కదండీ.. నిజంగానే 'తారుమారు' సినిమాకి రజనీ గారు పని చేశారు. ఆయన అలా ఎన్నో సినిమాలకి ఎ టి ఎం లా వ్యహరించారు. అడిగిన వారికి కాదనక బాణీలు సమర్పించారు. రజనీ గారి మీద మక్కువతో బి ఎన్ రెడ్డి గారు తన 'రాజమకుటం' చిత్రం కోసం రెండు పాటల స్వర కల్పన రజనీ గారి చేత చేయించుకున్నారు. ఆ సినిమా లోని ఒక పాట .....మీరూ, లీల గారు పాడిన ‘ఊరేది పేరేది ఓ చందమామా’ ...ఇది రజనీ వారి రచనా, స్వర రచనా కూడానూ. లక్ష్మమ్మ చిత్రానికి మొదట రజనీ వారినే ఒప్పించారట. ఆయన అనారోగ్య కారణంగా మీరు రంగ ప్రవేశం చేశారట. ఆయన స్వరాలిస్తే మీరు తతిమ్మా రికార్డింగ్ వ్యవహారం చూసుకున్నారట కదండీ. మీ గాత్రాన్ని రేడియో ద్వారా ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో’ వ్యాప్తి చేసింది ఆయనే కదండీ. మీకన్నా ఆయన రెండేళ్ళు చిన్న అయినా మీరు ఆయన్ని ‘నాన్నగారూ’ అని పిలిచే వారట కదండీ. ఆయనకి ఇష్టమైన స్వర కర్తలు – ఒకరు మీరు, ఇంకొకరు సాలూరి రాజేశ్వరరావు గారు! ‘ఇన్నిరాశుల యునికి’ అన్నట్టు కేవలం పన్నెండు చిత్రాలకే ఆయన సంగీత నేతృత్వం వహించినా పుష్కరంలా ఒక్కసారి వచ్చి మనసులో ఆవిష్కరిస్తుంది ఆయన ప్రతిభ. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిభామూర్తిని మంద్ర స్వరంతో పిలుస్తోందో ఏమో సముద్రపు హోరులో అదెక్కడ వినిపిస్తుందీ? పోన్లెండి...అంతా పెట్టిన కేకలు (పాతకాలం మాటేలెండి) విని మన బాపు అనే సత్తిరాజు లక్ష్మీ నారాయణ గారికి తమిళనాడు నుంచి పద్మశ్రీ దక్కింది ఈ ఏడాది. కాస్త ఊరట. కాని ‘బాపు-రమణ’ అన్నదే పేరట. బాపురే రమణీయం అన్నా, ‘జంట కవులవలె అంటుకు తిరగాలోయ్’ అన్నా వారిద్దరే అన్నది ప్రజాభిప్రాయం. కనుక ఒక్క బాపు గారినే గౌరవిస్తే ఎలా? ఈయన విషయంలో పద్మశ్రీశ్రీ అనొచ్చు కదా! సర్లెండి.. గోపాల శబ్దంలోనే పద్మశ్రీ ఉన్నట్టయితే ‘నను పాలింపగ నడచి వచ్చితివా గోపాలా’ అని మీరు పాడిన పాటలో ఎ. ఎన్. ఆర్ స్థానంలో ఆ ‘చిత్ర’ కల్పనా చాతుర్యుడు శ్రీ బాపు గారిని నిలబెట్టి ఆ పాట దృశ్యం తిలకిద్దాం రండి. మీరు సైతం బాపురే రమణీయం అని మరోసారి అనక మానరు. మాస్టారూ... ఇవన్నీ పక్కన బెడితే.. మీతో ఒక విషయం ముచ్చటించాలని ఉంది. అదేమిటంటే.. మీ సినీ ప్రస్థానంలో మీతోపాటు ‘రాఘవ’ నామం కదిలి వచ్చింది. మీ సినీ అరంగేట్రంకి మూల కారకులు కవి సముద్రాల రాఘవాచార్యులు, మీకు ‘దేవదాసు’ చిత్రంతో ఒక విశేష స్థానం కల్పించినది వేదాంతం రాఘవయ్య గారు. మీ ప్రియ శిష్యుడి పేరు జె.వి. రాఘవులు! ఇక జానపద కవి సార్వభౌముడు కొసరాజు రాఘవయ్య చౌదరి గారి పాటలన్నీ మీరు మంచినీళ్ళలాగ గడగడా తాగేశారు. ఆ లెక్కన చూస్తే వారి పాటల్లో అధిక శాతం మీరే పాడి ఉంటారు. ఈ ‘రాఘవ’ నామ లాఘవంతో ‘లవకుశ’ చిత్రంలో మీరు స్వర పరిచి లీల,సుశీల లచే పాడించిన శ్లోకం ‘శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం’ , మీరు పాడిన పద్యం - నవరత్నోజ్వల కాంతివంతమిది.....వీటిలో రాఘవ శబ్దం ఉంది. అదే చిత్రంలో రాఘవులు,వైదేహి, కోమల,సౌమిత్రి –ఇందరు పాడిన 'శ్రీ రామ పరంధామా జయరామ పరంధామా...' గీతంలోనూ రాఘవ నామం ఉంది కాబట్టి ఆ పాట సన్నివేశం చూపించాలని ఉంది. ఎందుకు ఇంతగా ‘రాఘవ’ నామ తపన అని మీరనరు కానీ చదువరులు అనుకోగలరు. మీకు తెలుసు నా అంతరంగం- ఇదే జనవరి చివర్లో మన జాతిపిత మహాత్మా గాంధి ‘హే రాం’ అని అశువులు బాసారన్న విషయం గుర్తు చేస్తున్నాని!. పైగా వారికి అతి ప్రియమైన గానం- ‘రఘుపతి రాఘవ రాజారాం’ కదండీ. ఆ పుణ్యమూర్తిని కోల్పోయాక మళ్ళీ ఈ యుగానికి మరో పుణ్యమూర్తి లభించడని తెలిసిపోయింది, రామరాజ్యం ఎలాగూ రాదు కానీ.... భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచమంతా ఆయనకి ఇవ్వాల్సిన ఏకైక బిరుదు –‘భారత నవరత్న!’ దేశ స్వాతంత్ర్యం కోసం, గ్రామాల బాగు కోసం, రామరాజ్య స్థాపన కోసం ఆయన ఏకైక సర్వామోద నాయకుడై భాసిల్లాడు. ‘స్వాగతంబోయి స్వాతంత్ర సీమకు...రామరాజ్యమ్ము సుమ్ము మా గ్రామసీమ’ అని ప్రతి ఊరిజనం పాడుకోవాలని ఆయన కాంక్షించారు. మీరు పాడితే ఆ నినాదం మరిన్ని దిశలు వ్యాపించింది. ఎన్నెన్నో కబుర్లు తీగలా అల్లుకుంటూ పోయాయి కదండీ. ‘అందమైన తీగకు పందిరుంటే చాలును పైకిపైకి పాకుతుంది’ అని మీరు పాడబట్టే ఇంత చొరవ....’ఇంత గొడవా ఓరి భడవా’ అని నవ్వుకోండి మాస్టారూ... మళ్ళీ వారం మాకోసం కొంచెం సమయం ఇస్తారూ ప్లీజ్. మా మాంచి మాస్టారు కదండీ ...తారాస్థాయిలో అరచి గీ పెట్టి మీకు నిద్రాభంగం కావిస్తున్నామా? క్షమించాలి....’ -తాతిరాజు వేణుగోపాల్, 26 జనవరి 2013
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|