మునుపటి నా మాట
పాణికి గ్రహణంకి మధ్య ఓ గీత ఉంది గమనించండి. పాణి అంటే కోదండపాణి అని పాతిక శాతం మంది గ్రహిస్తే ఈ 'కృష్ణప్రేమ' జన్మ సార్ధకమైనట్టే లెక్క. కోదండపాణి అంటే సినీ సీమ మట్టిలో స్వర మాణిక్యం అని మరో పాతిక శాతం అనుకుంటే పాణి జన్మ ధన్యమైనట్టే. మిగతా యాభైశాతం మందికి ఆయన ఎవరో తెలియక పోతేనేం, అదీ ఎంతో మంచిదే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆయన గురించి చెప్పే అవకాశం కలుగుతుంది కనుక. మరి ఆ గ్రహణం మాటేమిటీ? పున్నమి కాదు-చంద్ర గ్రహణం అనడానికి. అమావాస్య కానే కాదు – సూర్య గ్రహణం అనడానికి. రాహుకేతుల హాహాకారాలు అవన్నీ. ఇక్కడ ఆరుద్ర గారన్న మాట గుర్తొస్తోంది. ‘పరిగెత్తి వస్తోంది రాహువు- అయ్యో తరిగి పోతోంది ఆయువు’. అలా కోదండపాణి ఆయువుకి గ్రహణం పట్టిన రోజిది. 1974 ఏప్రిల్ 5న ఆయన్ని గుటుక్కున మింగేశారు గంధర్వ లోక వాసులు. ఆ ఏడాది అప్పటికే ఫిబ్రవరి 11న గంధర్వుల దృష్టి ఘంటసాల మాస్టారు పైన పడింది. పాణి చేసిన తప్పేమిటీ? ఎందుకు గంధర్వులు లాక్కు పోయారూ? ఎందుకంటే అప్పటికే రెండేళ్ళ క్రితం ‘బాబూ వినరా అన్నా తమ్ముల కథ ఒకటి ...’ అనే పాట ఈయన శ్రోతల గుండెల్లోనే కాదు ప్రేక్షకుల కళ్ళలోనూ శాశ్వతంగా ముద్ర వేసి వదిలేశారు కనుక. ఈయన స్వర లాలిత్యం, మాస్టారు గాన మాధుర్యం రెండు ప్లస్ పాయింట్లు అనుకునే లోగా గంధర్వులకి మరో లెక్క తెలిసింది. ఆ పాటకీ మరెవ్వరో కాదు నట సార్వభౌముడు ఎస్వీ రంగారావు హావ భావాలు తోడయ్యాయి అని. కొంచెం ఆలస్యం చేసి ఎస్వీ వారిని కూడా అదే సంవత్సరం జులైలో కబురంపారు.
పాటలో చూస్తే ‘కలతలు లేని నలుగుర కలిసి సాగించారు పండంటి కాపురం’ అని ఉంది. వీరు మాత్రం ఒకరి వెంట ఒకరు పెద్దన్నయ్య మాట జవదాటని ముగ్గురు తమ్ముళ్ళలా అలా దూర దూర తీరాలకు సాగిపోవడమేమిటీ? ఇంతకీ ఆ సుదూర తీర పెద్ద అన్నయ్య ఎవరో? ఇప్పటికీ ఆయన ఆచూకీ తెలియలేదు. విధాత అందామా? జీవితం తియ్యనిది అందుకే స్వల్పమది – అని చిన్న మాటలతో వేదాంతం చెబుతూ ఆశ్చర్య పరచిన మైలవరం గోపి ‘పండంటి కాపురం’ లో ఎంతో ఎదిగి పోయి ‘ఇదిగో దేవుడు చేసిన బొమ్మ –ఇది నిలిచేదేమో మూడు రోజులు’ అని అన్నారు. ఆ పాట పాడేందుకు ‘పాణి’ ముందుకొచ్చారు. అది ఆయన పాడిన రెండో సినీ గీతం, సారో సాంగ్ కాదు. కన్నీరు మున్నీరు కాదు. కన్ను చెమరుస్తుంది. తొలిసారిగా గురువుగారు సుసర్ల వారి బసలో ఉన్నప్పుడు పాడిన పాట ‘సంతోషమేలా సంగీతమేలా?’. ఆ సంతోష సమయంనుంచి కడ దాక ఆయన సంగీతమే ఊపిరిగా బ్రతికారు. హార్మోనియం లోనే ఆయన ఆత్మ అంతా ఉండేది. ‘నదిలో నావ ఈ బ్రతుకు-దైవం నడుపును తన బసకు ..’ పాట పాడిన రెండేళ్లకే సంగీత నావ లో కూర్చోనీ సంగతుల చుక్కానితో మోసం ద్వేషం లేని సీమ వైపు అలా అలా హొరైజన్ లో కలిసిపోయారు. అదే ఆయన పాడిన ఆఖరి పాట. కవి మిత్రుడు వీటూరి స్వీయ దర్శకత్వంలో 'భారతి' సినిమా తీస్తే ‘శృతి చేసినా వీణ, స్వామీ స్వరములు పలికించ వేమీ’ అని అద్భుతంగా పాడించినా బ్రతుకు వీణ పైన దొర్లిన కామెర్లు అనే అపశ్రుతికి తలవంచి శాశ్వతంగా తప్పుకున్నారు పాణి. ‘భాగస్తులు’ సినిమా కోసం ఆయన స్వర పరచి ఉంచిన ‘కలిమి లేములు కష్ట సుఖాలు కావడి కుండలే తెలుసా మనసా’ పాట రికార్డింగ్ ఎస్పీ బాలు పూర్తి చేశారు. ‘ఇది రేడియో శ్రీలంక.. ఆసియా సేవా విభాగం... మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదురై....’ అని ఆ రోజుల్లో మొదట్లో సాయంత్రం నాలుగున్నరకి( తరువాత మూడుకి మారింది) రేడియో ద్వారా ప్రసారం అయ్యే తెలుగు పాటలు వినడం ఉత్తరాంధ్ర, ఒడిశా వారలకి ఒక గొప్ప హాబీ (ఎందుకంటే ఆకాశవాణి హైదరాబాదు,విజయవాడ, కడప, విశాఖలు అందేవి కావు, గ్రామఫోనులు అందరి ఇంటా ఉండేవి కావు). అలా అలా అలల మీద నుంచి వేరే దేశం నుంచి ‘పండంటి కాపురం’ సినిమా పాటలు వస్తుంటే వినడం ఎంత ఆనందం! అందునా ..'బాబూ వినరా' పాటలో ‘వినరా’ అనే ఒక్క మాటలో కాస్తంత సంగతి వేయగానే ఎస్వీ రూపం ఎగిరొచ్చి కళ్ళ ముందు ఎదురయ్యేది. అంటే- ఒక స్వర కర్త, ఒక గాయకుడు (లేదా గాయని) ఒక నటుడు (లేదా ఒక నటి) కి రెండు కళ్ళు అనేగా. పాట ముందు పుడుతుంది. నటన ఆనక లాభిస్తుంది. ఫలానా నటుడు(లేదా నటి) మీద పాట అనగానే ముందు స్వర కర్తా, తరువాత గాయకుడు (లేదా గాయని) స్వరకాయ ప్రవేశం చేసేయాల్సిందే. బాబూ వినరా ---పాట ఇందుకు ఓ చక్కని ఉదాహరణ. మీనాక్షి గారు రానప్పుడు రేడియో శ్రీలంక తెలుగు ప్రోగ్రాంలో ఒకాయన తమిళంలోనే చెప్పేవారు. అడిత్త పాట్టు మగబాలుడు ఎండ్ర పడత్తిల్ ---అనగానే నవ్వుకునేవారం. మహాబలుడు – సినిమా పాట అని పాపం ఆయన ఉద్దేశ్యం. అందులోని ‘ఓ...విశాల గగనంలో చందమామా’ అనే యుగళ గీతం అప్పటికి కొన్ని వందల సార్లు వినే ఉంటాం రేడియో ద్వారా. కొన్ని యుగాలు మరవలేని గీతంగా ఇప్పటికీ వినిపిస్తుంది. అప్పటికింకా ఎస్పీ ‘బాలుడే’. ఆ లేత గొంతుని సినీ సీమకి పరిచయం చేసి గొప్ప మేలు చేసిన విశాల హృదయుడు, మహానుభావుడు కోదండపాణి. నటశేఖర కృష్ణ స్వయంగా పాడుతున్నట్టే అనిపించేది, లేత బాలుడు పాడుతుంటే. కాని బాలుడికి తొలి అవకాశం ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’లో దక్కినప్పుడు ఆయన పాడిన పోర్షన్ ‘రావే కావ్య సుమబాలా జవరాలా ప్రియురాలా’ అన్నది అందాల నటుడు శోభన్ బాబు కోసమే. అలాంటిది ‘మంచి మిత్రులు’ లాంటి ఈ ఇద్దరు హీరోల మీద తొలిసారిగా పాట కావాలనిపిస్తే కోదండపాణి తొలిసారిగా మేరు నగం ఘంటసాల గళం పక్కన చిన్ని కొండ ఎస్పీ బాలుడు గళంని నిలబెట్టే సాహసం చేశారు. ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ ఆనాడే ఎదురైంది బాలుడుకి. మాస్టారు గొంతు కృష్ణకి, బాలుడి గొంతు శోభన్ కి అమర్చడం అప్పటి విశేషం. ఇప్పుడు గానీ మళ్ళీ మళ్ళీ ఆ పాట వింటే అవే గొంతులకి తారుమారుగా ఈ నటుల్ని ఊహించడం కద్దు. ఎంతో విజ్ఞత ఉన్నా కోదండపాణి వంటి వారికి అప్పటి పెద్ద నటుల చిత్రాలు దక్కలేదు. ఎన్టీఆర్ జానపదాల పుణ్యమా అని ఒక గోపాలుడు భూపాలుడు, ఒక లక్ష్మీ కటాక్షం చిత్రాలు పాణి చేతికి చిక్కాయి. అయితే రామారావు తో మిత్రుడు, నిర్మాత అయిన హాస్య నటుడు పద్మనాభం ‘దేవత’ (సాంఘిక) చిత్రం తీయడం తో తొలిసారిగా రామారావు నటించిన చిత్రానికి పాణి సంగీతమందించారు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, కన్నుల్లో మిసమిసలు కనిపించనీ, తొలివలపే పదే పదే వంటి పాటలతో కవిగా ‘వీటూరి’ స్థాయి పెరిగింది. మా ఊరు మదరాసు ..పాటతో పద్మనాభం గొప్ప గాయకుడు కూడా అని దేశదేశాలకి తెలిసింది. మరో సాంఘీకం ‘ఒకే కుటుంబం’ – నాగభూషణం రామారావుతో తీసిన సినిమా. విశ్వనాథన్ రామమూర్తి తమిళంలో ఇచ్చిన వరసల ప్రభావం పడనివ్వక పాణి సంగీతమందించారు. తక్కువ వాయిద్యాలతో, ఎక్కువ ఈలతో కూర్చిన ‘మంచిని మరచీ వంచన నేర్చీ’ అనే పాటతో కోదండపాణి-దాశరథి (పేర్లలో తేడాలేదు) కాంబినేషన్ స్థాయి పెరిగింది. అక్కినేని వారితో ఒక్క చిత్రమే దక్కించుకున్నా (మంచి కుటుంబం) పాణికి అందులో ఆయన నోరు తెరచి పాడేలా ఒక్క పాటైనా చేసే అవకాశం రాలేదు. నేపధ్యం గీతం ‘త్యాగశీలవమ్మా మహిళా’ అనే పాటలో అక్కినేని కనిపిస్తారు. అంతే. ఆ సినిమా తరువాత అయిదారేళ్ళకే పాణి దివి కేగడంతో ఇక అక్కినేని-పాణి కాంబినేషన్ అనేది లేకుండా పోయింది. పాణి అధిక శాతం జానపద చిత్రాలకే పని చేయడంతో ఆయన కనపరచిన ఒక విలక్షణమైన స్వర శైలీ, సంగతులు, తబలా దరువులు, ఆర్కెస్ట్రా ఆర్గనైజేషన్ శ్రోతల్ని ఆకర్షించాయి. కాంతారావు-పాణి కాంబినేషన్ లో వచ్చిన ఘంటసాల, బాలుడు – ఇద్దరి వేరు వేరు పాటలు ఇప్పటి భాషలో చెప్పాలంటే కెవ్వు ! ఊహల ఉయ్యాల నాలో ఊగెను ఈ వేళ , ఏ ఊరు మీ పయనం చక్కని మగరాయా, చిరు చిరు చిరు నవ్వులు, అడగవే జాబిల్లీ, ఇదియే అందాల మానవ సీమ, వంటి డ్యూయెట్స్ లో మాస్టారూ, మనసులోని మౌన వీణ, ఏ ఊరు ఎవరు మీ వారు వంటి డ్యూయెట్స్ లో బాలుడు అదర గొట్టేశారు. మెల్ల మెల్లగా జానపద చిత్రాలు అంతరిస్తున్న సమయం ఆసన్నమైంది అప్పటికే. పాణి లేని లోటు జానపద చిత్రాలకి చోటు ఇవ్వలేక పోయింది. గురువును మించిన శిష్యుడు – ఈ చిత్రం పాణి ప్రతిభకి దర్పణం పట్టింది. బంగారు తిమ్మరాజు – ఈ చిత్రంతో ఏసుదాస్ అనే అద్భుత గాన ప్రతిభకి తెలుగు వారు హారతి పట్టారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనే పొడవాటి పేరు ఎప్పటికైనా పేరు నిలుపుకుంటుంది అని తాను గ్రహించడమే కాదు తబల్ల గ్రుద్ది వాదించిన ‘పొట్టి ప్లీడరు’ కోదండపాణి. బాలుడి ఇంటి పేరులో శ్రీకారం ఉంటే బాల గళం ఏ చిత్రంతో శ్రీకారం చుట్టాలీ? అదృష్టం ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంతో ఏకంగా మూడు శ్రీకారాలతో వచ్చి వాలింది. ఒక్కొక్క శ్రీ పదేళ్ళు అనుకుంటే మూడు పదుల కాలం హాయిగా సాఫీగా సాగిపోయింది బాల గళం (అదే బాలు గళం). అసలది గళమా? గలగలల గంగాళమా? అందుకే ‘గిన్నీ’స్ రికార్డ్ కెక్కింది. పాణి లేనిదే ఈ బాలు లేడు- ఇది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తరచూ చెప్పే మాట! మనకి మరో మేధావి ఉన్నారు. ప్రతివాది భయంకర శ్రీనివాస్! ప్లీడరూ, వాది అంటూ ఏమిటి ‘లా’ పాయింట్లు వస్తున్నాయి? పి బి శ్రీనివాస్ గొంతు నటుడు హరనాథ్ కి అచ్చంగా సరిపోయేది. కాని పాణి నటుడు కాంతారావుకి శ్రీనివాస్ చేత పాడించి ‘ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మ ముడి’ అని నిరూపించారు. కనులే కలిసే వేళ జలపాతమల్లె ఉరికేను మనసు ఏలా? – అని అందరిచేతా ప్రశ్నించారు. మిశ్రపీలూ రాగానికి కేరాఫ్ అడ్రస్ పాణి. (సంగీతంలో) ఈ తరం తెలుగు పెద్ద కోటి గారు ఒక చోట పాణి-మిశ్ర పీలూ అనుబంధాన్ని తలచుకున్నారు. చిన్నారి రాణి సిరిమల్లె పువ్వు, అనురాగమాల విరిసింది, ఏ ఊరు ఎవరు మీ వారు, ఒకటై పోదామా ఊహల వాహినిలో ----ఇవన్నీ పాణి కనిపెట్టిన మిశ్రపీలూ మిశ్రీ (పటిక బెల్లం) మాధుర్యాలు. సందర్భం వస్తే చాలు ఒక్కో వాయిద్యాన్ని ప్రత్యేకంగా ఉపయోగించి ఆ వాయిద్యం విలువ నలుగురికీ తెలిసేలా కృషి చేశారు పాణి. లాలిజో లాలిజో, చీకటి విచ్చునులే –పాటల్లో మౌత్ ఆర్గాన్, ఓ మనసు దోచిన చెలికాడా – పాటలో సాక్సో ఫోన్, రా వెన్నెల దొరా పాటలో సితార్, ఇంతమాత్ర మెరుగవా కన్నయ్యా, ఒకసారి కలలోకి రావయ్యా, నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన, ఎవరూ లేని చోట ఇదిగో చిన్న మాట, చూపులు కలసిన నాడే --- వంటి పాటల్లో ఫ్లూట్, బొమ్మను చేసి ప్రాణము పోసి – పాటలో హార్మోనియం, వయోలిన్ ప్రత్యక అదనపు ఆకర్షణలు. ఓరచూపులు చూడక ముందే, చెలీ నీ కోరిక గులాబీ మాలిక – వంటి పాటల్లో తతిమ్మా వాయిద్యాలు వినిపిస్తాయి. ఎన్ని ఉన్నా తబలా పైన ఆయన వినిపించే తాధిమి తకధిమి దరువుల తీరే వేరు. ఇది పాణి బాణీ అని చెప్పే ముద్రా శాస్త్రం! చిత్రం ఏమిటంటే ఆయనకి ఐదేసి ఏళ్ళకో గురువు ఉండేవారు. తొలి దశలో సుసర్ల దక్షిణామూర్తి, మరో దశలో మహదేవన్ – ఈయన గురువులు. అందుకేనేమో ‘గురువును మించిన శిష్యుడు’ అనే చిత్రం టైటిల్ ఈయన కోసమే అన్నట్టు వచ్చింది. కాని విధి విలాసం – చిన్న వయసులోనే ( నాలుగు పదుల మీద అయిదేనండి) పాణి భూమిని విడిచి పెట్టడం జరిగింది. ఆ తరువాత మహదేవన్, ఆయన తరువాత సుసర్ల వారు తరలి వెళ్ళారు. వారికి స్వాగతమివ్వడానికి ఆ ‘మోసం ద్వేషం లేని సీమలో ..ద్వారానికి తారా మణి హారం’ తో ‘మొగసాల నిలిచెనీ (పాణి) మందారం’! ఇవాళ్టి కృష్ణప్రేమ లో పాణి ప్రత్యేకతలు రెండు ఉన్నాయని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఆస్వాదించండి వాటిని. పాట పల్లవికి ముందు ఆఆ ఆఆ ఆఆ అని గానీ ఓఓఓఓ అనిగానీ సుదీర్ఘ కాలం ఆలపిస్తే వాటిని ఆలాపన అంటాం. కాని ఒకటి రెండు సార్లు మాత్రమే పాట పల్లవికి ముందు ఓ అనే ఏకాక్షర ప్రయోగం చెయ్యడం కోదండపాణికి మాత్రమే చెల్లింది. రాగానికి, గాత్ర సౌకర్యానికి ఇది వీలు కల్పిస్తుంది. ఓ అని పిలుపు రూపంలో ప్రయోగించడం వేరు. ఓ జవరాలా, ఓ నిండు చందమామా, ఓ చిన్నదాన నన్ను విడచి పోతావటే.... అన్నట్లు. ఓ ఓ ..అనే ఊతం సాయంతో పాణి పల్లవి పండించిన పాటలు రెండుచేతులారా నిండేలా పది ఉన్నాయి. ఓఓఓఓఓఓ...ఇది మల్లెల వేళయనీ (సుఖ దు:ఖాలు), ఓ ..అందాలు చిందే ఆ కళ్ళ లోనే (సుఖ దు:ఖాలు), ఓఓ..పదారు నా వయసు (సుఖ దు:ఖాలు) (ఒకే చిత్రంలోనే అటువంటివి మూడు పాటలు!), ఓఓ ఓ ..వెన్నెల్లో కనుగీటే తారకా (గురువును మించిన శిష్యుడు), ఓఓ ..తుమ్మెదలు కొమ్మల ఝుమ్మని (గురువును మించిన శిష్యుడు) (ఒకే చిత్రంలో అటువంటివి రెండు పాటలు), ఓ ఓ ఓ కమ్మని కలలా కనిపించాడే (ఉక్కు పిడుగు), ఓ ఓ ..జలకాలలోన (పేదరాశి పెద్దమ్మ కథ), ఓ ...ఏమి ఈ వింత మోహం (శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న), ఓఓఓ ..వలపు కౌగిళ్ళలో కరిగి పోయేములే (రణభేరి), ఓ ..విశాల గగనంలో చందమామ (మహాబలుడు) – ఇవండీ ఆ పాటలు! కొన్ని కనులు చూసినా పాటే, కొన్ని కనులు మూసినా పాటే ద్వారాలకి తోరణాలై ఉన్నాయి. చూడండి, చూస్తూ వినండి. వినండి, వింటూ చూస్తుండండి. రెండో ప్రత్యేకత- రా! ఏకవచనంలో ఏమిటీ దుర్భాషలాడటం? అని పొరపడకండి. ‘రా’ అనే ఆహ్వానం ఎంతో మృదువుగానూ, లాలిత్యం గానూ, కటువుగానూ చేయవచ్చు. పాణి స్వర కల్పనలో ఎన్నో ‘రా’ పాటలు వచ్చాయి. ఒక్కొక్క పాటలో ఒక్కొక్కలా ‘రా’ ప్రయోగం జరిపారు. రా వెన్నెల దొరా – అని ఆమె అన్నప్పుడు ఆ ‘రా’ లో ఒక చీత్కారం, అతను అన్నప్పుడు అదే ‘రా’ లో ఒక బుజ్జగింపు ఉంది. రా రా రమ్మంటే రావేమిరా ....రారా రారా రా ..అని ఆమె ఎన్ని రకాలుగా ‘రా’పోర్ట్ ఇచ్చిందీ! రా రా అంది వెన్నెల అని సాకి రూపంలో ఆమె అన్నప్పుడు రెండు ‘రా’లు గాయి అక్షరాలు దొర్లాయి. పల్లవిలో మూడు ‘రా’లు రాటుదేరాయి. రావేలా జాగేలా? ఓ ప్రియా ----అని ఆమె వేడుకుంటుంటే అంతే వేగంతో మనం కూడా అతన్ని జాగృతం చేయాలనిపిస్తుంది రావేల కరుణాల వాలా ---అని ఆమె ఎంతో ఆర్ద్రంగా నారాయణ ధ్యాసలో ఉండి పాడుతుంటే చివరికి ఒక్కటే మాట అనాలనిపిస్తుంది – ఓ కోదండ పాణీ...ముప్ఫై తొమ్మిదేళ్ళ క్రితం వెడలిపోయిన నీవు మరు జన్మ పొంది మరల రావేలా? (కనులు మూసినా పాటే లో – రమ్మంటే వచ్చేసాయి ఈ రా పాటలు). కనులు చదివినా పాటే- విశేషం ఉంది గనకనే కనులు చదవాల్సిందే. 'విశ్వము కంటే' అనే పద్యం లాంటి పాట బాల సుబ్రహమణ్యం గానం చేసిన రెండవ పాట. ఇప్పుడిది వీడియోల్లో లభ్యం కాదు (ఈ పాట మినహా తతిమ్మా పాటలున్నాయి.) -డా. తాతిరాజు వేణుగోపాల్, 05 ఏప్రిల్ 2013
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|