మునుపటి నా మాట
శ్రీరామ నవమి వచ్చి వెళ్లిపోతేనేం శ్రీరామా...నీ నామ ధ్యానం ఒక్క శ్రీ రామదాసు ఆ సుందర హనుమకే కాదు మాకూ నిత్య సంతోషమే. ఇదిగో ఇవాళ చైత్ర పౌర్ణమి! అయ్యో రామచంద్రా... పాక్షిక చంద్ర గ్రహణం అర్ధ రాత్రి దాటాక వస్తోంది. సూర్య వంశానికి చెందినవాడివి, శ్రీరామ చంద్రుడివి, పైగా భూమిజను స్వీకరించిన వాడివి - నీకు గ్రహణాల గురించి చెప్పాలా? అయినా- ఒక్క మంధర లాంటి వ్యక్తి చాలు స్వామీ వందలతో పనిలేదు, సాఫీగా సాగిపోయే సంసారాలకి గ్రహణం పట్టించడానికి, అల్లారు ముద్దుగా నిన్ను అడ్డాలనాడు చూసుకున్న ఆ కైకమ్మ వంటి అమ్మల బుద్ధి పక్క దార్లు పట్టించడానికి. ఏమైతే నేం! మీ నలుగురు సోదరులు మంచివారు. లక్ష్మణుడు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేందుకు మీతో కదిలి వచ్చాడు. నీకు భరతుడంటే మక్కువెక్కువ! అతను వచ్చీ రాగానే నువ్వు అడవులకు వెళ్ళిపోయావని విని అడలి పోయాడు. 'తల్లి దురాశాయు, తండ్రి వియోగము(1)' విని నొచ్చుకుంది అతని నిష్కల్మష మది. నువ్వే రాజువి కావాలని బతిమిలాడాడు. ఆడి తప్పడం ధర్మం కాదన్నావు. పాదుకలిచ్చావు. వట్టి పాదాలతో వనవాసం చేశావు. అడవిలో 'సీతమ్మ నడిచింది రాముని వెంట -రాముడు ఉన్నాడు సీతమ్మ కంట(2)' అని జటాయువుకి తెలుసు. 'ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్ప బోతుంది(3)'!
గుహుడు నీ పాదాలు కడిగి మీ ముగ్గురునీ తన నావ ఎక్కించి గోదావరి నది దాటించాడు. ఒక ముసలి అవ్వ- పేరు శబరి- కంట తడి పెట్టుకుంది. నీ ఆకలి బాధ తీర్చేందుకు పళ్ళు ముందే రుచి చూసి పెట్టి నీకిచ్చింది. కులం,జాతి వంటివి ఇప్పుడు ఎంతగా వేళ్ళూని పోయాయో రామా... ఇక మా వల్ల కాదు...ఎటో ఎటో పోతున్నాం మేం. సంఘంలో ఉంటున్నాం కానీ మేం సంఘ జీవులం కాం. నీ రామాయణ పఠనమే తప్ప మా పతనం గురించి ఆలోచించం. పరిష్కార మార్గాలు అన్వేషించం. బహుశ: ధర్మం అన్నది మాకు అవగతం కాని ఏకైక విషయమేనేమో! చివరికి సీతాపహరణం జరగనే జరిగింది. రావణ పగ పరాకాష్టకి చేరుకుంది. సీతమ్మని అపహరించి రావణుడు ఏ దిశ వైపు పోతున్నదీ చెప్పేసి జటాయు 'చిరిగిన రెక్కల నేలకు ఒరిగింది(4)'. పక్షి కూడా నీ పక్షమే తండ్రీ. చైత్రమాసం --ఏ రోజుకా రోజే మల్లెల వేళ....అక్కడక్కడా ఇంకా నిండు వెన్నెలలు కాస్తూనే ఉంటాయి. నీల మేఘ శ్యాముడివి, సూర్య వంశీయుడివి, శ్రీరామ చంద్రుడివి ...నీకు తెలుసు ...ఆ సూర్య తేజమే చంద్రుడు స్వీకరించి వెన్నెలగా భువికి తరలిస్తున్నాడని. నీ అనురాగ తేజం మా జానకి నిను చెట్టాబట్టగ ఆమె పట్ల నిత్య జాహ్నవి అయ్యింది. అలాంటి ఒకానొక చైత్రమాసం శుక్ల పక్షం నవమి నాడు నువ్వు ఉద్భవించావు కదా... 'నవమి నాటి వెన్నెల నీవు(5)' ...మరైతే నీ వైపే ఎందుకు కలగాలీ రాక్షస తామస వికృత చేష్టలు!. అవతార పురుషుడిని అని అనుకోలేదు నువ్వెప్పుడూ. మానవుడిగానే అన్నీ భరించావు. పధ్నాలుగేళ్ళు వనవాసం చేసినప్పుడు నీ పాదయాత్రలు ఎంత మందిని నీ భక్తుల్ని చేశాయీ. భరతుడు సరే- సోదరుడే- అయినా పాదుకలు పెట్టి పూజించాడు. అయ్యో-- ఇప్పుడు పాదయాత్రల పేరిట నాయకులు తిరగలేక 'కాళ్ళు' తేలవేస్తున్నారు స్వామీ..పవిత్రమైన మంత్రాలయంలో చెప్పులు విసురుకుంటున్నారు స్వామీ... అప్పటి నీ కాలం కన్నా మించి పోతున్నాయి రాక్షస తామస వికృత కృత్యాలు. ప్రతి వంద మందిలో ఒక రావణుడు తప్పక ఉంటున్నాడు. వాడు వింటి నారి విరిచి పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పక్కింటి నారి మీదా, ఆమె కోక మీదా ఒక కన్ను వేసే ఉంచుతున్నాడు. అయిదేళ్ళ బాలికైనా, అయిదయిదుల కన్య అయినా, అరవై ఏళ్ళ మహిళ అయినా వాడి కొకటే- రావణుడే నయం. అపహరించాడే కాని సీతమ్మకి ఎటువంటి అన్యాయం చెయ్యలేదు. అపహరణం తోనే దొరికింది అతనికి అతనిలో రగిలిన పరాభవ జ్వాలలకి ఉపశమనం. అయినా తప్పు తప్పే. బృహస్పతి బుద్ధినిస్తే అహంకారం బురద లోకి నెట్టేస్తుంది. నువ్వు నీ బుద్ధిని సదా 'ధర్మ రక్షణ' నిమిత్తం ఉపయోగించావు. నువ్వూ,సీతమ్మా ఒకరికొకరం అని అనుకోబట్టి, ఉత్తమంగా ఉద్భవించారు కాబట్టి మీ నాలుగు పాదాల సాక్షిగా ధర్మం నాలుగు పాదాలుగా నడిచింది. మండోదరి అయ్యయ్యో అన్యాయమండీ అన్నా రావణుడు అహంతో విర్రవీగాడు. జ్ఞానియే కాని నీలా శ్రిత ప్రజ్ఞుడు కాడు తను. అసలు వాల్మీకి పదహారు లక్షణాలున్న నాయకుడు తన కావ్యానికి కావాలి, వేరు వేరుగా పదహారుమంది కాదు, అన్నీ ఉన్న ఒకే ఒక్కడు ఉన్నాడా అని నారదుల వారిని అడిగితే ఆయన పలికిన పేరు-'శ్రీరాముడు'! ఆ పదహారు కళల, లక్షణాల చంద్రుడు అంటే శ్రీ రామ చంద్రా నువ్వే. రామాయణ కావ్యంలో ఒక్కొక్క ఘట్టం లో నీ ఒక్కొక్క లక్షణం కనపడి ఔరా అని అబ్బురపడ్డాం. అందులో ఒకటి- భూత దయ! జటాయు నేల కొరిగితే స్వంత బంధువులా అంత్యక్రియలు జరిపావు. సరే ... తరువాత ప్రత్యక్షమైంది మీ ఎదుట వానర స్నేహామృత హస్తం! అక్కడా మళ్ళీ వాలీసుగ్రీవుల మధ్య పోరు! అధికారం, సింహాసనం, కీర్తి దాహం అలవాటైపోతే అహంకారం, మొండిపట్టు, అనాలోచిత చర్యలు బలిసిపోతాయి. అహంకారం, ఆత్మ విశ్వాసం ఒకే నాణానికి ఇరు ప్రక్కలు. ఆత్మ విశ్వాసం మితి మీరితే అహంకారానికి దారి తీస్తుంది. వీటిని నియంత్రిస్తూ ముందుకు దూసుకు పోగల ధీశాలి హనుమ అని నువ్వు కనిపెట్టావు. హనుమకి తన శక్తి మరొకరు చెబితేనే తప్ప అది ఇనుమడించదు. జాంబవంతుడు అంతమంది వానరుల మధ్య హనుమని గుర్తు పట్టి ప్రోత్సాహ మిచ్చాడు,ఉత్సాహ పరిచాడు. వాలిని వధించావు. సుగ్రీవుడు ఆ ప్రాంతానికి రాజయ్యాడు. నీ పదహారు గుణాలు ఒక్కొక్కటి గమనిస్తూనే వాయు నందనుడు నీకు పూర్తిగా దాసుడయ్యాడు. ఆ భక్తాగ్రేసరుడు ఆంజనేయుడు శివాంశే. అతని ద్వారనే నీకు విజయ సిద్ధి కలగాలి, రావణ హతం జరగాలి - ఇది త్రిలోక పాలకుల నిర్ణయం. రావణుడు శివ భక్తుడే. శివుడి ద్వారా పది తలలు వరాలుగా పొంది పదకొండవ తలని తన్ని పారేశాడు. వరం వెనకనే శాపం ఉందని గ్రహించలేక పోయాడు. అందుకు శిక్ష హనుమ రూపం ద్వారా విధించడమన్నదే దైవ సంకల్పం. హనుమకి అణిమాది అష్ట విద్యలు తెలుసు. విరాట రూపం దాల్చి లంక వైపు దృష్టి సారించి యోగ విద్యతో గాలిలో తేల గలడు. వాయు, అగ్నిదేవులు ఆయనకెపుడూ వెన్నంటి ఉండి సహకరిస్తారు. హనుమ సూక్ష్మ శరీరం దాల్చి సీతమ్మ ఎదుట నిలిచి శోకిస్తున్న ఆ తల్లిని నవ్వించగలడు. శ్రీరామ దూతగా రావణు ఎదుట బందీ అయి కోతి చేష్టలు చూపి కవ్వించ గలడు. అటువంటి హనుమ నయానా ఒదిగి సీతమ్మను విడిచి పెట్టమన్నాడు. హనుమ మాట వినలేదు రావణుడు. వినమన్నాడు అతని సోదరుడు విభీషణుడు. అతన్నీ పొమ్మన్నాడు రావణుడు. కోతి అని హనుమను అవహేళన చేశాడు. చిచ్చు రగిల్చాడు హనుమ. భయానా ఇలా చేస్తేనే తప్ప రావణుడు వినే రకం కాదని తెలుసుకున్నాడు. ఒక రకంగా ఆ అగ్నితో లంకని పునీతం చేశాడు అని చెప్పొచ్చు. మాకూ జరుగుతుంటాయి అగ్ని ప్రమాదాల పేరిట అవసరమైన 'ఫైళ్ళు' తగలబెట్టేయడ మనే తంతులు. కంప్యూటర్ క్రాష్ పేరిట నష్టపోయే అతి ముఖ్యమైన సమాచారాలొక వైపు, ఎలా వస్తుందో తెలియదు అగ్ని, సరిగ్గా ఆఫీసుల్లో దూరి వాటినే తాకుతుంది. ఎప్పటివో సినిమాలు కష్టపడి ఒక చోట చేర్చితే అదేం మాయాజాలమో కాని అనలం వాటిని తగలబెట్టకుండా ఉండలేదని అనలేం. రామేశ్వరంలో శివ పూజ చేశావు. శక్తికి మారు పేరు, మారు రూపం హనుమ కనుక శివశక్తి తనవైపు ఉందని ఇంక లంక వైపు రణమొక్కటే శరణమని తెలుసుకున్నావు. వారధి కట్టింది వానర సైన్యం. రావణు తలలే కాదు, ఆయన భద్ర పరచుకున్న మృత్యుంజయ రహస్య పేటిక కూడా నేల కొరిగాయి. అమ్మయ్య! చివరికి అగ్ని పునీత అయి అమ్మ నిన్ను చేరుకుంది. ఎంత మిత్రత్వం ఆశించినా అదేమిటో శత్రుత్వం ఎప్పుడూ మావైపు పొంచే ఉంటుంది. దురాక్రమణల తోనే ఎవరో ఒకరు కయ్యానికి కాలు దువ్వడం పరిపాటి అయిపోయింది. నెయ్యానికి చెయ్యి అందివ్వడం ఎందుకు కుదరదో? బహుశ: నీకానాడు ఉన్నట్టి రామదూతలాంటి వారు మాకీనాడు కరువై పోవడమే ఈ అనర్థాలకి కారణం కావొచ్చు. వాల్మీకి మహర్షి రామాయణ కావ్యమంతా రాసి 'సుందర కాండ' లో మళ్ళీ హనుమంతుడి ద్వారా సంక్షిప్తంగా రామకథను చెప్పిస్తాడు. అందుకే అన్నారు- రామాయణం మొత్తం పారాయణం చేయలేకపోయినా ఒక్క సుందరకాండ చదివితే చాలని! అందుకే మా తులసీదాసు సంస్కృతంలో కాకుండా తనకు తెలిసిన అవధి పలుకుబళ్ళతోనే శ్రీ రామ చరిత మానస కావ్యం వ్రాశాడు. అక్కడితో ఊరుకోక హనుమంతునికోసం హనుమాన్ చాలీసా పేరిట నలభై చౌపాయీలు వ్రాశాడు. దీని గురించి కొంచెం వివరంగా చెప్పాలనుంది రామా. ఈలోగా మళ్ళీ మహర్షి వాల్మీకి వైపు దృష్టి మళ్లిద్దాం. మహర్షి సుందరకాండలో సంక్షిప్త రామాయాణం ప్రస్తావించినట్టు మేం 'పాట' అనేదానికి పల్లవి, అనుపల్లవి, చరణాలు అని భాగాలుగా పేర్చుకునీ ప్రతి చరణం చివర్లో మళ్ళీ పల్లవి పాడుతాం. ఇలా మేం లలిత గీతాలు అని అనుకున్నవి కాస్త ఆకశావాణికే పరిమితం కాగా అవకాశం అంది పుచ్చుకున్నవి సినిమా గీతాలై కలకాలం రాణించాయి. అన్నమయ్య, గోపన్న, త్యాగయ్య ఒక్కొక్కరు -ఒక్కో శతాబ్దంలో శ్రీ రామ నామ గానం చేసి తరించారు. గోపన్న రామదాసై దాశరథీ శతకం రాశాడు. మా నాగయ్య గారైతే పోతన,త్యాగయ్య, రామదాసు పాత్రల్లో లీనమై నటించారు. వారే ఈయన అన్నంత నిష్టగా ఆ పాత్రలు మలిచారు. అదేం చిత్రమో తరువాత మరో పోతన, మరో త్యాగయ్య రాగాలిగినా ప్రేక్షకుల మనసుల్లో వారు పరాజయం పొందారు. నాగయ్య గారు రామదాసు సినిమా నాటికి అప్పుల్లో కూరుకు పొతే ఇరవైవ శతాబ్దంలోని రామదాసు మాత్రం రాఘవేంద్రుని కృపవల్ల గొప్ప వాడై పోయాడు. నాగయ్య గారు నట గాయకులు. అటువంటిది కాలానుగుణంగా ఆయనకీ వేరే ఎవరైనా పాడవలసి వచ్చినా వారిని ఆశీర్వదించారు తప్ప ఆయనెప్పుడూ ఆగ్రహించలేదు. అలా శ్రీనివాస్, ఘంటసాల వారు ఆయనకి ఒకే ఏడాది చెరొక సినిమాలో ప్లే బ్యాక్ పాడారు. ఎంతమంది రామగానం చేసినా, హనుమ గానం చేసినా ఎంతో పారవశ్యం పొందేవారు. నీ నామమే అంత. మా కవులు వాల్మీకి పద రేణువులు మోస్తూనే అద్భుతమైన పద చిత్రాలతో చిత్రసీమలో శ్రీరామ పాద ముద్రలు పడేలా చూశారు. తన పేరులోనే 'రాఘవ' శబ్దం ఉన్న సముద్రాల ఆచార్యుల వారు ఎన్ని సార్లు రాసినా రామాయాణ ఘట్టాలు కొత్త కొత్త తెలుగు వెలుగులతో కళ్ళ ముందు నిలిచేవి. ఘంటసాల మాస్టారు అనే గత శతాబ్దపు త్యాగయ్యకి సైతం ఈ రాఘవ గారే సినీ గురువులు. ఇంకొక రాఘవులు ఆయనకి శిష్యులు. యాభైల కాలంలో వచ్చిన భూకైలాస్ చిత్రంలో సముద్రాల వారు 'రాముని అవతారం' రానున్నది అనే భవిష్య దర్శనం చేయిస్తూ ఒక పంక్తిలో 'కపట నాటకుని పట్టాభిషేకం' అన్నారు. పాడేది నారదుడు. అతను కలహ భోజుడు. అతను సదా స్మరించే నారాయణుడు నటన సూత్రధారి. ఆ నారాయణ అవతారమే శ్రీరాముడు. అందుకే ఆ చొరవతోనే నారదుడు కపటనాటకుడు అని శ్రీరాముణ్ణి ఉద్దేశించి అన్నాడు. అంతకు ముందు ఇదే పాటలో ఒక చోట సీతా స్వయంవర సందర్భంలో ఈ కవి ఇలా అన్నారు- 'దనుజులు కలగను సుఖగోపురమో' అని! ఇక్కడ రాక్షసులు సీతను పరిణయమాడడం అన్నది వారికి ఊహాలోకంలో దొరికే height of pleasure! అదే మాటను 'సుఖ గోపురం' గా ప్రయోగించారు సముద్రాల కవి వర్యులు. ఇదే చిత్రం కన్నడ భాషలోనూ తీస్తే అందులో ఇదే వరసలో వచ్చిన పాటలో ఈ సుఖ గోపుర పదావళి రావడం విశేషం. ఇదే పాటలో ఒక చోట 'వానర కుల హనుమ' అని తెలుగులో కవి రాస్తే కన్నడ కవి 'కన్నడ కుల హనుమ' అన్నారు. దీని భావమేమి అవధానిగారూ అని మేం బెంగళూరులో ఒక అవధాని గారిని సతాయించాం, అప్రస్తుత ప్రసంగంతో. ఆయన బెంగ పడలేదు,భంగ పడలేదు. ఏం చెప్పారో గుర్తు లేదు. నువ్వైనా చెప్పు శ్రీరామా.... ఆ తరువాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 'లవకుశ' అనే తొలి తెలుగు రంగుల చిత్రం పూర్తి చేశారు అరవైల కాలంలో. సముద్రాలవారు ఈసారి లవకుశల నోటిద్వారా మూడు దశలుగా రామాయణ పారాయణం చేయించారు. వనాశ్రమంలో నలుగురి ఎదుట చెప్పేటప్పుడు 'రామకథను వినరయ్యా' అన్నారు. అదీ ఎటువంటి రామకథ...ఇహపర సుఖముల నొసగేది! అదేమిటి? రాముడెప్పుడైనా సుఖమన్నది అనుభవించాడా? అటువంటిది ఆయన కథ వింటే మనకి సుఖం దక్కాలా? అయ్యో..మన బుద్ధి ఇంతేనా? కవి చతురుడు. సీతారామ కళ్యాణం వరకు కథ సుఖాంతమే కదా. అదే ఆ బాలురి చేత పలికించారు. అది సరే--మరి రెండో భాగం లో 'వినుడు వినుడు రామాయణ గాథ' అని చెబుతూ 'ఆలపించినా ఆలకించినా ఆనంద మొలికించే గాథ' అని అన్నారు. అదంతా రాముడు వనవాసమేగే ఘట్టం. అయోధ్య గొల్లుమని ఆగమని రామయ్యను బ్రతిమిలాడినా ఆడితప్పనివాడు అడివికి పయనమైన ఘట్టం. మరి ఆ కథ ఆనందమెలా ఇస్తుంది? కవి ఉద్దేశ్యం ఏమిటీ? ఓహో- కష్టకాలంలోనూ శ్రీరాముడిలా నిబ్బరంగా ఉండమని అదే సత్ చిత్ ఆనందమని ఇలా చెప్పారా? ఇక- మూడవ భాగం అయోధ్యా పురిలో కౌసల్య , ఇతర స్త్రీమూర్తుల ఎదుట శ్రీ రాముని చరితమును తెలపడం కాబట్టి 'తెలిపెదమమ్మా' అన్నారు. అక్కడ లవకుశుల లక్ష్యం ఘన శీలవతి సీతమ్మ పడిన కష్టాలు వారికి గుర్తు చెయ్యడమే. ముక్తాయింపుగా 'సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత' అని సూటిగా శ్రీరామ హృదయాన్ని కలవర పరిచేలా బాలురు పలికారు. 'వాల్మీకి' చిత్రం కూడా అదే కాలంలో విడుదలైంది. అందులోనూ సముద్రాల కవి వర్యులు రామాయణ కావ్యాన్ని పదకొండు అంశాలుగా సంక్షిప్తంగా తెలియ పరిస్తే ఘంటసాల వారు రాగ మాలికతో తేటతెల్లం చేశారు. అరవైల చివరిలో ఈ సముద్రాలవారు నీలో చేరక ముందు ఆఖరి పాటగా రామాయణ గానమే రచించారు. శ్రీరామకథలో అప్పడే బాలగంధర్వుడొకడు ఉద్భవిస్తూ గానం చేసాడు ఆ ఇరవై చరణాల సుదీర్ఘ కథాగానాన్ని. ఆ బాల గంధర్వుడిని ఆబాల గోపాలం కోసం వెలికి తెచ్చిన గురువుల పేరు నీదే స్వామీ..కోదండపాణి! త్యాగయ్య 'వెడలెను కోదండ పాణి' అని మకుటంగా పల్లవి పాడితే అది నచ్చి ఈ కోదండ పాణి కూడా డబ్భైల నాటి తొలి దశలో నిను చేరాలని వెడలి పోయాడు. నువ్వు పరమాత్మవి, ఆంజనేయుడు ఆత్మ అని అనుకుంటే మాకూ అటువంటి ఇద్దరు కవులుండేవారు. ఇప్పుడు చెప్పిన సముద్రాల వారికి మల్లాది రామకృష్ణశాస్త్రి గారు వెన్నంటి ఉండేవారు. అదే అరవైల కాలంలో మల్లాది వారి చివరి చిత్రం 'వీరాంజనేయ' కావడం ఆ హనుమ కృత్యమేనా రామా? 'హనుమ జనమకు తారకమౌ ఆనంద ధాముని దివ్య కథ' చెప్పి సముద్రాల వారికన్న ముందే నీలో కలిసిపోయేందుకు సెలవు తీసుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే సినిమాలు రాక పూర్వం వీధి నాటకాలతో సర్ది పెట్టుకునేవారు. అంతదూరం వరకు వినిపించే నట గాయకులకే అది చెల్లేది. సినిమాల నిర్మాణం తేలిక కాగానే శ్రీరామ స్మరణం అధికమైంది. అయినా చిత్రాలు గీసి బొమ్మల రామాయణాలు అచ్చొత్తి కూడా శ్రీరాముని నిత్యం స్మరించేవారు. అలా ఒక అద్భుత చిత్రకారుడు 'బాపు' అనే మారు పేరుతో ఝంఝా మారుతంలా దూసుకొచ్చి ఇలా అలా గీతలు తిప్పి 'తెలుగు' రాముడు, తెలుగు సీతల రూపు రేఖలు ఇలా ఉంటాయి అని ప్రపంచానికి చూపించారు. అక్కడితో ఆగక ఒక సంపూర్ణ రామాయాణం, ఒక సీతా కళ్యాణం, ఒక శ్రీరామ రాజ్యం సినిమాలు తీసి నీ సేవ చేసుకున్నారు శ్రీరామా. నీ కథనే సోషియో ఫాంటసీ అనేలా 'ముత్యాల ముగ్గు' వేసి, ఆధునికం చేసి మరీ మెప్పించారు. సీతాకళ్యాణం చిత్రంలో ఆరుద్ర కవి (ఈయన నిన్ను నమ్మే వారు కాదు రామా.. అయినా చూడు) రమణీయం,కమనీయం అనిపించే సీతారామ ఘట్టాలు వినిపించారు. సముద్రాల వారి తరువాత ఎక్కువగా శ్రీరామ గానం చేసింది ఈయనే మళ్ళీ. పైగా విష్ణు సహస్ర నామాలే కదా... నీవి మాత్రం 'శతకోటి' నామాలని, ఒక్కొక్కటి బహు తీపి అని వింత సమాసాలతో , కొత్త తమాషాలతో నీ గురించి చెప్పని క్షణం లేదు. ఇలా నీ నామాలు చెప్పాలనే తపన ఆయనకి తమిళ కవి కన్నదాసన్ నుంచి కలిగింది. కన్నదాసన్ గారి పాటని తెలుగు లోకి అనువదిస్తూ పది నామాలు పట్టుకో గలిగారు. కళ్యాణ, సీతా, రాజా, సుందర, కౌసల్య, దశరథ, కోదండ, జయ, శివ, శ్రీ -రామా అని నిన్ను పిలిస్తే సులభ ప్రసన్నుడవౌతావు కదూ. ఎందుకో వీరికి ప్రేరణ 'లవకుశ' నాటి సముద్రాల వారేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికే ఆయన 'జగదభిరాముడు, రఘుకుల సోముడు, ధర్మావతారుడు, వీరాధివీరుడు, ప్రేమావతారుడు,యుగ పురుషుడు, పురుషోత్తముడు' అనే సప్త గుణాలు కలవాడిగా నిన్ను కీర్తించారు. సముద్రాల వారి కీర్తి అలా సప్త సముద్రాలు దాటి ఉండవచ్చు. అయితే..వీరికి ప్రేరణ వాల్మీకి మహర్షే. సంకోచం లేదు. 'శివకేశవుల భేదం లేక భువిలో వెలసిన శివరామా' అన్నప్పుడు ఎందుకో విశ్వనాథన్-రామమూర్తి అనే జంట స్వర కర్తలు గుర్తుకొస్తారు. ఎందుకంటే - ఒకరి పేరులో శివుడు, మరొకరి పేరులో రాముడు ఉన్నారు - ఇదంతా నీ పనేనా రామా? ఇప్పుడు ఈ రామమూర్తి గారు మా శ్రీనివాసు వెంట తానూ పయనమయి నీలో కలిసి పోయారు. శ్రీనివాసు గారు 'అగునా పాడగా రఘురాముని కథ' అనే దేవులపల్లి వారి పాటని ఎంతో హృద్యంగా ఇక్కడ ఆలపించినట్టే అక్కడ నీ దగ్గర ఆలపిస్తారు. విను రామా... ఈ తరంలో సిరివెన్నెల సీతారామ కవికి, వేటూరి సుందర రామమూర్తి కవికి 'శ్రీ ఆంజనేయం' సినిమా ప్రసన్నమైంది. సుందరరాముడు 'రాక్షస మాయ హతమే చేయ నీ నీడ చాలునయా' అని 'యా'దేశం ఇస్తే దేశమంతా నీ భక్తాంజనేయ గొప్పతనానికి మరోసారి జేజేలు పలికింది.'బంటువైనా నువ్వే, బందువైనా నువ్వే' అని నీ మానస పుత్రుడు హనుమంతుని రెండు రూపాలతో దర్శింపజేశారు ఈయన. చివరికి వినమ్రంగా 'శ్రీరామస్వామి పల్లకీ నువ్వంట...నీకు బోయీలు మేమే లెమ్మంట' అని ఆయన నీ దాసునికి ప్రణమిల్లితే ఆ కవి వరుణ్ణి అక్కున చేర్చుకున్నావు. ఇక సీతారామ కవి 'అంత భక్తి పరవశమా ..ఓ కంట మమ్ము గనుమా..హనుమా' అని నీ దాసు చూపునే సవాల్ చేశారు. అలా పాడేది 'గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ' అని వాయు పుత్రుడికి సరిజోడు నేనే సుమా అనే ఓ మామూలు మనిషి. అతనికి తెలుసు.. 'ప్రతి మంచి కార్యం జరిపించు దైవం' హనుమంతుడే అని. అతనికి నీ అభయం ఉంది, ఇతని ద్వారా మాకూ అభయముంటుంది. అందుకే అంటాను రామ! ఘనుడు నీ హనుమ! అని. శ్రీరామ నవమి నాటికి కుదరక ఈ పూట నా మాటగా హనుమ ప్రసక్తి తేవడానికి కారణం ఉంది శ్రీరామా. ఉత్తరాదిని ఈ చైత్ర పౌర్ణమి నాడు హనుమజ్జయంతి అని పాటిస్తారు. తెలుగువారు ఈ చైత్ర పౌర్ణమి కాగానే చైత్ర బహుళ పక్షం నుంచి వైశాఖ బహుళ దశమి వరకు నలభై తిథుల కాలం ఆగి ఆ దశమి నాడు హనుమజ్జయంతి గా పాటిస్తారు. ఉన్న మాట ఔనో కాదో తెలియదు కాని ఇది విన్న మాటే. ఈ నలభై కెంత విలువ ఉంది రామా! శ్రీశ్రీ కవి ఒకేఒక్క రామాయణ హరికథాగానం రాసినప్పుడు ఆదిలో వచనంగా 'నలభై రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను' అనే గిలిగింతలు పెట్టారు. ఇంక తులసీదాసు హనుమని కీర్తిస్తూ చెప్పిన నలభై చౌపాయీల నుంచి కొన్నిటిని ప్రస్తావించక పొతే నీ దయ మా పైన విస్తరించదో ఏమో- హనుమను దాసు 'కపీశ' అని అన్నాడు. సముద్రం దాటి వచ్చిన వాడిగా అందరికీ హనుమ చిరపరిచితుడు. అందుకే దాసు 'జ్ఞాన గుణ సాగర' అని అన్నాడు. తొలి చౌపాయీల్లో ముల్లోకాల్లో ప్రకాశించేవాడు హనుమ అని అన్నప్పటికీ 29వ చౌపాయీ లో నాలుగు యుగాలలోనూ ప్రకాశించే వాడిగా అభివర్ణించాడు. లోకం, యుగం -space & time ని సూచిస్తున్నాయి. అంజనీపుత్రుడు, పవన సుతుడు, మహావీరుడు, విక్రముడు, కేసరీ నందనుడు, ప్రతాపుడు, జగత్వందనుడు, విద్యావంతుడు- ఇవన్నీ దాసు చేసిన మారుతి స్తుతిలో పేర్కొన్న పేర్లు. అవధి భాషా పరంగా 'బజరంగీ' అని అన్నాడు ఒక చోట. అంటే వజ్రం లాంటి తేజస్సుతో ప్రకాశించే శరీరం కలవాడు హనుమ! హనుమ లో ఉన్న రెండు ప్రధాన గుణాలు ఏమిటంటే- కుమతి నివార (దుర్బుద్ధిని నివారించేవాడు), సుమతి కే సంగీ (సద్బుద్ధికి సాయపడేవాడు). ఇక హనుమ రూప వర్ణనం ఇలా చేశాడు దాసు- చెవిపోగులుంటాయి, ఉంగరాల జుట్టు ఉంటుంది, చేతిలో వజ్రాయుధం,ధ్వజం ఉంటాయి. భుజాన గడ్డిపోచ యజ్ఞోపవీతం ఉంటుంది. పిశాచ భయం, రోగ భయం మనుషుల్ని పట్టి పీడిస్తుంటాయి. ఒక్క హనుమ స్మరణే వీటిని దూరం చేస్తుంది. త్రికరణ శుద్ధిగా (మనసా వాచా కర్మణా) హనుమని సదా ధ్యానిస్తే ఎటువంటి విపత్తులు తలెత్తవు. చాలీసా పఠిస్తూ హనుమను తలిస్తే శ్రీరాముని కొలిచినట్టే. భగవంతునికీ సాధారణ మనిషికి మధ్య దూరం తగ్గించేది భక్తుడే. హనుమ లాంటి శ్రీరామ భక్తుడు దూత మాత్రమే కాదు....సంసార లంపట జలధి నుంచి లాగే చేయూత! ఔనా కాదా చెప్పు రామా....తప్పులుంటే మన్నించు. (కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే- అంతా రామ మయం, రామ భక్త హనుమ మయం. కనులు చదివినా పాటే- వాల్మీకి చిత్రం లోని ఘంటసాల వారి సుదీర్ఘ గానాక్షరి..) (ఫోటో కర్టసీ - పి.వి.సుందర్ కుమార్, బరంపురం - ఆ ఆంజనేయ విగ్రహం ఒడిశా బరంపురం లోనిదే.) (1 నుంచి 5 అంకెలు- ఇతర కవుల పలుకులు. పంచానన ప్రభువుని తలచినదే తడవు అయిదు పలుకులు వచ్చినట్టున్నాయి) -డా. తాతిరాజు వేణుగోపాల్, 25 ఏప్రిల్ 2013
1 Comment
ramana
30/1/2016 10:45:54 pm
జై sreerama
Reply
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|