మునుపటి నా మాట
లాభం లేదండీ... ఈ ఏడాది మనల్ని ఇబ్బంది పెడుతోంది. దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇపుడిపుడే గాయం మాయం అవుతోందనుకుంటే మరో గాయం సాయం రావడం ఏమిటీ? అదైనా మూడు రూపాల్లో రావడం ఖాయం అని మనమేమైనా కల గన్నామా? కల కనేందుకు కన్ను ఎప్పటిలా నిద్ర పోతూనే ఉంటుంది. నిద్రాభంగం కాగానే తెలుస్తుంది ఏదో ఉపద్రవం పొంచి ఉందనీ. ‘కన్ను తెరిస్తే జననం- కన్ను మూస్తే మరణం – రెప్పపాటే కాదా ఈ ప్రయాణం’ అని చంద్రసేన్ గారు రాసిన మినీ కవిత (భారతి, సెప్టెంబరు 1980) కి శీర్షిక – కంటి తెలివి. ఇది ఎంత వాస్తవమో – ఆది శంకరులన్నట్టు ‘పునరపి జననం పునరపి మరణం’ కూడా అంతే వాస్తవం. అసలు కంటి తెలివి అనే కన్నా ‘ముక్కంటి తెలివి’ అనడం సబబు. జననంకి బ్రహ్మ, మరణంకి శివుడు, ప్రయాణం కి విష్ణువు – ఈ మూడు నేత్రాల తెలివే ఇదంతా. అదేమిటో...ఈ భూమ్మీద రోజుకొక్కరైనా పుడుతుంటారు, రోజుకొక్కరైనా పోతూ ఉంటారు. మనకి తెలిసి రోజుకొకరు చొప్పున ముగ్గురు మగవారు ...అచ్చం త్రిమూర్తుల్లా ‘విడిపోదాం రండి..ఈ భూమి నుంచి’, ‘కలిసుందాం రా ... ఆ దివి సీమలో’ అని ఒకరికొకరు చెప్పుకున్నారో లేదో కాని అలా నిర్ణయించుకున్నట్టే ఒకరి వెంట ఒకరు కదిలి వెళ్ళిపోవడం ఒక అరుదైన సంఘటన.
ఏ ఒక్క మూర్తికీ ఇతర మూర్తితో సంబంధం లేదు. కానీ వారు ముగ్గురూ ముమ్మూర్తులా వారి వారి పరిధిలో మూర్తీభవించిన మేధావులు. ఒకరేమో నిశ్చల చిత్రాలు తీయడంలోనే కాదు, చిత్రాలు తీసి ప్రాణాలు పోసేటంత నేర్పరితనం కలిగి ఉన్నవారు. ఒకరు కర్నాటక శాస్త్రీయ సంగీతంలో మహామహోపాధ్యాయులు. ఎన్నో సంగీత కళాశాలలకి ‘ప్రిన్సిపాల్’ అయినా అందరిని సమానంగా చూడడం, అందరితోనూ కలిసిపోవడం అనే తన ప్రిన్సిపుల్ తప్పని వారు. సంగీతానికి ప్రాణవాయువు ఎక్కించిన వారు. ఒకరు ముక్కుకింద వేలు రాసుకుంటూ రెండు మామూలు కళ్ళతో కర్కశాన్ని, కావాలనుకుంటే కన్నీటిని ఒలికించే ప్రజ్ఞ కల విలక్షణ నటుడు, దుష్ట పదం అనుకుంటే విలనీయుడు లేదా కన్నీటి కొలనీయుడు, నిజ జీవితంలో కష్టజీవిని చూసి చలించడమే తప్ప దుష్టత్వం ఎరుగని వారు. మొదటి ఇద్దరూ దక్షిణాన పుట్టి కళా దక్షత ఉన్న ధీశాలులై ఎదిగితే చివరాయన ఉత్తరాన పుట్టి ఉత్తమ నట దురంధరుడుగా ఎదిగిన వారు. మొదటాయన పేరు శివుడికి మారు పేరు. నాగభూషణం! రెండవ ఆయన పేరులో విష్ణు శబ్దం ఉంది. చిన్నదైనా మంచి నిజం దాగి ఉంది. చిన సత్య నారాయణ! మూడవ ఆయన పేరంటేనే బ్రహ్మ...బొమ్మను చేసి ప్రాణం పోసే పనితనం తెలిసిన బ్రహ్మ! ‘ప్రాణ్’! నాగభూషణం గారి నిశ్చల చిత్రాలు చూసి నందమూరి తారక రాముడు నిశ్చేత్తుడయ్యేవారట. తెలుగు వారికి తెలిసి చలన చిత్ర రంగంలో ఒక నాగభూషణం అంటే ‘నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు’ అనే ‘రక్త కన్నీర్’ నట భూషణం - నాగభూషణం, ఇంకొక నాగభూషణం కడారు వారు, నిర్మాత, నటీమణి కన్నాంబ భర్త. మరి ఈ మూడో నాగభూషణం ఎవరో? ఆ ప్రశ్న రాకూడదనే ఆయన ‘భూషణ్’ గా మారారు. చిత్రకారుడైన బాపు తను గీసిన చిత్రాల్లో ఉన్న భావాన్నే తను తీసిన చిత్రాల్లో నటీనటుల్లో వ్యక్తం చేస్తున్నారో లేదో అద్దం పట్టి చూపించ గలిగేవి భూషణ్ గారి నిశ్చల చిత్రాలు. ఇలా దక్షిణ చలన చిత్ర నటీనటుల అందచందాలు, భావ ప్రకటనల ప్రొమోషన్ కోసం నడుం కట్టుకున్న ‘స్టిల్ ఫోటో గ్రాఫర్’. తన నడుమునే కాదు మొత్తం మేనునే మొన్న జూలై 10ని (బుధవారం) శాశ్వతంగా వాల్చేశారు. ఆ నిశ్చల మూర్తికి నివాళులర్పిస్తూ కన్నీళ్లు విడవొద్దు- కృతజ్ఞతలు చాటుకుందాం – ఎందుకంటే ఆయన తీసిన నిశ్చల చిత్రాలు మరో పది కాలాలపాటు సిలబస్ లోకి చేరి ముందు తరాల్ని నడిపించాలి కాబట్టి, అవి కన్నీళ్ళతో చెరిగి పోకూడదు కాబట్టి, ఆయనలాంటి అరుదైన వ్యక్తి మన మధ్య తిరగడం మన అదృష్టం కాబట్టి. చిన సత్యనారాయణ గారిని పరిచయం చెయ్యడమంటే అది అభినవ నాద యోగిని అనామక శ్రోత అమాయకంగా చూసినప్పుడే సాధ్యం . ఇందాక చెప్పుకున్న ఆయన భూషణ్ అయితే ఈయన పద్మభూషణ్. భూషణ్ గారంటే - రాత్రి పూట వెన్నెల వెలుగుల్లో వెలుగుతున్న పద్మాన్ని నిశ్చల చిత్రంలో బంధించి పగటి పూట ‘పద్మరాగం’ పేరిట చూపించే మెజీషియన్. చిన సత్యనారాయణ గారంటే- ఎన్నో రాగ పద్మాల్ని సంగీతం కొలను నుంచి జాగర్తగా ఏరి వాటికున్న ఏడు స్వర రేకుల్ని సున్నితంగా నిమిరి – ఇదిగో ఇలా చేసి మేళకర్తల పూల సొగసుని, పరీమళాన్నికాపాడడం, వాటి గుణగణాలు శృతి –లయ బద్ధంగా పాడడం నేర్చుకోండి అని చెప్పే మ్యూజీషియన్. ‘పాతిక అవార్డులున్నాయని చెప్పండి’ అని ఎంతమంది సభల్లో కేకలు వేసినా ‘నూకల వారు’ అనే ఆర్భాటం లేని పేరుతో పిలవగానే ఆయన ముఖారవిందంలో ఏదో తెలియని అందం, ఆనందం! ఆయనింటి పేరు నూకల వారు. తగినట్టు- నిత్య భోజనంగా ఉండటానికి శాస్త్రీయ సంగీతం అనే మెనూ కల వారు. అందుకే భోజనానంతరం తాంబూలం నమిలేసినంత తొందరగా, తృప్తిగా రెండు వందల యాభై రాగాలకి రెండు వందల యాభై సెకండ్లలో వివరణలు ఇవ్వగల సమర్ధత, పదునూ కలవారు. పురందరదాసు, అన్నమాచార్య, త్యాగయ్య, క్షేత్రయ్య ...ఇలా ఎందఱో వాగ్గేయకారుల ఆత్మల్లో పరకాయ ప్రవేశం చేసి చేసి ఇప్పుడలసి పోయి తన చిన నారాయణ రూపాన్ని ఆ పెను నటరాజులో అనాయాసంగా, సునాయాసంగా లీనం చేసుకున్న ధన్య జీవి నూకల వారు. అనకాపల్లి లో జననం ...అనేక ప్రాంతాల్లో పయనం .... హైదరా బాదులో తుది శయనం – ఇదీ నూకల చిన సత్యనారాయణ తెలివిగా తెలుసుకున్న ముక్కంటి వైనం. అ- అంటే అనకాపల్లి, హ- అంటే హయిదరాబాదు అని పాడుకుంటే అ- నుంచి హ- వరకు ఉన్న తెలుగు అక్షరాలన్నీ గుర్తింపు పొందినట్టే. అంతకన్నా గొప్ప గుర్తింపు- ఈ తెలుగువాడు భారతీయుడు గా ఎదగటం! అదీ శాస్త్రీయ సంగీతానికున్న శక్తి! ఘంటసాల వారు విజయనగర ‘ద్వారం’ నేర్పిన విద్యని సినీ సీమ వైపు తరలించి మూడు దశాబ్దాల కర్నాటక,హిందుస్తానీ మేలు కలయికల (లలిత ) సంగీత తోరణ రక్షణకి పూనుకుంటే నూకల వారు అదే ‘ద్వారం’ నుంచి వెలుపలి కొచ్చి యావజ్జీవితం వెల కట్టలేని కర్నాటక సంగీత సేవకి తన జీవిత కాలం వెచ్చించారు. నూకల వారి తొలి గురువు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి తండ్రి గారైన పట్టాభిరామయ్య గారు. బాలమురళీకృష్ణ వంటి సంగీత మేధావి చిన సత్యనారాయణ వంటి సంగీత మేధావికి గండపెండేరం తొడగటం గర్వించదగ్గ విషయం. చిత్రమేమిటంటే – ‘పవిత్ర హృదయాలు’ అనే చిత్రంలో ఘంటసాల గారు కొన్ని పాటలు పాడితే , బాలమురళీకృష్ణ, నూకల చిన సత్యనారాయణల ముచ్చటైన, మేలైన కలయిక ఒక పాట వల్ల జరిగింది. రెండు ముక్కలుగా ఒకే మేరు పర్వతం ‘కరుణామయీ శారదా’ అని పోటీ పడి పాడితే అక్కడ గెలుపూ ఉండదు, ఓటమీ ఉండదు. ఆ పాట విన్నవారు ఎవరు ‘బాల’, ఎవరు ‘చిన’ అని ఎప్పుడూ చూడలేదు. కవి కాళీదాసు అన్నట్టు సంగీత సాహిత్యాలనేవి సరస్వతీ మాత అందించే చనుబాలు కాబట్టి ఆమెకి అంతా ‘చిన బాల’ పుత్రులే. నూకలవారు కళామతల్లి ఒడిలో కాసేపు ఒదిగి తనకు తానే లాలి పాడుకునీ శాశ్వతంగా నిద్ర పోయారు, మొన్ననే గురువారం నాడు (జూలై 11). (గురువారం శివసాయుజ్యం పొందిన ఈయన సంగీత సేవని తలచుకుంటూ ఈయన స్తుతించిన బృహస్పతి విశేషాన్ని కనులు మూసినా పాటే – అనుకొంటూ విందాం). ఎందరికో అనగనగా రాజు కథలోని రాజు గారికి మల్లే ఏడుగురు సంతానం ఉండొచ్చు. కాని ఒక సంగీత సామ్రాట్టుకి ఏడుగురు పిల్లలు అంటే అబ్బో- ఏడు స్వరాలకి ప్రతీకలు అని అనిపిస్తుంది. అదే నూకల వారింటా కనిపిస్తుంది. ఇప్పుడు వారి ఇద్దరు మనవలు ‘తాతగారిది సంపూర్ణ సంగీత సేవ - మనవల్ల సులభ సాధ్యం కావాలి సంక్లిష్ట త్రోవ’ అనే నినాదానికి కట్టుబడి ఉన్నారు, సంతోషం. కనులు మూసినా పాటే – నూకల చిన సత్యనారాయణ అనే నిలువుటద్దానికి ఒక చిన్న ఆడియో పూత. (ఈ రోజే తెలిసింది .....ఆధునిక .ఆడియో శిల్పి బోసు మరణవార్త. బోసు అణువణువులో సంగీత కణాలు కలబోసుకుని ఉండక పోవొచ్చు కాని ప్రతి శబ్దంలోనూ ఉండే పొందికను వెలికి తీయడంలో యంత్రాలు సాయ పడాలనే ఆకాంక్ష ఆయనిది. ప్రతి సంగీత కళాకారుడు ఆయనికి ఋణపడి ఉంటాడు. ఇప్పుడు నూకలవారు బోసుగారితో రోజూ కరచాలనం చేస్తారు.) ప్రాణ్... పోసేదే కాని తీసేది కాదు ఆ పేరు. సినిమాల్లో ప్రాణ్ పాత్ర ప్రాణాలు తీసి ఉండొచ్చు కాని నిజ జీవితంలో ఆ పేరు చెప్పుకోగానే ఎందరికో ప్రాణం లేచొచ్చింది. కపిల్ దేవ్ కొకసారి విదేశాలకి వెళ్లి చికిత్స చేసుకోవాల్సి వస్తే తొలి ఆపన్న హస్తం అందించింది ‘ప్రాణ్’! ఎవరైనా విలపిస్తే ఈయన విలవిల్లాడి పోయేవాడు. నటనలో అంత క్రూరత్వం చూపిస్తూ మనిషిలో అంత సాధుత్వం నిలుపు కోవడం చూస్తుంటే ‘బ్లాక్ అండ్ వైట్’ అనే భ్రమయేరా జీవితం అనే నిజానికి ప్రతీక ఈయన అని తెలుస్తుంది. అలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు భారత్ లోకి అడుగు పెట్టే రోజు కోసం రోజూ కలవరించి మూకీలతో నిశ్శబ్దంగా చలించిన తొలి వైతాళికుడు దాదా సాహెబ్ ఫాల్కే అయితే ఆయన పేరిట వచ్చిన అవార్డును ఆలస్యంగా ఈయనికి ప్రకటించడం కూడా బ్లాక్ డార్క్ నెస్ లో వైట్ బ్యాక్ గ్రౌండ్ లాంటిది. నల్ల మబ్బుని ఆనుకున్న తెల్ల అంచు లాంటిది. ‘పోలీసు వొస్తాడు’ అని పాత పాట పాడకుండా ఈయన పేరు చెబితే చాలు చిన్న పిల్లలు గొడవ చెయ్యకుండా అమ్మ పెట్టిన అన్నం తినేసే వారు. ఆ పిల్లలే ఈ రోజు ఆయన మరణ వార్త విని ‘మా అమ్మని మన్నించు తాతా..’ అని అంటారు. షూటింగ్ సమయంలో ప్రజా వాహిని కారణంగా ఇబ్బంది కలుగుతుంటే నిర్మాత ‘ప్రాణ్’ వైపు తిరిగి ‘ఎలా మరి?’ అన్నట్టు చూస్తే సినిమాల్లోలా ప్రాణ్ తన గొంతులో రౌద్రం చూపించి కసిరితే గుమికూడిన వారంతా జడుసుకుని అలా నిలబడిపోయే వారట. షూటింగ్ అయిపోగానే ‘ప్రాణ్’ అందరి ఎదుటా నిలబడి క్షమించమనేవారు. అంతటి ఉదాత్త మూర్తి ఆయన. షూటింగ్ అనుకొనే టైము కన్నా ముందే వచ్చేసే వాడట ఆయన. అంతటి సీనియర్ లోని ఆ క్రమ బద్ధతకి జూనియర్లు సిగ్గు పడే వారట. ముందే వచ్చి పాత్రని జాగర్తగా స్టడీ చేసి నటిస్తే నిర్మాతకే లాభం అనే ఆర్ధిక సూత్రం ఆయనిది. జంజీర్ సినిమాలో ఇన్స్పెక్టర్ పాత్రకి అమితాభ్ బెస్ట్ అని రికమెండ్ చేసింది ఈయనే. ఆ చిత్రంతో అమితాభ్ పేరు నిలబెట్టుకుని అమిత వెల్గును సంపాయించుకున్నారు. స్నేహ బంధం అనేది నడమంత్రపు సిరి కాదు, దైవ నిర్ణయం అని గుర్తించడానికి ‘ప్రాణ్’ నటించి ప్రాణం పోసిన షేర్ ఖాన్ పాత్ర అవసరమౌతుంది. చట్టం సంకెళ్ళు (జంజీర్) వేయబోతే దాన్ని ప్రేమ పాశంగా మార్చుకోవడం ఎలాగో ప్రాణ్ చెప్పగలరు తన పాత్ర పోషణతో. అసలు ఆయనకి మన భూషణ్ గారి లాగనే ఫోటోగ్రఫీ పైన మక్కువుండేది. అదే వృత్తి కావాలనుకుంటే ‘రాం లీల’ లో సీతగా నటించడం కుదిరింది. ఆ తరువాత ఒక రచయిత ఈయనలో ఎక్కడో ఉన్న నటనా స్పార్క్ ని గమనించి దానికో సంభాషణా భాస్వరాన్ని తగిలిస్తే అది వెండి తెరపైన మరిన్ని వెలుగులు వెదజిమ్మింది. ఇంక నాలుగు దశాబ్దాల పాటు ఒక ‘విలన్’ పాత్ర ధారి ఎక్కువ పారితోషికం తీసుకునే వాడిగా చరిత్ర సృషించాడు ‘ప్రాణ్’! హిందీలో అంటారు- ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే – అని. ఇప్పుడు అదే నిజం. ప్ర్రాణ్ ఈ జూలై 12 న వెళ్ళిపోయినా ఆయన ‘మాట’ వెండి తెర పైన ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. రోజుకో సినిమా చూస్తే యిట్టే ఒక సంవత్సర కాలం గడిచి పోతుంది అన్నట్టు దాదాపు మూడు వందల అరవై పై చిలుకు చిత్రాల్లో ఆయన నటించాడు. ప్రాణ్ నటనని హిందీలో చూసి ‘కేక’రా అని అనుకుంటే కైకాల సత్యనారాయణ తెలుగులో అలా కనిపించి కెవ్వుకేక అనిపించారు. ‘కస్మే వాదే ప్యార్ వఫా’ (చిత్రం: ఉప్ కార్) అనే తత్త్వం మన్నాడే పాడినా ప్రాణ్ పాడినంత గొప్పగా నటించారు ప్రాణ్. అలా మన ‘సత్తినాణ’ బాలు పాడుతున్న ‘యాతమేసి తోడినా యేరు ఎండదు’ (చిత్రం: ప్రాణం ఖరీదు – హిందీ ఉప్ కార్ కి నకలు కాదు ) అచ్చం తను పాడుతున్నట్టే భ్రమ కలిగించారు. ‘యారీ హై మాన్ మేరా యార్ హై జిందగీ’ (చిత్రం: జంజీర్) అని మళ్ళీ అదే మన్నాడే ప్రాణ్ కి పాడితే, బాలు అదే పాటని సత్తినాణ కోసం ‘స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం’ ( చిత్రం: నిప్పులాంటి మనిషి) అంటూ ముందుకొచ్చారు. సాధారణంగా హీరో పాత్రలకే తప్ప సహ పాత్రలకి పాటలు ఉండవు. అలాంటిది ‘ప్ర్రాణ్’ నటన వల్ల సహ పాత్రలకి పాటలొచ్చాయి. అలాగే మన సత్తినాణ గారి పాత్రలకీ పాటలొచ్చాయి. కాబట్టే సత్తినాణ గారు ‘కొదమ సింహం’ సినిమా తీసి తన ఇష్టంగా ఒక పాత్ర సృష్టించి దానికి ‘ప్ర్రాణ్’ ప్రతిష్ట చేయించారు. అంతకు ముందు కృష్ణంరాజు గారు ‘తాండ్ర పాపారాయుడు’ లో బుస్సీ దొర పాత్రకి ‘ప్రాణ్’ పోసేది ప్రాణే అని తీర్మానించారు. లాంగ్ ప్లే రికార్డ్స్ పైన చక్కగా హీరో, హీరోయిన్ల చిత్రాలే ముద్రించటం అంటూ ఉండేది. 'తుమ్ స న దేఖా' చిత్రం రికార్డ్ కవర్ పైన షమ్మీ కపూర్ బొమ్మ ఉంటే వెనక ప్రాణ్ బొమ్మ ఉండటం ఒక అరుదైన, సబబైన గౌరవం! (చూడండి- ఆల్ బొమ్మలే) హాఫ్ టికెట్, విక్టోరియా నంబర్ 203, కసౌటీ వంటి చిత్రాల్లో ప్రాణ్ లోని హాస్య ప్రియత్వం కన్పిస్తుంది. ఈ విక్టోరియా సినిమాలో ప్రాణ్ ప్రాణ మిత్రుడు అశోక్ కుమార్ నటించారు. అసలు అశోక్ కుమార్ తో ఈయన ఇరవై మూడుకి పైగా చిత్రాల్లో నటించి ఉంటారేమో. ఆ విక్టోరియా చిత్రానికి నకలు తెలుగులో ‘అందరూ దొంగలే’ (పాపం ..ఆ చిత్రాన్ని రీ మెక్ చేస్తూ అందరూ దొంగలే అని పేరు పెట్టడం నిజంగా ఆ నిర్మాతల సౌశీల్యత అనవచ్చు. ఈ రోజుల్లో చెప్పా పెట్టకుండా కథలు, పాటలు, సన్నివేశాలు అన్నీ కాపీలు చేసే వారు అందరూ దొంగలే). అప్పట్లో హిందీ ప్రాణ్ పాత్రకి తెలుగులో నాగభూషణం సరిపోయేవారు. ఈ రోజు ఇంకో రూపంలో నాగభూషణం అనే పేరుని తలచుకుంటున్నాం. (కనులు చూసినా పాటే- ఎవరి పాటా? ఎవరి ఆటా? ప్రాణ్ దన్న మాట!) భూషణ్, చిన సత్యనారాయణ, ప్రాణ్ – ఈ ముగ్గురి పేర్ల చివర ‘ణ’ కారముంది. ఒకరి వెంట ఒకరు తరలి పోవడం వెనుక ఏం కారణం ఉందో? వీరంతా వీడ్కోలు పుచ్చుకున్న సమయానికి వరసగా 85,90, 93 సంవత్సరాల వయసు వారు కావడం వల్ల ఉన్నవారంతా వారి ముందు చిన్న వారే అయి చేతులెత్తి నమస్కరించి స్వర్గ సీమలో వారి ఆత్మలు ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నవారే. ఎందరో ఉంటారు – కొందరే పేరు నిలబెట్టుకుంటారు. ఏ పేరుతో ఎవరికెపుడు పని ఉందో (కృష్ణశాస్త్రి గారన్నట్టు) ఎరిగినదొకరే ఒకరు- తెర వెనుక దాగి దొరకరు! -డా. తాతిరాజు వేణుగోపాల్ , 14 జూలై 2013 (ఆదివారం )
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|