మునుపటి నా మాట
ఇలా పలుకు పలుకులో ‘లే’ అక్షరం చేరి తెలుగు భాషకే ఒక అందం వచ్చింది. తెలుగువీర ‘లే’వరా ...అంటే ఇదేనేమో. ‘లే’ వరించిన తెలుగు వాడా అని సంబోధించడం. ఇప్పుడన్న మాటలు ఏవి కూడా లకారంతో ముగియలేదు. అయినా ‘లే’ ఒకటి వాటి చివర్లో చేరగానే ఆ మాటలకే ఒక కొత్త అందమొచ్చింది. లకారంతో ముగిసే స్త్రీ మూర్తులు ఇద్దరున్నారు. ఒకరు ఇల్లాలు. ఏక వచనం. మరొకరు కోడలు ఏక వచనం. ‘ల’ కొమ్మున్న నామవాచకాలివి. వీటికి ఏత్వం చేరి రెండు జాతీయాలు ఏర్పడ్డాయి. అత్తా ఒకింటి కోడలే, ఇంటికి దీపం ఇల్లాలే, ఇవే తరువాత సినిమా పేర్లయిపోయాయి. వీరు సరే. పురుష, స్త్రీ భేదం లేని వారున్నారు. దొంగలు. ఈ బహువచనానికి ఏత్వం చేరిస్తే చెప్పుకోదగ్గ దారుణమైన తీర్మానం - అందరూ దొంగలే. ఒక్క ‘లే’ చాలదని మరొక ‘లే’ గనక చేర్చామా - అత్తా ఒకింటి కోడలేలే, ఇంటికి దీపం ఇల్లాలేలే – అన్నప్పుడు ఎక్కడో వ్యంగ్య బాణం విసిరినట్టనిపించదూ? ‘అందరూ దొంగలేలే’ అంటే ‘ఏం చేస్తాం మన తలరాత అలా తగలడిందిలే’ అనే నిస్పృహ గోచరించదూ?
లకారాంత నామవాచకం (ఏక వచనం కావొచ్చు, బహువచనం కావొచ్చు) మీద ఏత్వం ప్రయోగిస్తే వ్యంగ్య బాణం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ జానపదం చదివితే తెలుస్తుంది- ‘వెండి పుల్ల వెండి ఆకు విడిదికి పంపితిమి - పారపళ్ళ వియ్యపురాలు పళ్ళే తోమదుగా’ ‘సన్నజాజులు మల్లెమొగ్గలు విడిదికి పంపితిమి- బట్టతల వియ్యపురాలు పూలే ముడవదుగా’ ‘నీ కనులు కలువ రేకులు’ అని ఒకరంటే, ‘నీ కనులు కలువరేకులే’ అని ఇంకొకరంటారు. ఏత్వం వల్ల కలువ రేకులు తప్ప మరొకటి కాలేవు అనే అర్ధం వచ్చింది. ఇక్కడ ఏత్వం సహకరించగానే ఉపమానం ఉన్నతమైంది తప్ప వ్యంగ్యానికి ఆస్కారం రాలేదు. కాలచక్రాన్ని కాస్త వెనక్కి తిప్పి చూద్దాం- చిలకమర్తి వారు ‘హేయంబైన చోడంబలే పరమాన్నంబగు’ అన్నారు. 'చోడంబలియే'కి రూపాంతరమే ‘చోడంబలే’. అంబలి సైతం పరమాన్నం కాగలదు అనే భరోసా ఉందక్కడ. సుందరాచార్యుల వారి ‘మా తెలుగు తల్లికి’ గీతం తీసుకుందాం. అందులో ‘గల గలా గోదారి కదిలిపోతుంటేను /బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను/ బంగారు పంటలే పండుతాయి/మురిపాల ముత్యాలు దొరలుతాయి’ అని ఒక చరణం ఉంది. బహువచన పంటకి ‘బంగారు’ విశేషణం చేర్చారు. బంగారం ఎవరికి మాత్రం ఇష్టం కాదు? కాబట్టి పండితే బంగారు పంటలే పండాలన్నమాట. పంటలు మీద ఏత్వం రాగానే భరోసా ఎంత గొప్పగా పెరిగిందీ! అలాగని మురిపాలని విలువైన ముత్యాలతో పోల్చినప్పుడు ‘మురిపాల ముత్యాలే’ అని అనలేదు కవి. ఇక్కడ మురిపాలు నిజం కావొచ్చు, కాని ముత్యాల అందుబాటు మన చేతుల్లో లేదే- పైగా ‘పంటలు’ లాగ ముత్యాలు అంత పెద్ద నిత్యావసరమేమీ కాదు కూడా. సంగీత పరంగా చూస్తే ఏత్వం వల్ల ఒక మాత్ర ఎక్కువౌతుంది. కాని కవి సంగీత పరంగా రాయలేదు. ఇప్పటికీ రాగాలు మార్చినా ఈ గీతంలో ఉన్నచోట ఉండే ఏత్వం పోలేదు, లేని చోట కొత్తగా ఏత్వం రాలేదు. అంటే కవి భావానికి ఎంత గౌరవం దక్కిందో చూడండి. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ అనే శ్రీకృష్ణ గీతంలో ‘కల్లోల గౌతమీ వెల్లువలా కృష్ణమ్మతుంగ భద్రా తల్లి పొంగి పొరలిన చాలు ధాన్య రాశులే పండు దేశాన’ అని ఉంది. నిజానికి నది నీరు ఉప్పెన ఐతే పంటకి చెరుపే. అదే సుందరాచార్యులు ఆశించినట్టు గల గల , బిర బిర మంటూ నదులు పారినప్పుడే బంగారు పంటలు సాధ్యం. వీరు ‘పంటలే’ అన్నట్టు శ్రీకృష్ణ ‘ధాన్య రాశులే’ అని ఏత్వమివ్వడం విశేషం. రాయప్రోలు సుబ్బారావు పండితుల గీతం ‘ఏ దేశమేగినా ఎందు కాలిడిన /ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన /పొగడరా నీ తల్లి భూమి భారతిని/ నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ తీసుకుందాం. ఇందులో ‘సూర్యుని వెలుతురులే సోకునందాక .....ఈ యనంత భూతలిని మన భూమి వంటి చల్లని భూమి లేదు’ అని ఒక పాదముంది. ఇక్కడ చల్లని అంటే చల్లదనం కాదు, అన్నీ ‘చక్కగా అమరిన’ అని అర్ధం. భూమ్మీద అంతటా ప్రసరిస్తున్నవి అవే సూర్య కిరణాలైనా ఈ భారత భూమి పైన మాత్రం అవి చక్కగా అమరాయి. ‘వెలుతురులే’ అని అనగానే ఒక్కసారి మనం ఆలోచిస్తాం. వాటి మీద మనకి భరోసా ఉంది. కవి వాక్కిది. బహువచనం వెలుతురులు మీద వేసిన ఏత్వం సంగీతం కోసం ఒక మాత్ర ఎక్కువ అవసరమై వేసింది కాదు ఇక్కడ. కాస్త ఏమిటీ బాగా కాలచక్రాన్ని వెనక్కి మళ్లిస్తే మనకి అన్నమయ్య అనే పదసంకీర్తనాచార్యులు ఒకరుండే వారన్న ధైర్యంతో పాటు మంచి తెలుగుపట్ల ఆశ కూడా కలుగుతుంది. ఎటొచ్చీ ఈయన అతి తక్కువగా ‘లే’ ప్రయోగం చెయ్యడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మహానుభావుడంటాడు ‘తొల్లింటి వల్లె (గావు తుమ్మెదా ఇంక - వొల్లవుగా మమ్మునో తుమ్మెదా’ అనే జానపద శైలిలో నుడివిన సంకీర్తనలో - తోరంపు రచనల తుమ్మెదా కడు – దూరేవు గొందులే తుమ్మెదా ; తొలిప్రాయపు మిండ తుమ్మెదా కడు – తొలిచేవు చే(గలే తుమ్మెదా ...అని. ఇది కాస్త కొత్తగా ఉన్నా అందరి నోటా బాగా నానిన ‘మూసిన ముత్యాన కేలే మొరగులు? ఆశల చిత్తానకేలే అలవోకలు?’ సంకీర్తన తీసుకుంటే ఎన్నెన్ని ‘లే’లో! మోముకేలే, కొప్పునకేలే, మందయానమునకేలే, గంధమేలే, చూపులకేలే, బుజాలకేలే, గోళ్ళకేలే, మాటలకేలే, చెక్కులకేలే, కూటమికేలే – ఇవీ ఆ సంకీర్తనలో కనిపించే ‘లే’లు. ఏలనే? అని ప్రశ్నిచక ‘ఏలే?’ అని కుదించిన అన్నమయ్య వ్యావహారిక దక్షతకి జోహారు. సినీ యుగానికి వస్తే - మహాకవి శ్రీశ్రీ ఒక సినీ గీతంలో అన్నారు- శ్రమజీవుల వ్యవసాయంతో సోమరులే బలిసే లోకం’అని. ఇక్కడ సోమరులు మీద ఏత్వం వల్ల పచ్చి నిజం ఇదే సుమా అనే నిర్ధారణ కనిపిస్తుంది. మరో గీతంలో ఈయన ‘కార్మిక జాతి ఆశాజ్యోతి ఆకాశాలే నిండగా’ అని అన్నారు. ఆకాశాలు మీద ఏత్వం చేర్చగానే ఆశాజ్యోతి ఎంత విస్తరించేదో తెలిసి పోయి అప్రయత్నంగానే మన ఆలోచనా పరిధి ఆకాశం దాటిపోతుంది. కవి ఆకాశాల ద్వారా ఒక భరోసా ఇవ్వదలిచాడు కాబట్టి ఈ ఏత్వం ఇక్కడ ఎంతో సమంజసం. సముద్రాల కవివర్యులు మహాత్మా గాంధి గురించి చెబుతూ ‘సత్యాహింసలే శాంతి మార్గమని జగతికి జ్యోతిని చూపించాడు’ అని అన్నారు. ఏత్వం లేని సత్యాహింసలు వాడి ఉంటే అవి కేవలం ఒక సూక్తిని చాటేవి. ఏత్వం చేరడం వల్ల శాంతి అన్వేషణలో సత్యం,అహింసల్ని మించినవి లేవనే భరోసా కలుగుతోంది. వేటూరి వారు ‘అడవిన పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు’ అని చెప్పడంలో ‘కథలే’ అన్న ఏత్వంతో ఒక భరోసా అందింది సమాజంలో వెనకబడిన వారికి. ‘చిన్న చిన్న చినుకులే మహా ప్రళయమై గర్జిస్తాయని చాటించే ప్రజలే సర్కారు’ అని ప్రకటించిన ఒక కవి చినుకులే,ప్రజలే అని ఏత్వం అందివ్వడంతో చినుకులైనా, ప్రజలైనా వేటినీ తక్కువగా అంచనా వెయ్యొద్దని హెచ్చరిక చేసినట్టే అయ్యింది. ‘ఆంధ్ర భూమి మనదే. తెలంగాణా కూడా మనదేలే’ అని ఎవరైనా అన్నారనుకుందాం. ఇక్కడ ఒక్క ‘లే’ అనేది అదనంగా పడగానే ‘ఏదో మనందరిది కాకుండా పోతోంది’ అని దిగులు పడుతున్న వారిని ఊరడిస్తూ భరోసా ఇస్తున్నట్టయింది. ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’ అని ఎంతో హుందాగా నాటి పల్లవి పాడడం వేరు, చివర్లో వినిపించే ‘మనదే మనదే మనదేరా’ అన్న అప్పటి మాటల్లో ‘రా’ను సవరించి ‘లే’ చేర్చి పాడితే ‘మనదే మనదే మనదేలే’ అయి ఎంత దృఢమైన భరోసా నిస్తుందీ! మహాకవి భరోసా ఇచ్చినట్టు ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా ...’. నామవాచక,క్రియా పదాల కలగలుపులోనూ ‘లే’ని చక్కగా ప్రయోగించిన సినీ కవులెందరో ఉన్నారు. ‘ప్రశ్న: ఎవరే పిలిచే రల్లన మెల్లన పిల్లన గ్రోవిని ప్రియా ప్రియా జవాబు: పొదలో కదలే వెదురు గోలలే గాలి ఈలలే ప్రియా ప్రియా ‘(కృష్ణశాస్త్రి –మల్లీశ్వరి) ‘ఉన్నదిలే దాగున్నదిలే నీ కన్నుల ఏదో ఉన్నదిలే అది నన్నే కోరుకున్నదిలే’ (సి నా రె –రహస్యం) ‘అది ఒక ఇదిలే అతనికి తగులే /సరికొత్త సరసాలు సరదాలు చవి చూపెలే/అహ..ఎనలేని సుఖమెల్ల తనతోటి దనిపించెలే’ (ఆత్రేయ - ప్రేమించి చూడు) ‘నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పూవు లేక తావి నిలువ లేదులే లేదులే .. తావి లేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే... నేను లేని నీవు లేనే లేవులే.. లేవులే.’.( దాశరథి - మంచి మనసులు) గమనిస్తే ఈ పాటల్లో ‘లే’ అన్నది పల్లవులు, అనుపల్లవుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంక చరణాల్లో ఎన్ని ‘లే’లుంటాయో! ‘మావుల తోపుల మూపుల పైన మసలే గాలుల గుసగుసలో’ వినిపించేది తెనుగు పాటే (కృష్ణశాస్త్రి –అమెరికా అమ్మాయి) పండిత నెహ్రూ ‘రణదాహంతో రగిలే జగతిని శాంతి సుధలు కురిపించాడు’( సి.నా.రె. –విచిత్ర దాంపత్యం) ‘...మమతలు సెగలై లోలో రగులునులే’ ‘నిష్ఠుర వేదన తప్పదులే’ ‘పోనీలే ..ఇంతేలే...గూడు గుబులై పోయేలే’ (కృష్ణశాస్త్రి - మాయని మమత) లలితగీతం ‘పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు’ అనగానే అది కృష్ణశాస్త్రి కవి రచన అని అప్పుడే పుట్టిన తెలుగు పాప సైతం చెబుతుంది. అందులో చివరి చరణంలో ‘మాల లల్లు టెపుడే? నవ- మంజరు లల్లే దెపుడే? ఇక- పూలే పోయాలి తలబ్రా లల్లే స్వామి పైన!’ అని అంటారు ఆయన. అల్లు, అల్లే – ల మధ్య ‘త్వర’ పడమని చెబుతున్న ఆదేశమే ఉంది. అయితే... పల్లవిలోనో, అనుపల్లవి లోనో, చరణంలోనో ఎక్కడో ఒక చోట అని కాక పాట అంతటా ‘లే’ ని ప్రయోగించడం ఆషామాషీ కాదు. కాని పింగళి నాగేంద్ర రావు వంటి కవికి ఇటువంటి తమాషా భాషా ప్రయోగాలు చేయడం ఏమంత కష్టతరం కాదు. విజయా సంస్థకే కాదు, ఇతర సంస్థల సినిమాలకి రాసినప్పుడూ ఆయన తన ‘లే’ చతురతని బలేగా చూపించుకున్నారు. ఇది నిజం. అదంతేలే.. సరేలే...ఉదాహరణలు వింటే మీరే ఔనంటారులే. ముందుగా చెప్పాలంటే - రెండు ‘కథ’ల సినిమాల్లో, రెండు మకారాల పల్లవుల పాటల్లో వినిపించారులే- జగదేకవీరుని కథ (1961) – మనోహరముగా మధుర మధురముగా మనసులు కలిసెనులే (యుగళం) గుండమ్మ కథ (1962) – మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే (ఏక గళం) మిస్సమ్మ(1955) – అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ..ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే (ఏక గళం) మిస్సమ్మ(1955) – కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే (ఏక గళం) మాయాబజార్ (1957) – చూపులు కలసిన శుభవేళ ...అందమె నీలో చిందెనులే (యుగళం) శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) – అన్నీ మంచి శకునములే /కోరిక తీరే దీవెనలే (యుగళం) ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968) – నీ లీల లోనే ఒక హాయిలే నీ ప్రేమ లాలన లోనే ఒక మాయలే (యుగళం) (కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే, కనులు చదివినా పాటే) ‘నీ లీల లోనే ఒక మాయలే’ పాటలోని గమ్మత్తు ఏమిటంటే – వెనకటికి అన్నమయ్య ‘ఏలనే?’ కి బదులు ‘యేలే?’ అని ప్రయోగిస్తే పింగళి వారు ‘ఏల?’అనే ప్రశ్నకి అదనంగా ‘లే’ చేర్చి ‘ఏలలే?’ అనే విచిత్ర పలుకుబడిని సృష్టించడం!. లాకేత్తమిస్తే ‘లే’ అంటూ ఇంత దూరం వచ్చేశాం. ఒక్కసారి ల-గుణింతంలో మరి కొన్ని – లి,లు,లె - ఇవి పాట మొత్తం ప్రతి పంక్తి చివరా వినిపించేలా ఎవరైనా రాశారా? అని అడుగుదాం. అదిగో ఆత్రేయ,ఆరుద్ర చేతులెత్తారు. ‘లి’ ...కదా మీకు కావాలి ...అందుకు క్రియా పదాలు వాడాలి. అయితే ఒక చిన్న సవరణ- పాటకి ముందు వచ్చే సాకి మరచి పోవాలి. పాట - కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి (సుమంగళి) – అని అంటూనే 'ల‘కి ఏత్వం కాక ఎత్వం మాత్రమె ఇస్తేనో? అంటే- ‘లె’ అని హ్రస్వంగా పాట అంతటా కావాలా? అయితే అది ఒక ‘పదం’ తోనే సాధ్యమనవలె! అదే-‘వలె’ అనే పదం ప్రయోగించిన నా ‘పూవు వలె విరబూయ వలె ...నీ నవ్వు వలె వెలుగీయవలె’ (కానిస్టేబులు కూతురు,1963) పాట, బలె బలె- అని అంటున్నారు ఆచార్య ఆత్రేయ. ‘ల’కి కొమ్మిస్తే ‘లు’ కదా. పాటంతటా ‘లు’ ఉండేలా ఎటువంటి ‘లా’ లేదు కాని, ఓస్ అంతేనా...బహువచనం వేస్తే సరి... నా పాట - విరిసీ విరియని కుసుమాలు వెలిగెను వెన్నెల దీపాలు (మంచి రోజులు వస్తాయి,1963) వినండి మరి అని అంటున్నారు ఆరుద్ర గడసరి. (కనులు మూసినా పాటే) ‘బాబూ ...నేను చంద్రబోసుని. వీరంత కాకపోయినా కాస్తో కూస్తో ప్రయోగశీలిని. లాలి అనే అందమైన పదం అంతటా వచ్చేలా పాట రాయాలని ప్రయత్నించి, మొదటి చరణంలో ‘లి’ , రెండవ చరణంలో ‘ల’ అక్షరాలు ప్రతి పంక్తి చివర వచ్చేలా ‘ఢమరుకం’ సినిమా కోసం ఒక పాట రాశాను కదా ....’ ‘నమస్కారం చంద్రబోసు గారూ ...గుర్తుంది. ‘చంద్ర’ అనగానే మాకు పున్నమి గుర్తొస్తుంది. గోపికా పూర్ణిమ పాడిన పాటే కదా మీరు చెబుతున్నదీ. బాగా రాశారండీ పాట. మొదటి చరణంలో ‘బోసి పలుకే’ అన్నారు చూడండీ ..అది మాకు ‘(చంద్ర) బోసు పలుకు లా అనిపించింది. రెండో చరణంలో మీ ‘ల’ కట్టుబాటు కాస్త తడబడింది లెండి. అవునా? ఒక లైనులో అభిషేకంలా అనిపించేరా, మరొక లైనులో నైవేద్యంలా అది ఉందిరా అని అన్నారు. అనిపించేరా అభిషేకంలా , అది ఉందిరా నైవేద్యంలా అని అని ఉండొచ్చుగా? తాళం లో రాదంటారా? లాలి అంటే లాడ్లీ లిరిక్కు అని ఋజువు చేసినందుకు థాంక్యూలు మీకు ... శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ అని అన్నగారు సిరివెన్నెల, విశ్వనాథుని ‘స్వర్ణకమలం’ కోసం పలికితే మళ్ళీ మీరు ‘సిరి మువ్వ కట్టే వేళ మాకు శివపూజ గురుతొచ్చే మరల మరల’ అని అన్నారు, బహుశ: ఢమరుకం అనగానే మీకు విశ్వనాధుడు గురుతొచ్చి ఉండాలి. ఏదైనా సరే... ఆ వెన్నెల బాసు కవీ, ఈ చంద్ర బోసు కవీ ఇంకా ఇంకా మంచి పాటలే రాయాలి. దేవీశ్రీ ప్రసాదు సంగీతం నుంచి ఢమఢమలే కాదు సరిగమలూ పలుకుతాయిలే అన్నట్టు నిరూపించాలి. తెలుగు పాటలో మళ్ళీ తెలుగు రాజ్యమేలాలి. ’ ఇంతలో..... అన్యాయం రా అబ్బాయీ ...నా తొలి చిత్రం ‘చిన్నకోడలు (1952)’ లో నేను పదకొండు పాటలు రాశాను. అందులో ఒక దాంట్లో అంతటా ‘లే’ ఉందిలే. పాట ఎలాగూ దొరకదాయే...కనీసం మా శిష్యుడు, మాకిష్టుడు అయిన వి ఏ కె రంగడు సాధించి పెట్టిన నా పాటల పుస్తకం ‘విన వేడుక’ చూసి, చదివి తెలుసుకోండి.- అని అలిగి వెళ్ళిపోయారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. ‘కడలి పొంగులే నడచిన ముచ్చట /గడిచి బ్రతికిన వారు లేరులే’ అనే మల్లాది వారి పాట ఉంది నిజమే సుమండీ. (కనులు చదివినా పాటే) చిన్నకోడలు సినిమా పేరట. బావుందే- పింగళి వారు కూడా కోడళ్ళ పరంగానే పాడించారు ‘లే’. ఆ( ..అదంతేలే.. ఒక్కోసారి గుర్తుకు రావులే... పోనీలే ..ఇంతేలే... ఇటువంటి పాటలింక తెలుగు వారికి కరువేలే.. అని నిట్టూరుస్తూ ఉంటే పింగళి నాగేంద్రులు చర్రున వీపు చరుస్తూ, ‘‘అయితే ....ఇలా ‘లే’ అంటూ తొలిసారిగా పాటంతటా రాసినది మల్లాది కవి వారులే అని తీర్మానించారన్నమాట ..శుభం.. పాతాళభైరవి (1951) సినిమాలో ఎన్టీ ఆర్ కోటలోకి ప్రవేశించి దాక్కున్నప్పుడు రేలంగి, మాలతి ల మధ్య జరిగే సంభాషణలు గుర్తు చేసుకోండి.. అప్పుడొ చ్చాయి ‘లే’లు...అవునులే...మీకు కావలసినవి పాటలేలే ...సంభాషణలు ఏలలే?’ అన్నట్టనిపించి ఉలిక్కి పడ్డాను. ‘అంతా నా కలేలే ...’అని సముదాయించుకుని మళ్ళీ నిద్ర పోబోయేను. నెలాఖర్న పింగళి వారి కృష్ణ గానం వినిపిస్తేనో? అన్న ఊహ మొదలై ఇహ నిద్దరే లేదు. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 17 ఆగష్ట్ 2013
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|