మునుపటి నా మాట
ఇది శుక్ల పక్షం కాబట్టి చంద్రుడు ‘పెరిగే కాంతుల’ వాడు కదా . అలాంటప్పుడు ఎక్కడమ్మా చందురుడు? అని అదే(వి ప్రశ్న? అవును- గమనిస్తే చంద్రుడు లాంటి ‘చందూర్’ గారు హడావుడిగా నింగి వైపు పయనమైపోయారు కనుక ‘ఇంకెక్కడ చందురుడు మనకి?’ అని జాలి పడతాం. చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే ‘చందూర్’ ‘జగతి’ చుట్టూ తిరిగేరు. ‘జగతి’ ఆయన నడిపిన పత్రిక పేరు. ఎవ్వరైనా సరే ‘చందూర్’ అంటే మేడమ్ మాలతీ చందూర్ గానే ఎరుగుదురు. ఆమె ఆంధ్ర ప్రభ లో ఎన్నేళ్ళు ‘జవాబులు’ శీర్షికన ఎన్నెన్ని విషయాలు చెప్పే వారు! వీటి వెనక ‘మగ చందూర్’ గారి బ్రెయిన్ ఉందిస్మీ అనేవారు ఆ రోజుల్లో ‘చందూర్’ గారి శైలి తెలిసిన వారు. అలా అయితే ఆమె ‘వంటలు’ ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాల్లో ఇంటింటా కర దీపికలే- అవీ ఆయన ‘చేతి’ చలవే అంటే కష్టమే. రావి కొండల రావు గారు జనమంచి రామకృష్ణ గారనే ఆలిండియా రేడియో ఆయన్ని ‘ యన్నార్ చందూర్ అంటే నాగేశ్వర రావా? నరసింహా రావా? ‘ అనడిగితే ‘ ఏమో నయ్యా, నాకూ తెలీదు. నేనూ అడగ లేదు. సరదాగా ‘మగ చందూర్’ అంటాను’ అన్నారట. పేరులో ఏముందని షేక్స్ పియర్ అన్నట్టు ఆయన పేరు ఏమైతేనేం కొంతమంది మిత్రుల మధ్య పేరు పొందిన వారు. ఇక్కడ ఈ క్షణంలో నాగేశ్వర రావు నటించిన 'అర్థాంగి' చిత్రం కోసం నరసింహారావు స్వర పరిస్తే నా చే'జిక్కి'న 'ఎక్కడమ్మా చంద్రుడూ?' పాటను 'కనులు మూసినా పాటే' లో బంధించాను. పాట వింటుంటేఆత్రేయ 'చందూర్' గురించే రాశారా ? అని అనిపించదూ? చెన్నై లో ఉండే కళా కారుల ఆహార్యంలో కొట్టొచ్చేలా కనిపించేది – నల్ల కళ్ళ జోడు. అది చందూర్ వారికీ ఉండేది (see face arts). ఆ రకంగా చందూర్ గారు ఓ నడిచే ‘చల్లని’ గ్రంధాలయం. ఆయనే కర్త, కర్మ, క్రియ అయి చెన్నై నుంచి ‘జగతి’ ని కేవలం అయిదు రూపాయల మాస పత్రిక గా యాభయి నాలుగున్నర సంవత్సరాలుగా నడుపుతూ వచ్చారు. ఇందులో రాజకీయాల బురదలో కూరుకుపోయే ప్రసక్తే ఉండదు. పైగా, సాహిత్యానికి పెద్ద పీటవేసే రాజకీయ వేత్త కనుక ఉంటే అతనిలోని కవితా రసనకి ‘జగతి’ మంచి విందు కూర్చేది. అలా చెప్పాలంటేబెజవాడ గోపాల రెడ్డి వంటి ధీమణి కవిత్వ పటిమకి చందూర్ గారు అద్దిన లేలేత కాంతులు స్ఫటికం లాంటివి. జగతి పత్రిక ఒక రొటీన్ సాంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. ఇందులో సంపుటి, సంచిక అని ఎక్కడా కనపడవు. కేవలం ఒక నెంబర్ ఉంటుంది. అలా వచ్చిన 654 వ నెంబరే (సంచిక) మొన్న మొన్నటి జనవరి నెల పత్రిక. జగతి ఆగస్ట్ 1997-493 వ సంచిక ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఎక్కడో మధ్యలో పరిచయమై ఆప్త మిత్రులై పోయిన బెజవాడ గోపాల రెడ్డి గారి పుట్టిన రోజు ఆగస్ట్ 5 (1907) నాడు కనుక ‘ఆ మహానుభావుని స్మృతి మందిరంలో వెలిగించిన చిన్న ప్రమిద ఇది’ అని ఆ పత్రికని అంకితం చేసారు, ఎందుకంటే గోపాల రెడ్డి గారు 1997 మార్చి 9 న కన్ను మూశారు. ఆ ప్రత్యేక సంచిక ముఖ చిత్రాన్ని బాపు గీశారు. ఇంటి పేరు ‘బెజవాడ’ అయినా రెడ్డి గారు (అప్పటి) నెల్లూరుకి చెందిన వారు. అలా చెప్పే వారుండబట్టే ‘నేను విశ్వ భారతి వాడిని- ఏ తెలుగు నాటికో- నెల్లూరు సీమకో –అంటించి ఇరికిస్తే ఎట్లా?’ అనేవారు ఆయన. ప్రతి సమితికి,అకాడమీకి, పీఠంకి ఆయన అధ్యక్షులుగా ఉండే వారు. ఆయన కవి గురువు రవీంద్రులే. బహు భాషా కోవిదులు. కాబట్టి ఆ పంథాలో ఎన్నో అనువాదాలు చేసారు. తన 70 వ యేట మాత్రం ఓ మలుపు తిప్పుకున్నారు- స్వీయ రచనలకి శ్రీ కారం చుట్టడమే ఆ మలుపు. ‘ఆమె’ అనే తొలి స్వీయ కవితా సంపుటితో మొదలెట్టి ‘ఆమె’ పంచకం వెలువర్చారు. కొందరికి ‘కాంతం’, కొందరికి ‘ఊర్వశి’, కొందరికి ‘శశికళ’, కొందరికి ‘ఎంకి’, కొందరికి ‘అరుణ’ – వారి వారి రచనలకి ఆయువు పోస్తే ఈయన ‘ఆమె’ అని మాత్రమె చెప్పి ఊపిరి పీల్చుకున్నారు. ఎవరా ఈ ఆమె అని సందేహించి సతాయించే వారికి ఆయన ఇచ్చిన సమాధానం: 'నా ఆమె ఒకామె కాదని పెక్కు ఆమెల ప్రతి రూపమని ----ఆమె అని చెప్పాను / అయినా నమ్మనట్టే నటిస్తారు/ హృదయ అగాధాలలో అన్వేషిస్తారు /మరలా చెప్తాను పండిత భాషలో/ స్ఫూర్తిదాయిని, సృజనాత్మక సౌందర్య మూర్తి, శక్తి, ఆమె వ్యక్తి కాదు'. ఆయన గురించి చెబుతూ 'సాహిత్య మందిర ద్వార పాలకుణ్ని/ హృదయ మురళి మ్రోయించే గోపాలుణ్ని' అన్నారు. ఇంకా తననుంచి ఏదో ఆశించే వారికి అర్థమయ్యేలా 'వేణువు కావలిసి వస్తే/ వెదురు గడ వద్దకు వెళ్ళాలి/ చెరుకుగడ వద్దకు వెళితే లాభమేమి?' అని కవిత ద్వారా బదులిచ్చేరు. ఒకానొక పాటలో ఆజన్మ బ్రహ్మచారి అయిన పింగళి వారు భార్యా భర్తల గురించి ఎంత గొప్ప అవగాహనతో ఏమన్నారూ- 'నీ వంటే నీవని కీచులాడుకుందమా' అనేగా? రెడ్డి గారు మాత్రం- 'ప్రేమ జీవితంలో, దంపతుల/పరస్పర పరాజయాలే/ తియ్యగ నుంటాయి/ విజయాలే చేదుగనుంటాయి./ గెలుపుల కోరని కురుక్షేత్రమది.' అన్నారు. నేటి యువత గమనించదగ్గ విషయం నాడెన్నడో ఆయన స్పష్టం చేశారు. రాజా లక్ష్మీ ఫౌండేషన్ – పి.వి.రమణయ్య రాజా తన ఫౌండేషన్ కి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలగడానికి కారణం , ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తైన ఆ మహోన్నత మూర్తే అని గోపాల రెడ్డి గారి గురించి చెప్పారు. ఇవన్నీ చందూర్ గారు తన ప్రత్యేక ‘జగతి’ నిండా పరచిన బెజవాడ వెన్నెలలు. రవీంద్రుని పథంలో పయనమైన భావ కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు గోపాల రెడ్డి గారికి ఆప్తులు. 1975 లో కృష్ణశాస్త్రి కవితా స్వర్ణోత్సవం జరిగింది. అప్పుడే శాస్త్రి గారి రచనలు ఆరు సంపుటాలుగా తీసుకు రావడంలో రెడ్డి గారు ముందున్నారు. కృ.శా. ‘శర్మిష్ఠ’ నాటికల సంకలనంలో ఆత్మీయుడూ, ఆప్త మిత్రుడు శ్రీ బెజవాడ గోపాల రెడ్డి తో- ‘మనది ఒకే ఒక సంస్కార సమాజం. మనం ఒకే రకపు సాహితీ కుటుంబంలో వారం. గురుదేవుని అంతేవాసులం- కనుక దగ్గర చుట్టాలం.’- అన్నారు. చందురుడికి సంద్రంలోని అలలతో పని ఉంది. ఈ చందూర్ గారి వల్ల ఎన్నెన్నో నదీ సంగమాలు జరిగాయి. అవి సాహితీ జగతికి లాభించాయి. ఎక్కడైతే ‘స్నేహ హస్తాలు’ కలిసి ప్రయాణం చేస్తాయో అక్కడ ‘వీడుకోలు’ వద్దు- ‘విడిపోవడం వద్దు’ అనేలా----- ఉన్నట్టుండి చెప్పా పెట్టక చీకటి తెర లోకి జారిపోయిన మంచి మనిషి, మనీషి, కరుణా మయుడు ఎన్నార్ చందూర్. ‘కేలు చాపి ఆ దైవమే తన కేలు చాపి ఆకాశమే ఈ నేలపై ఒరిగి’ ఆయన్ని తమలో కలిపేసుకున్నాయి. మాలతి వారే మళ్ళీ ‘జగతి’ అల్లికను కొనసాగించడమొక్కటే మార్గం. అదే చందూర్ వారు లేని లోటును తీరుస్తుంది. కృష్ణశాస్త్రి గారు ‘అమాయకుడు’ ( 1968) చిత్రం కోసం ‘మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా- కరిగి కరుణ కురియాలిరా- కురిసి ‘జగతి’ నిండాలిరా’ అని ఆనాడే రాసారు. ఆ పాట వింటూ, ఈ పూట ఈ మాట అంటూ గురుదేవుల గీతాంజలి దృశ్యం చూస్తూ ఆగి ఆగి సాగి పోదాం. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 09 మార్చి 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|