మునుపటి నా మాట
మన తిథులు మన విధులు చిత్రమైనవి కదూ – చైత్రం వచ్చి వెళ్లి పోగానే వైశాఖమొచ్చింది. మూడవ తిథి ఏకంగా ‘అక్షయ తృతీయ’ అనే బరువైన పేరు మోసుకొచ్చింది. ‘అట్ల తదియ’ ముచ్చట్లు తెలిసిన తెలుగు పడతులు ఇప్పుడిప్పుడే ఈ ‘అక్షయ తదియ’ పట్ల కూడా శ్రద్ధ చూపిస్తున్నారు. ‘నీ ఇల్లు బంగారం కానూ’ అని వేటూరి వారు ఎప్పుడో పాట రాస్తే ఇదేదో బావుందే అని ఇంటి బంగారం కోసం ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. బంగారం లాంటి మా బంగారం షాపులో తదియ కన్నా ముందే బుక్ చేస్తే ఇంత శాతం డిస్కౌంట్ అంటుంటే అక్కడ పెరిగే రద్దీ ఇంతా అంతా కాదు. ఆ రోజు గానీ బంగారం ఇంటికొస్తే ముందు ముందు జీవితమంతా బంగారమే అనే బంగారు కలలు కనడానికి కాస్త తొందరగానే నిద్దరోతున్నారు ఇంటికి దీపాలయిన ఇల్లాండ్రు. ఆ రోజు ముహూర్తాలతో పనే లేదు. అందుకే జూనియర్ల, సీనియర్ల పెళ్ళిళ్ళు, నియర్ అండ్ డియర్ ల కొత్త ఇంటి బుకింగులు—ఇలా ఈ ఒక్క రోజే జరుగుతుండడం యాంత్రిక జీవన మార్గంలో వచ్చిన ఒక కొత్త మలుపు అనవలసిందే. పురాణాలు కొన్ని ప్రత్యేకతలు ఈ తిధికి ఆపాదించాయి. కానీ బంగారంతో ముడి పెట్టినట్టు ఎక్కడా లేదు. ఈ తిధినే గంగమ్మ తల్లి దివి నుండి భువికి దిగి వచ్చింది. మంచిదే కదా. దాహార్తి తీర్చేందుకు అపర భగీరథుడు సత్యసాయి నడుం కట్టుకున్నారు. ఆయన ‘బంగారూ’ అని ఆప్యాయంగా పలకరించే ప్రతి తిధి విలువైనదే. ‘ఉండమ్మా బొట్టు పెడతా’ అన్న సినిమా కోసం కృష్ణశాస్త్రి ‘పాతాళ గంగమ్మా రా రా రా’ అంటూ నీళ్ళు వచ్చిన ఆనందాన్ని ఆ పల్లె ప్రజల ముఖాల్లో పాట రూపంలో చూపించి ‘అడుగడుగునా బంగారం, ఆకు పచ్చని సింగారం’ అన్నారు. అదీ- అసలైన బంగారమంటే. బీడు నేల నీరు చిమ్మితే అది బంగారం కన్నా విలువైనది.
ఈ తిధినాడే విష్ణు అవతారమైన పరశురాముడు జన్మించాడు. తెలివైన వాడు. తండ్రి మాట జవ దాటక ఆయన కోపంలో శాశించిన పని (తల్లిని హతం చేయడం) పూర్తి చేసి, అందుకు ప్రతిఫలంగా ఏదైనా కోరుకోమంటే ‘నా తల్లిని బతికించండి’ అని అలా అడుగుతాడని ఆశించని తండ్రికే చెక్ పెట్టిన ఘనుడు. ఈ తిధి జైనులకి ప్రథమ తీర్థంకరుడైన రిషభ దేవ పరంగా ఎంతో ఉత్కృష్టమైనది. మహారాజే సర్వం త్యజించి మామూలు సాధువు రూపంలో తిరగట మంటే సామాన్య విషయం కాదు. పదవులు త్యజించమంటే ఈ రోజుల్లో ఎవరికైనా ఒళ్ళు మంటే. సాధు రూపులకే పదవులు కావాలి కూడా. అక్షయ తృతీయ వేడుకలు ఎక్కువగా మహారాష్ట్ర,, గుజరాత్ ప్రాంతాల్లో కనిపిస్తాయి. గమనించాల్సిన విషయం ఒకటుంది.కార్తీక శుక్ల నవమిని ‘కూష్మాండ నవమి’ (గుమ్మడి కాయ పూజ) అంటారు. ఈ తిధికి ‘అక్షయ నవమి’ అని కూడా పేరుంది. గుజరాత్ ప్రాంతాల్లో ఆచరిస్తారు. వీటి గురించి తెలియాలంటే మిస్సమ్మలో రేలంగోడు అన్నట్టు ‘ఓ చాలా గ్రంధం ఉంది’. అసలీ తిధులనగానే ఏదో ఒకటి విధిగా పాటించడమే ఇష్టం చాలా మందికి. కాని అందులో ఏదైనా శాస్త్ర పరిజ్ఞానం ఉందేమో అని అన్వేషించేవారు కొద్ది మందైనా ఉంటారు. అలాంటి వారికోసం శంకర్ బాలకృష్ణ దీక్షిత్ అనే ఆయన ‘భారతీయ జ్యోతిష శాస్త్ర’ అనే గ్రంధం మొదటి భాగం (1969) లో చాలా విషయాలు చర్చించారు. కాల చక్రంలో ప్రభవ, విభవ ----క్షయవంటి అరవై సంవత్సరాల గురించి మనం విన్నాం. ఆచరిస్తున్నాం కూడా. చివరిదైన ‘క్షయ’ను ‘అక్షయ’ అని కూడా అంటారు, ఎందుకంటే కాలం ఎక్కడో ఒక చోట క్షీణించలేదు కనుక. ఈ అరవై సంవత్సరాలే వరసగా పన్నెండు చొప్పున తీసుకుంటే అయిదు భాగాలుగానూ, వరసగా అయిదు చొప్పున తీసుకుంటే పన్నెండు భాగాలుగానూ విభజించ వచ్చు. అయిదేసి సంవత్సారాల క్రమం – సంవత్సర, పరివత్సర, ఇడావత్సర, అనువత్సర, ఇడ్వత్సర గా చెబుతారు. ఈ అయిదు సంవత్సరాల కలగలుపు ఒక యుగం. ఇది చంద్ర గమనం ప్రకారం వచ్చిన లెక్క. ఒక్కొక్క సంవత్సరంలో మొదటి విషువత్ దివసం క్రమంగా వైశాఖ శుక్ల తృతీయ, వైశాఖ పౌర్ణమి, వైశాఖ బహుళ ద్వాదశి, వైశాఖ శుక్ల నవమి, వైశాఖ బహుళ షష్టి నాడు వస్తే (సంవత్సరం సంవత్సరం మధ్య పన్నెండు తిథుల తేడా గమనించండి), రెండవ విషువత్ దివసం కార్తిక శుక్ల నవమి,కార్తిక బహుళ షష్టి, కార్తిక శుక్ల తృతీయ, కార్తిక పౌర్ణమి, కార్తీక బహుళ ద్వాదశి నాడు వస్తుందని లెక్క. ఇలా చూస్తే అక్షయ తృతీయ అనేది మొదటి విషువత్ దివసం కాబట్టి పగలూ రేయీ సమానం అనే దృష్టితోనే కాక అంతా సమానమనే దృష్టితో చూడడం మంచిదే కదా. అటువంటిదే కార్తీక శుక్ల నవమి కూడా. విశేషం ఏమిటంటే ఏ ఋతువు ఎప్పుడు ప్రారంభ మనే విషయం కూడా ఆలోచించి మాఘ, చైత్ర, జ్యేష్ట, శ్రావణ, ఆశ్వయుజ, మార్గశిర మాసాల్లోనే ప్రతి సంవత్సరం ఆరు ఋతువులు ఏర్పడుతున్నాయని లెక్క కట్టారు. ఈ లెక్కల గొడవ మనకెందుకూ అనుకుంటే మటుకు కృష్ణశాస్త్రి గారిలా ‘ఆరు ఋతువులు ఆమని వేళలే’ అనుకుంటే ఎల్ల కాలం సముద్రాలవారన్నట్టు ‘హాయి హాయిగా ఆమని’ సాగిపోతుంది. అక్షయ తృతీయ బంగారం మాటేమో గాని మన సినిమాల్లో మొట్ట మొదటి ‘బంగారు’ టైటిల్ 1951 లో ‘బంగారు భూమి’అన్న సినిమాకే చెల్లింది. ప్రభుత్వం ప్రకటించిన మొట్ట మొదటి ‘బంగారు’ నంది 1964 లో ‘డాక్టర్ చక్రవర్తి’ కి దక్కింది. ఇప్పుడు వరసగా ‘బంగారు’ టైటిల్స్ చెబితే కంగారు పుడుతుంది. కాబట్టి తాజాగా వచ్చిన ‘బంగారు’ టైటిల్ ఉన్న సినిమా ఏది? మీరే చెప్పాలి. సినిమాల్లో ‘భలే భలే మా అన్నయ్య బంగారం లాంటన్నయ్య’ , ‘బంగారు తల్లి నా చెల్లెలు’ అనే బంధు బంధనం మీరు వినే ఉంటారు. ‘బంగారు ప్రాయమిదే పవళించవె తల్లీ’ అనే జోల కూడా వినే ఉంటారు. అయితే కళా తపస్వి కె. విశ్వనాథ్ తీసిన సినిమాల్లోనే ఎక్కువగా ‘బంగారం’ మెరిసింది. ఇందాక చెప్పుకున్న ‘ఉం.బొ.పె’ ఆయనదే. ‘సీతాలు సింగారం మా లచ్చి బంగారం’, ‘పుత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు’, ‘పుత్తడి బొమ్మా పూచిన కొమ్మా’ ఇవన్నీ కొన్ని మచ్చు తునకలు. తరువాత ఏకంగా ‘స్వర్ణ’ కమలం అనే టైటిల్ కూడా పెట్టేశారు. బాపు ‘బంగారు పిచ్చుక’ తీసి తుర్రున ఎగిరి గంతేశారు. ఎక్కువగా ‘బంగారం’ పాటలు నటుడు చంద్ర మోహన్ కీ, స్వర బ్రహ్మ మహదేవన్ కి చెందడం చంద్రుడికీ, శివుడికీ (మహాదేవ, విశ్వనాథ) ఉన్న విడదీయరాని అనుబంధం తెలియజేస్తోంది. ఇప్పుడంటే వైశాఖం, దానితో బాటూ తదియ మే నెలలో రావడం జరిగింది కాబట్టి వెంట వెంటనే మనకి మరొక ‘గుర్తింపు’ కార్డు దొరికింది. అదే- ‘మాత్రు దివసం’. నిజానికి అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరికీ గుర్తింపు రావాలని ఉన్న పన్నెండు నెలలలో ఒక్కొక్క రోజు ఒక్కరికి కేటాయిస్తూ వచ్చారు. అలా మే నెలలో రెండో ఆదివారం ‘mother’s day’ గా పాటించమన్నారు. ‘అమ్మకి ఆదివారం ఉందా’ అని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తీవ్రంగా చర్చించారు. నిజమే- అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అమ్మా అమ్మా చల్లని మా యమ్మా అని పాడుకుంటే ఆ కమ్మదనం, ఆ చల్లదనం మరొకరికి లేదనే చెప్పాలి. అమ్మ అనగానే మనం ముందు ‘లోక మాత’, ‘జగన్మాత’ కి కృతజ్ఞతలు చెబుతాం. ఎందుకంటే ఆమె రూపమే అమ్మ కాబట్టి. తల్లిగా మనం ‘భూమాత’ ని ఆదరిస్తాం. తల్లిగా మనం ‘గోమాత’ని పూజిస్తాం. తల్లిగా దేశాన్నే ‘భారత మాత’ గా కొలుస్తాం. తల్లిని మించిన దైవం లేదని ప్రకటిస్తాం. ‘ఆ తల్లి గూటికే చేరు కోవాలి’ అని ఒక కొడుకు హుషారుగా పాడుకుంటూ గువ్వలా ఎగురుతూ ఉంటే అక్కడ ఆ తల్లి ఎదురు చూపులు, కొడుకు కిష్ట మైనవి చేసి పెట్టాలనే ఆరాటం, హడావుడీ అంతా ఇంతా కాదు. కూతురైనా అంతేగా. ‘అత్త వారింటికి దారేది---కిత్ కిత్’ అని చిన్ననాడు నవ్వించిన తల్లే నిజంగా అత్త వారింటికి కూతుర్ని పంపే క్షణం లో మౌనంగా రోదిస్తూనే ఉంటుంది. ప్రతి పుట్టిన రోజుకీ అమ్మ కి తెలుసు పిల్లలకి ఏది ఇష్టమో ఏది కాదో. అమ్మ ‘ఇక సెలవురా పిల్లలూ’ అని కోమాలో ఉండి శాశ్వత నిద్రలోకి వెళ్లి పొతే ‘అమ్మమ్మా మాకోసం ఓ మంచి అమ్మని కన్నావ్, మాకు మళ్ళీ జన్మలే వద్దు. ఇలాంటి రక్త సంబంధం మళ్ళీ దక్కుతుందనీ ఏమిటి గ్యారంటీ’ అని దూరం నుంచి విడిచిన కన్నీటి చుక్క తాకగానే దేవుడికి దిక్కు తోచలేదు. అయితే -తను సృష్టించిన ‘అ, వు, మా’ అనే మూడక్షారాల ఓంకారం ‘అమ్మగా’ భూలోకంలో దిక్కు దిక్కులా ప్రతిధ్వనిస్తుంటే సంతోషించాడు. (కనులు చూసినా, మూసినా పాటే – శీర్షికల్లో వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. మజ్రూహ్ సుల్తాన్ పురి రాసిన హిందీ పాట లోని ‘అమ్మ’, దాశరధి రాసిన తెలుగు పాటల్లోని ‘అమ్మ’ ప్రత్యేకంగా మీ కోసం) -డా. తాతిరాజు వేణుగోపాల్, 09 మే 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|