మునుపటి నా మాట
Happy Indepence Day to YOU Dear Motherland చిన్ని శిశువు పేరు స్వతంత్రం. పుట్టినది 1947 ఆగస్ట్ 15 న– కన్నది భారత మాత. ఆ రోజుకీ ఈ రోజుకీ మధ్య అరవై పై చిలుకు ఏళ్లు దాటిపోయాయి. అయితే ఇంకా శిశువేమిటీ?. షష్టి పూర్తి చేసుకున్న వృద్ధ మాత కదా. పిచ్చిగానీ – భారతమాత ఒక దేవతా మూర్తి. ఈ శిశువూ అంతే. వీరికి వయసు పెరగదు,తరగదు. ఆ మాటకొస్తే ఒక్క భారత మాత అనే కాదు ఏ దేశమాత అయినా అంతే. వారి స్వతంత్రం కూడా నిత్య శిశువే. మన శిశువుని లాలించాలి.పాలించాలి. కాపాడాలి. లాలి పాడాలి. నవ్వితే ఎందుకు నవ్విందో అని అనుమానించకూడదు. ఆ నవ్వులో శృతి కలిపి ఆనందించాలి. ఏడిస్తే మాత్రం ఎందుకు ఏడ్చిందో తెలుసుకోవాలి. అందుకు పాటు పడాలి. పాట పాడాలి. కుప్పిగంతులు వెయ్యాలి. మంచి మాటలు వల్లె వేయించాలి. ఇదంతా నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. మనం అలిసిపోయినప్పుడు మన పిల్లలు చూసుకుంటారు ఆ ఆలనా పాలనా. 4,32,000 సంవత్సరాలు కలి యుగానివి. అందులో అయిదువేల పై చిలుకు గడిచిపోయాయి. భారతంగా, భరత ఖండం గా ఎన్నో రూపాంతరాలు చెందినా తనకంటూ ఉన్న అనితర సాధ్యమైన సంస్కృతితో భారతమాత విశ్వంలో ఎప్పుడూ ముందుండేది. ఎక్కడినుంచి వచ్చిందో గాని ఒక గాలి దుమారం ‘దురాశ’ పేరుతో అడుగు పెట్టి ‘రాజ్య కాంక్ష’ అనే ప్రభంజనంలా ఎదిగి ‘పర పీడన’ అనే తుపాను లా బలపడి భారత మాతను ‘ఇండియా’ గా మలిచి మూడొందలకు పైగా ఏళ్లు భీబత్సం సృష్టించి చివరికి దాచేసుకున్న ‘స్వతంత్రం’ పేరు గల చిన్ని శిశువుని అప్ప చెప్పి తప్పుకుంది. ఆ నేపధ్యంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు మానవత్వాన్ని మంట గలపడం కనులారా చూసింది మాత. ఎందరో మహానుభావులు ఫిరంగులకీ, తుపాకీ తూటాలకి, అమానుష చర్యలకీ బలి అయితేనే గాని తన ‘స్వతంత్ర’ శిశువు తిరిగి తనకు దక్కలేదు. ‘గతం నాస్తి’ అని ఆ చేదు గుర్తులు చెరిపేసుకున్నా, తన చిన్ని శిశువుతో సంబరపడుతున్నా అకారణంగా ఇరుగు పొరుగుల చేత దెబ్బలు తింది. అయినా ఓర్చుకుంది. లోకం పోకడ నేర్చుకుంది. తన ‘అస్థిత్వం’ తనకు రక్ష అనుకుంది. ప్రపంచం అంతా తన బాపు గురించి విని బాపురే అనుకుంటే చూస్తూ పొంగి పోయింది. ఇవాళ ప్రపంచం లో తన పాత్ర గొప్పదని తెలుసుకునీ గర్వ పడుతోంది. తన స్వత్రంత్ర శిశువు విడుదల గురించి పాటు పడిన వారిలో ఎందరో శిశువును చూడకుండానే కన్ను మూశారు. చూసిన వారు కళ్ళు తెరిచారు. స్వేచ్ఛా రూపం ఇకపైన ఎలా ఉండాలా అని ఆలోచిస్తూ స్వతంత్ర శిశువును ఇకపైన ఎలా చూసుకుంటారో అన్న ఆవేదనతో కన్ను మూశారు.
స్వతంత్ర శిశువు అనాధ కాదు. నూటా ఇరవై కోట్ల హృదయాల్లో నూరు కోట్ల ప్రేమ నూటికి నూరు శాతం పొందుతోంది. మిగతా ఇరవై కోట్ల హృదయాలకు ఈ శిశువుతో పని లేదు. ఆమె నవ్వినా, ఏడ్చినా అక్కర్లేదు. ఆమె గాయ పడినా బాధ పడవు. ఆమె కలబోసి మాటాడుతున్న అలారు ముద్దు భాష వాటికి బోధ పడదు. అన్నమయ్య అన్నట్టు ‘ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు’, ఇటువంటి శిశువు బాగు గురించి తపించిన కళాకారులెందరో పుట్టారు, పుడుతున్నారు, పుడతారు. దేశమంటే భారత మాతే. అందుకే గురజాడ కవి ‘దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ ’ అని గుర్తించి హెచ్చరించారు. అయితే మనిషి కన్న మట్టి బంగారమన్నది కొందరి అవగాహన. పర్వతాలు, నదులు, పంటలు – ఇవన్నీ మాత స్థిరాస్తులని వాటిని మాత్రమె కాపాడితే చాలని కొందరి తపన. నిజమే- మట్టీ ముఖ్యమే, మనిషీ ముఖ్యమే. మనిషిలేని మట్టి ఎవరిక్కావాలి? కానీ- ‘మంచి చెడ్డలు ఎంచి చూడగ లోకమందు రెండు కులములు‘ అని కవి దర్శించినట్టు లోకం ఉందా? అలా రెండు రకాల మనుషులే ఉన్నారా? ఏది మంచి? ఏది చెడు? ఒకరి మంచి మరొకరికి చెడు. ఒకరి చెడు ఇంకొకరికి మంచి. ఈ లెక్క తేలక కులాల కుళ్ళు పేరుకు పోయింది. రాజకీయం నిజాయితీ మీద కొట్టిన చెంప దెబ్బకి కళ్ళు దృష్టి కోల్పోయాయి. చిన్ని శిశువు తొలి విడుదల నాడు నవ్వింది. అందరినీ నవ్వించింది. రాజకీయం బడిలోకి రానంత వరకు నవ్వింది. ఆడింది.పాడింది. ఆ బడిలో చేరగానే – A,B,C లకి ఒక్కొక్క పేరు చెబుతూ చిరు తిండికి సంబంధించిన ఆపిల్, బిస్కట్, చాక్లెట్ ఉదాహరిస్తూ ఒక వర్గం ఉంటే అంతకన్నా బాగా కడుపు నింపేవి అవినీతి, బంధు ప్రీతి, చీకటి బజారు అనే మరో వర్గం ఉండటం చూసి ఎటు వైపు మొగ్గు చూపాలో తెలియక సతమతమైంది. నూరు కోట్ల మంది మనకెందుకులెద్దూ ఈ విచిత్ర రాజకీయాలు అని అనుకుంటూ మొదటి వర్గంలో ఉండి పొతే, ఇరవైకోట్ల మంది ‘అదే మాకు రక్ష’ అని రెండో వర్గంలో ఉండడమే హాయి అని గ్రహించారు. ఈ వేర్పాటులో శిశురక్షణకి చెయ్యాల్సిన ఏర్పాట్లు మరచిపోయారు. శిశువు మళ్ళీ తప్పిపోదు కదా. అయితే ఆ నూరు కోట్లలో ఎక్కడో ఒక్కరు ‘నిరాహార’ ధర్మం ఆచరించి ఇరవై కోట్ల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడేలా చేయక పోరు. ఆ వెలక్కాయ పేరే ‘ప్రక్షాళనం’. అప్పుడు చిన్నిశిశువు తప్పక నవ్వుతుంది. నవ్వుతూ నవ్వుతూ అనంతంగా ఎదిగి ఎదిగి ప్రదూషణ అంటని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది. అదుగో ఆ గాలుల మధ్య మాత ఎగరేస్తున్న జెండా రెపరెపలాడుతోంది. ( ఈ పూట ప్రత్యేకతలు: కనులు చూసినా పాటే లో చూడండి- 1) కృష్ణశాస్త్రి వారి ఒకనాటి దేశ భక్తి గీతం 'జయ జయ జయ ప్రియ భారత' -'రాక్షసుడు' సినిమాలో పునర్దర్శనం. 2) గురుదేవులు రవీంద్రనాథ్ టాగోర్ రచించిన ' where the mind is without fear' గీతాలాపన. 3) గురుదేవులు టాగోర్ రచించిన 'జనగణమన' పూర్తి పాఠం. కనులు మూసినా పాటే లో వినండి- ఘంటసాల గళంలో 'వందే మాతరం', మల్లాది రామకృష్ణ శాస్త్రి వారి ఏకైక దేశ భక్తి గేయం : 'మన స్వత్రంత్ర భారతం' , ఎస్.రాజేశ్వరరావు గళంలో 'మ్రోగిందోయ్' , డా. బాలమురళీకృష్ణ గళంలో 'ఏ దేశ మేగినా', కృష్ణశాస్త్రి గారి 'ప్రాభాత ప్రాంగణాన', 'ఎత్తండి ఎత్తండి స్వాత్రంతపు జెండా', టంగుటూరి సూర్యకుమారి గళంలో 'మాదీ స్వత్రంత్ర దేశం' అనే పాటలు. ఇవన్నీ ఒక ఎత్తైతే - మా బెంగళూరు రోజుల్లో ఇరవై అయిదేళ్ళ క్రితం ఏర్పాటు చేసిన గాన కచేరీ లో మిత్రులు బొడ్డుపల్లి శేఖర్ తదితర గాయకులు పాడిన 'తేనెల తేటల మాటలతో'ఒక్కటీ ఒక ఎత్తు. ఈ పాటలన్నీ మా సుపుత్రుడు చందన్ 'ఇరగదీసి' అందిస్తున్నాడు. శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు ఆకాశవాణి తొలితరం గాయకులు, డైరక్టర్. ఆయన మన మధ్య ఉన్న ఏకైక స్వాతంత్ర యుగ గాయకులు. వారికి మన జోహార్లు. ఇప్పుడిప్పుడే ఏ ఆర్ రెహ్మాన్ 'జయహో' అంటే అహూ అనుకున్నాం. మల్లాది వారు ఆనాడే తన పాటలో 'జయహో' అన్నారు. గమనించండి తిరుగులేని మాట లో పెద్దల దేశభక్తి గేయాలు చదవండి. ఆహా ఆహాహా లో ఘంటసాల, కొసరాజు తమ స్వాత్రంత్ర్య యుగం నాటి అనుభవాలు విజయ చిత్ర ద్వారా తెలియజేస్తే మీరు మళ్ళీ చూసే అవకాశం ఉంది). -డా. తాతిరాజు వేణుగోపాల్ 15 ఆగస్ట్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|