మునుపటి నా మాట
ఏదీ? 'అలుక' మీద ఏదీ రాయ లేదేం? అని అలిగే వారికి--- కాస్త ఆగండి. ముందు కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే లు చూడండి, వినండి. కొన్ని హాస్య గీతాలు చిత్రారే Re-చిత్రం లో ఉంటాయి. అవి కూడా అలుక పాన్పు పైన ఉన్నవే. చూడండి , వినండి. కనులు చదివినా పాటే- లో మరిన్ని రాబోతున్నాయి. ----------------------------------------- మొత్తానికి ఆ నాలుగు రోజుల విరామం లో పదకొండు వీడియోలు, ఏడు ఆడియోలుగా సాగిపోయిందన్న మాట మీ జీవిత గానం. వెరసి పద్ధెనిమిది 'అలుకల' తోరణం దీపావళిపండగ కారణం గా మీ ఇళ్లను అలరించిందన్న మాట. దీపావళికి ఓ నాలుగు రోజుల ముందే రాసి పెట్టిన మాటలెందుకు లెండి కానీ - ఇప్పుడేలాగూ దీపావళి రానే వచ్చేసింది కనుక విషయం లోకి వద్దాం. ఇంతకీ అలుకకీసత్యభామకీ ఏమిటి అనుబంధం? సత్యభామకీ దీపావళికీ ఉంది కానీ - అవునా? కృష్ణుడు తన సొంత మామే రాక్షసుడిలా ప్రవర్తిస్తుంటే ఊరుకోలేదు- తుదముట్టించేడు. అందుకే 'కంసారి' అనిపించుకున్నాడు. బకాసురుడినీ, కీచకుణ్ణీ భీముడి చేత అంతమొందించాడు. అందుకే పాండవులకి గొప్ప అండ అయ్యాడు. ప్రాగ్జ్యోతిష పురం లోని నరక బాధ పడలేక మునులు వేడితే బాణాలతోనూ, సుదర్శన చక్రం తోనూ, సరదా పడిన సత్యభామ తోనూ తరలి వెళ్లాడు. దారిలో మురాసురుడు ముప్పు తెస్తుంటే వాడిని మదించాడు. అందుకే 'మురారి' అయ్యాడు. ప్రజలు నరక యాతన ఎంతగా అనుభవిస్తున్నదీ వాడి చురుకు యుద్ధ ప్రతిభను చూస్తూ తెలుసు కున్నాడు. బాణాలు వేసి కృష్ణుడి ప్రాణాలు తీద్దామనుకున్న నరకుడు ఓ క్షణం కృష్ణుణ్ణి మూర్ఛపోయేలా చేశాడు. అప్పుడు వచ్చింది భామకి కోపం. అంతే శర వేగంతో నరకుడితో ఎదురు పోరాడింది. కృష్ణుడు మేల్కొన్నాడు. సుదర్శనం ప్రయోగించాడు. నరకుడు నరక లోకానికి వెళ్లి పోయాడు. ప్రాగ్జ్యోతిషం అంటేనే తూరుపు వెలుగులు. తొలి సూర్యుడి కిరణాల వెలుగులతో భారత జగతి మేల్కొనేది అక్కడి నుంచే. ఇదంతా పగటి వెలుగు. మరి రాత్రో? అందుకే ఇంటింటా దీపాలు వెలిగాయి. మొత్తం దేశమంతా వెలుగులు ప్రసరించాయి. దీపాల వరసే 'దీపావళి'. సత్యభామ అలిగితే కృష్ణుడికి ఇష్టమట. ఎందుకంటే ఆ అలుక నుంచే అతను సాంత్వనం పొందుతాడు.
కోపం, అలుక రెండూ ఒకటేనా? డా. బూదరాజు రాధాకృష్ణ తన పద సంబంధ కోశం లో 'అలుగు' అనే క్రియా వాచాకానికి 'కోపించు' అని అర్థమిచ్చారు. నన్నడిగితే - కోపం ఒకంతటికి తగ్గని మానసిక జాడ్యం. అలుక - కోపం లాంటి కోపం కాని ఒక చిన్న చిలిపి కయ్యం. కోపానికి తెలిసిన భాష -తిట్లు. అలుక నేర్చిన భాష- మౌనం. మహా మహా మునులే కోపంతో ఎడా పెడా ఎదుటి వాడు నారాయణుడైనా డైనా సరే లెక్క చెయ్యక తిట్టేయడంతో కాల్లోని కంటిని పోగుట్టుకున్నారా లేదా? తన కోపమే తన శతృవు అని ఇందుకే అన్నది సుమతి శతక కర్త. కోపానికీ దీపానికీ ప్రాస పరంగానే కాదు ఎలా చూసినా జ్ఞాన ప్రవచనం కూడా ఉంది. 'వెలిగించవే చిన్ని వలపు దీపం- ఎందుకే నా మీద ఇంత కోపం' అని అనలేదూ కవి దాశరథి? జగమంతా ఇంటింటా కోపాలు లేకుండా ప్రేమ దీపాలు వెలిగించుకుంటే అప్పుడే నిజమైన 'దీపావళి'. 'ఆడవారి కోపంలో అందమున్నది' అని పసిగట్టిన కవి ఆరుద్ర మరో సందర్భంలో 'ఆడవారంటే శాంత స్వభావులు- కోప తాపాలు రావండి పాపం' అని చురక వేస్తూనే 'అలుక సరదా మీకు- అదే వేడుక మాకు' అని రాజీ కొచ్చారు. కనుక కోపం భయాన్ని కలిగిస్తుంది. అలుక వినోదాన్నిస్తుంది. ఆరుద్ర కవే మరోసారి ' అలిగిన కొలది అందము- అబ్బాయి గారి కోపము' అని రివర్స్ బాణం ప్రయోగించారు. అంటే అడ వారి కోపం లాగే మగవాళ్ళ కోపం కూడా అందమైనదేనన్న మాట. తొమ్మిది వీడియోలు చూశాక, నాలుగు ఆడియోలు విన్నాక మీకేమనిపించింది? నందమూరి అందగాడు చాలా సార్లు 'అలుక' బూనడం, అలుక తీర్చడంలో మేటి అని. అవునా? చివరికి రఫీ చేత కూడా ' చిలిప్పిగ కస్సిరే చెల్లియ విస్సురులో అలకలు కని నవ్వుకున్నాను.. హ్హ హ్హ ' (సి.నా.రె) అని పాడించుకున్న ఘనత ఆయనదే. నేడే, ఈ నాడ్నే అని రఫీ కాస్త పొరబడినా స్టేజి మీద పాడే వారిలోనూ అదే మాట జొరబడింది. లేక పొతే శ్రోతలు 'అలుకలు' పోయేవారే కదా. గోరంత దీపం కొండంత వెలుగు - ఇది సామెత. చూడ్డానికి పొట్టిగానే ఉన్నా గట్టి మాటల మేటి దాశరథి సామెతను తెలివిగా మెలి తిప్పి 'గోరొంక కెందుకో కొండంత అలక' అని అలక dimensions పెంచేశారు.అంతటితో ఊరుకున్నారా? లేదే! 'అలకలో ఏముందో తెలుసుకో చిలకా' అని అనుపల్లవి లో అణు శక్తి జొప్పించి అలక అన్నది చిలకా గోరింకల శాశ్వత అనుబంధమని పే(తే)ల్చేశారు. అలుక పాటలు ఎక్కువగా రాసిన ఘనత పింగళి నాగేంద్రులదే. పైగా అవన్నీ ఎన్టీఆర్ వారివే కావడం విశేషం. అక్కినేని అందగాడు 'గజల్' పద్ధతిలో అలుక ని ఆస్వాదించారు. 'అద్దంలో నీ రూపం తిలకించకు ప్రేయసీ , అలిగేవు నీ సాటి చెలిగా తలపోసీ' (సముద్రాల) అని ఒకసారి అంటే ఆ పలుకులే అప్పటి యువ హృదయాల పైన 'టాటూ' లు అనబడే అమర శిల్పాలు గా వెలిసాయి. 'అలుక చూపి అటువైపు తిరిగితే అగపడదనుకొని నవ్వేవు. నల్లని జడలో మల్లె పూలు నీ నవ్వుకు అద్దం చూపేను' (ఆత్రేయ) - అన్న ఈ పంక్తులు మరీను. అవే నాటి యువకుల 'సిరి సంపదలు'. 'అడప దడప ఇద్దరూ అలిగితేనే అందం- అలక తీరి కలిసేదే అందమైన బందం' అని జమునకి జమునా రాణి పాడడం ఏ ఎన్ ఆర్ అలుకని అతని 'మూగ మనసులు' రెట్టింపు చేయడమే కదా. ఇక డాషింగ్ హీరో కృష్ణ ఒక్కసారే 'అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా' (సి.నా.రె) అని అడిగితే నిర్మాతలు ఎందుకులెండని ఏకంగా సినిమా నుంచే ఆ పాట తొలగించేయడం విడ్డూరం. ఇప్పటికీ వి.ఏ.కే. వారు మంచి పాటలకీ గతేమిటని చెప్పి వాపోతుంటారు. శోభన్ బాబు కూడా ఒక్కసారే కాబోలు 'తొలి వలపులలో అలక ఉండునది విన్నాను - అది కవుల కల్పననుకున్నాను' అని సందేహ పడ్డారు. వారి సందేహం ఎలా ఉన్నా రమేష్ నాయుడు అద్భుతంగా స్వర పరచడం వల్ల మాటల పాటగా ఆ పాట ఖ్యాతి పొందింది. మెగా స్టార్ చిరంజీవి 'స్వయం కృషి' వల్ల వేటూరి కవి 'సుందర రామ'య్య 'సిగ్గూ పూబంతి ఇసిరే సీతా మాలచ్చి' గురించి ఎంత బాగా చెప్పేరూ! 'విరజాజి పూల బంతి అరసేతి మోయలేని సుకుమారి ఈ సిన్నదేనా? శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా?' అని రామయ్య ఆశ్చర్య పోయాడట. ఆ ఆశ్చర్యంలో అతని కన్నులు మేలమాడి నవ్వాయట. ఆ 'సిన్నెలు చూసిన సీతమ్మ, ఆ కలికి అలకలొచ్చి ఏసినాదట కులుకుల మొలికి'! 'హన్నా! పూబంతి మోయలేనంత సుకుమారి నని నవ్వుకుంటున్నావా స్వామీ!' అని ఆమె అనుకోవడం సరసంపు అలకకి నాంది కదా. 'అప్పు చేసి పప్పు కూడు' చేయడం నేర్పిన సి.ఎస్.ఆర్ తో జట్టుకట్టిన మామ రమణారెడ్డికి తగిన గుణపాఠం చెప్ప గలిగేది భజ గోవిందమే. అంటే రేలంగోడే. రేలంగి హాస్యానికి ప్రాణం పోసేది ఘంటసాల వారి గొంతు అన్నది చరిత్ర చెప్పిన సత్యం.పింగళి వారికి ఇన్ని అవకాశాలుంటే 'సీమ టపాకాయ' లాంటి మరదలు గిరిజని పంచ వన్నెల చిలకతో పోల్చి చిలక కున్నఅలక తో కొంటె రేలంగి బావగారి బాధ నంతా పాట రూపంగా చెప్పేయ గల చొరవ రాదూ? అలా పాడుకునీ ఆ తరం వారు 'అలక' లోని అందాన్ని ఆస్వాదిస్తే ఈ తరం వారు కూడా 'తప్పు చేసి పప్పు కూడు' అనే నవ్య సూక్తి తెలుసుకునీ కృష్ణుడి అలక లోని, అల్లరి లోని మజా తెలుసుకున్నారిలా- 'బృందావన మాలి రారా మా ఇంటికి ఒకసారి- అలిగి చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి' అని. 'పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా' (సముద్రాల) అన్న 'సువర్ణ సుందరి' మూగ ప్రేమ చాలనుకుంటే మరో గడసరి - పావురాన్ని దూతగా ఎంచుకుంది. పైగా ఆ పావురం తన ప్రియుడికిష్టమైన నేస్తం. ప్రియుణ్ణి ఈమె దోచుకుంటే ఇంక అతను పావురాన్ని పట్టించుకుంటాడా? -కోడు కనుక పావురం అలిగింది.ఐతే ఆమె ఎంత గడుసంటే 'ఇదిగో నా ప్రేమ అనే దాన్ని ఇస్తున్నా తీసుకో' అంది. నా ప్రేమ సందేశాన్ని ప్రియుడికి చేర వెయ్యవూ అనే అర్ధింపునలా indirect గా చెబుతోందన్న మాట. ఇంతకీ ఆ సముద్రాల వారి పాట ఏదంటే- 'అడుగడుగో అల్లదుగో అభినవ నారీ మన్మధుడే' (సారంగధర). అందులోని పంక్తి- 'నీ చెలికానిని దోచుకునేనని అలుగకుమా పావురమా- నీ ఉపకృతికి బహుకృతిగా గైకొనుమా నా ప్రేమా'! ఆత్రేయ సినీ కవిగా అవతారం దాల్చినప్పుడు తొలిసారిగా 'అలుక' ని ఒక 'భామా విజయం' నృత్య రూపకంలో ప్రయోగించారు.'ఒక తల్లి పిల్లలు' చిత్రమది. ఈ సినీ కవులంతా కళామతల్లి పిల్లలే. సావిత్రి నటన, సుశీలమ్మ పాట అని ముందే తెలిస్తే ఆత్రేయ లోని కవి హృదయం ఒక్క సారిగా ఉప్పొంగి ' చందమామ నీకై తొంగి తొంగి చూచి సరసన లేవని అలుకలు పోయే' అని అనకుండా ఉంటుందా? (నీవులేక వీణ పలకలేన్నది- డాక్టర్ చక్రవర్తి). విచిత్ర మేమిటంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కానీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు కానీ సినీ రచనల్లో ఎక్కడా 'అలక' పాన్పు పరవ లేదు. దేవదాస్ లో సముద్రాల వారివి అని అచ్చు వేయించినా కొన్ని పాటలు అచ్చం మల్లాది వారివిలా లేవూ అని అనిపించడం సహజమే. అలాంటి ఓ మాణిక్యం ' పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో'. అందులో 'నా దరికి దూకునో -- తానలిగి పోవునో -- ఏమౌనొ చూతము' అనే పంక్తి మల్లాది వారిదే అని అనేస్తే హమ్మయ్య అదో తృప్తి. 'అలక' పాటల చిట్టా ఇంకా ఎంతో ఉండే ఉంటుంది. 'నా పైన అలకే లేదని ఓ బంగరు రంగుల చిలకని' ఎందుకు పరిచయం చెయ్యలేదూ అని మీరడగడం- దీపావళికి ముందు వచ్చే 'ధన త్రయోదశి' (ధన్ తేరాస్) నాడు బంగారం కొనుగోళ్ళ హడావుడిలో పడిపోయి - మరచిపోవడం నా తప్పు కానే కాదు. ఆ పాట వీడియో కంటే ఆడియో మేలంటే మీకు అలుకరాదు కదా? ఇవన్నీ తెలిసిన, మళ్ళీ తెలుస్తున్న సినిమా కబుర్లు. లలిత గీతాల మహారాజులు కొనకళ్ల వెంకట రత్నం , నండూరి సుబ్బారావు, దేవులపల్లి, బోయి భీమన్న (ఈయన ఫోటో 'ప్రతి ముఖమూ ప్రముఖమే' లో ఉంది) 'అలక' ను పలకరించిన విధానం కనులు చదివినా పాట లోనే సాధ్యం. అయినా మచ్చుకి కొన్ని- కొనకళ్ల వారి బంగారిమామ అలిగినాడంటే ఆ అమ్మడిపైన కళల నీడే పడనీడట.ఆ అలక కూడా ఏదో చిలిపి చిలిపి జగడాల వల్ల వచ్చినదే అని నిజాయితీ గా చెప్పుకొంటోంది. పైగా చందమామ ని నీలి నీలి కొండలపై నిక్కి నిక్కి చూచేవు , అలిగిన నా రాజు జాడల అంతు దొరుకునేమో చూడ రాదూ అని వేడుకొంటోంది. అలుక పోయి తిరిగొచ్చిన బంగారి మామతో ఆ తరుణి పట్నం పోదాం అంటుంది. మామ అంటాడు- అలిగిందని కొండవాగు వలస పోదామనడం బావులేదుస్మీ! అని. ఇక నండూరి వారి ఎంకి మరీ బేల. అందరికీ ఆత్మీయుడు 'సందురూడే' కదా. నాయుడు బావ అలిగి రాలేదని చెప్పుకొంటోంది. తీరా తానూ అలిగితే బావని నిలదీసి అడుగుతోంది- 'ఏటికోయి మన చెలిమి?' అని. అసలు ఈ కవుల పాటలు, పద్యాలు చదవక ఊరికే వెబ్బులు వెతికితే సరి కాదు. జీవితంలో కావాల్సిన management మెళకువలు వీళ్ళు ఎప్పుడో చెప్పేరు. కృష్ణశాస్త్రి ఒక పాత్రని సృష్టించారు. తనలోని negative అంశాలని నిస్సిగ్గుగా చెబుతూ ఆ పాత్ర తనను తాను 'ఖలుడు' గా చెప్పుకొంటూ 'అయినా తనలాంటి వారి మీద ఆ ఆనంద సాగరుడు అలిగి మొహం చాటు చేసుకోడని' సంబరపడుతుంది. పద్యాల్లో 'అలక' ప్రస్తావనకి రెండు ఉదాహరణలు చాలేమో? ఒకటి బమ్మెర పోతన ఇలా అనడం ఎంత బావుందీ! అలుకనైన - జెలిమి నైన- గామంబున నైన- బాంధవమున నైన - భీతినైన - దగిలి తలప- నఖిలాత్ముడగు హరి- జేర వచ్చు - వేరు సేయడతడు కోపంతో కాని, కోరికతో కాని, స్నేహంతో కాని, బందుత్వంతో కాని, భయంతో కాని ఏదో ఒక విధంగా నిరంతరం ఆయనను (అంటే -హరిని) తలచుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడు సర్వాత్ముడైన ఆ శ్రీహరిని చేర వచ్చును. అంతే కాని హరిఎవ్వరినీ వేరు చేయడు. అందుకే ఆత్రేయ ఒకసారి 'శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం' చిత్రం కోసం శ్రీనివాసుడికి ఓ జోలా పాట రాయాల్సి వస్తే- 'శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు- అలమేలు మంగకు అలుక రానీయకు' అనే చొరవ తీసుకున్నారు అభినవ అన్నమయ్యలా. మరోసారి 'శ్రీ వేంకటేశ్వర వైభవం' చిత్రం కోసం శ్రీనివాసుని కథ పాటగా రాస్తూ 'నా నివాసమౌ మీ వక్షమును నరుడు తన్నినాడు- అచ్చట నాకిక తావు లేదని అలిగిపోయే లక్ష్మి' అన్నారు. ఆ మహాలక్ష్మియే మహారాష్ట్ర లోని కొల్హాపురిలో కొలువుందని అంటారు ప్రజలు. మరో పద్యం గుఱ్ఱం జాషువా వారిది చెప్పుకోవాలి. పలనాటి బ్రహ్మ నాయుడు, బాల చంద్రుల శూరత్వం గురించి చెబుతూ ఆయన 'అలుక' అనే మాటని 'కోపం' లేదా 'రౌద్రం' అనే అర్ధంలో ఇలా ప్రయోగించారు- 'అలుకయై బ్రహ్మనాయుడు ఖడ్గము దూయ / సప్త సముద్రముల్ జలదరించు', 'అలుగ రేగిన సింగంబగు బాలచంద్రుడు / అరుల వ్రయ్యల బంతులాడగలడు' ఇక వాగ్గేయకారుల్లో ఆద్యుడు అన్నమయ్య, ఆ తరువాత క్షేత్రయ్య, త్యాగయ్య 'అలక' లేదా 'అలుక' పద ప్రయోగం చేయబట్టే ఆ తరువాతి తరాలకి ఆ సంపద దక్కింది. వారి సంకీర్తనలు 'కనులు చదివినా పాటే' లోనే చదువుకోవాలి. అయినా మచ్చుకి కొన్ని మెచ్చుకోవడంలో తప్పేం లేదు. అన్నమయ్య నాయిక అలుక చిత్తానికి ఆకలి వేసింది కనక వలపునే ఆరగించమంటాడు. అలాగని అదే పనిగా ఆరగించడమూ మంచిది కాదు కనుక 'సారెకు (చీటికి మాటికి) నీ అలుక ఇట్టె చాలించవమ్మ' అని వారిస్తాడు.మరో సందర్భంలో ఆ చక్కని తల్లి 'చలముల అలుకకు చాంగుబళా' అని శ్లాఘిస్తాడు (ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్పుకోవచ్చు- మరాఠీ భాషలో 'చాంగ్లా' అంటే బాగు అనే అర్ధం ఉంది). ఇక త్యాగయ్య 'పలుకవేమి నా దైవమా - అసలు నీ అలుక కారణమేమిట'ని ప్రాధేయ పడతాడు. ఎంతో సన్నిహితులుగా ఉంటూ,ఎంతో సఖ్యంగా ఉంటూ ఏదో చిన్న మాట పట్టింపులతో ఏళ్లతరబడి మాటలు మానేసే వాళ్ళ మధ్య ఉండే పరస్పర క్షోభ మాటల కందనిది. కొన్నిటిని కాలం పరిష్కరించ వచ్చేమో కాని అసలు కారణం తెలుసుకునో, రాబట్టుకునో కలిసి పోవాలి కానీ! మొత్తానికి తీగ లాగితే డొంకంతా కదిలి నట్టు సత్య భామ 'అలక' ఎంత మేలు చేసిందీ! 'అలిగితివా సఖీ ప్రియా కలత మానవా', 'అలుక మానవే చిలుకల కొలికిరో' - అమ్మా! ఎంత గడసరి పింగళి వారూ? ఆజన్మ బ్రహ్మచారి వారు. అయినా సరసోక్తులు కొల్లలు ఆయన దగ్గర. 'మూతి బిగింపులు అలకలు పాత బడిన విద్యలట'! లేదండీ కవిగారూ- అలకలు భూలోకం నుంచి పోనే పోవు. అలుక, అలక ప్రస్తుత ప్రపంచంలో ఒకటే. ఎటొచ్చీ నాడు బహు వచనంలో అర్ధం మారుతుందని గ్రహించి అలుకలు,అలకలు ఒకటి కాదని జాగర్త గా ప్రయోగించేవారు. 'అలకలు' అంటే ముంగురులు అనే అర్ధం ఉంది. అన్నమయ్య అనలేదూ- 'అలరులు (పూలు) కురియగ ఆడెనదే - అలకల (ముంగురుల) కులుకుల అలమేల్ మంగ' అనీ! త్యాగయ్య అనలేదూ- 'అలకలల్లలాడగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనొ' అని. ఇదే గ్రహించి సముద్రాల వారు - 'పాల కడలిపై శేష తల్పమున పవళించేవా దేవా' అనే ప్రహ్లాద భక్తి పిలుపులో 'అలకలు అల్లల నాడుచు ముసరగ - నెలనవ్వులు తిలకించే మోము' అని వినిపించారు. అన్నట్టు శ్రీశ్రీ గారు పెద్దగా తెలియని 'మూగ జీవులు' అనే చిత్రంలో ' ఓ కవిగారూ, యువ కవి గారూ, నవ కవిగారూ - మీరెందుకు నాపై అలిగారూ' అని అడిగారండోయ్. ఆ పాట భావకవుల మీద వ్యంగ్యాస్త్రం! అలుక అనేది సీమ టపాకాయ్. 'ఏ సీమ దానివో ఎగిరెగిరి వచ్చావు' అనే వీలు లేనిది. అలక అనేది చిచ్చు బుడ్డి. సంసారంలో చిచ్చు రేపదు, వెలుగులే ఇచ్చి ఊరుకుంటుంది. పృథ్వీ పుత్రుడు నరకుడు తొలగి పోయేడని మనమెంత సంతోషించామో ఆ కన్నతల్లి పుడమికూడా అంతే సంతోషించింది. దుష్ట శిక్షణ తప్పదు. శిష్ట రక్షణ అవసరం. అప్పుడే కృష్ణుడు వచ్చేది. 'సంభవామి యుగే యుగే' అనేది. 'కృష్ణా నీ బేగనె బారో' అని ఎందరో పురందరదాసు తో గళం కలుపుతున్నారు. ఎటొచ్చీ సత్యభామాదేవి అలుక తీర్చడంలోనే స్వామి అంకిత మైపోతే ఎలా? ఎట్లా? ఎటుల? ( బాపు బొమ్మ సత్యభామ, కృష్ణుడు తెలుగు వాళ్లేమో అనేలా ఉంది కదూ. మొన్న ఓ ఆదివారం సంచికలో కృష్ణా జిల్లా లోని ఒక ఊళ్లోనే నరక వధ జరిగిందని, అక్కడ పృథ్వీశ్వరుడి ఆలయం ఉందని, అది నరకుడు నెలకొల్పిందే అని రాశారు. అక్కడ ఉండే ఎర్రటి పూలు దేశంలో ఎక్కడా లేవని, వాటిని నాటినది కృష్ణుడే అని కూడా అన్నారు. కృష్ణుడు, సత్యభామ ఉంటే ఎర్ర పూలేమిటి, పారిజాతాలే దివినుండి భువికి దిగి వస్తాయి. అందుకు సత్య 'మీరజాలగలడా నా యానతి' అని గర్వ పడుతుంది. ఆ వైనమేమిటో త్వరలో తెలుసుకుందాం). -డా. తాతిరాజు వేణుగోపాల్ , 26 అక్టోబర్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|