మునుపటి నా మాట
అంతే కదా- ఈ దీపం పేరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఈ దీపం వెలిగే ముందు ఆ దీపం ఆరిపోలేదూ- పొట్టి శ్రీరాములు గా తెలిసిన ఆ దీపం సదా స్మరణీయం.. ఈ దీపం ఎందుకు వెలిగింది? – చుట్టూ అలముకున్న చీకట్లు చీల్చడానికనీ. ఆ దీపం ఎందుకు మలిగింది? – అప్పటి చీకటి రాజ్యం తన మొండి పెత్తనం అనే గాలిని విసిరినందుకు. దీపం అవసరం ఎప్పుడుంటుంది? – మా తాతగారు రూళ్ళ పుస్తకం ఒకటి పెట్టి అందులో ‘కలం’ వాడి కొన్ని సూక్తులు రాసుకునే వారు. అందులోది ఒక సూక్తిగురుదేవ్ రవీంద్ర కవిది నాకు బాగా గుర్తుంది. ‘అస్తమిస్తూ అస్తమిస్తూ సూర్యుడు అనుకుంటాడు- అయ్యో నే వెళ్లి పోతున్నానే, ఇక లోకానికి దిక్కెవరూ? అని. మట్టి ప్రమిదలో మిణుకు మిణుకుమంటున్న తైల దీపం అంటుంది- ‘ నా చేతనైనంత నే సాయపడతాను ప్రభూ, అని.’ ‘సూర్యుడి ముందు దివిటీ’ అనే నానుడితో కొట్టి పారేస్తాం కానీ, ఇదిగో ఇలా సూర్యుడు మలిగి నప్పుడే దీపం వెలిగితే ఒక ధైర్యం, ఒక రక్ష, ఒక స్థైర్యం ఏర్పడతాయి. అలా దీపం అవసరం అర్థమౌతుంది. ఒక దీపం పది దీపాలు వెలిగిస్తుంది- అదే దీప తత్త్వం.
దీపావళి ఆశ్వయుజ బహుళ పక్షంలో ఆఖరి తిథి అయిన అమావాస్య నాడు వచ్చి దేశమంతటా పండుగైంది. మనకి ఆశ్వయుజ బహుళ పక్షం ఐతే ఉత్తరాది వారికి కార్తీక బహుళ పక్షం. ఆ తరువాత మనకీ వారికీ వచ్చేది కార్తీక శుక్ల పక్షమే. కార్తీక మాసం లో మేఘాలు దట్టంగా ఉండవు. చంద్రుడు నిగ నిగ లాడుతూ ధగ ధగ ప్రకాశిస్తాడు. అందుకే కార్తీక మాసాన్ని ‘వెన్నెల మాసం’ అంటారు. పైగా ఇది శరత్ రుతువుకి చెందినది కూడా. ఒక పాటలో సముద్రాల వారు ‘సువర్ణ సుందరి’ తో అనగా వినలేదూ? ‘కనుమా వయ్యారీ, శారద యామిని కవ్వించే ప్రేమా’ అన్నది. ‘వెన్నెల కురిసే శారద రాత్రి’ అని ఒక లలిత గీతం గుర్తుచేస్తుంది. ఒక సినీ గీతంలో దాశరథి కవి మొహమాటం లేకుండా ‘వెన్నెల రేయీ ఎంతో చలీ చలీ వెచ్చని దానా రావే నా చెలీ’ అని ఎందుకన్నారంటే పుల్లయ్య గారు ‘ప్రేమించి చూడు’ అని చల్లగా సలహా ఇచ్చినందుకు. ‘ఒక దీపం వెలిగింది’ అని ఒకసారి , ‘వేయి దీపాలు నాలోన వెలిగితే’ అని ఇంకొక సారి, ‘ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి’ అని మరో సారి సంఖ్య పెంచుతూ కవి సి.నా.రె అతిశయం ప్రకటించినా అది ‘వెలుగు తీవ్రత’ అవసరాన్ని చాటినట్టే కదా. కోపం పోవాలంటే ప్రియురాలు చిన్ని వలపు దీపం వెలిగిస్తే చాలంటారు కవి దాశరథి. ఎంకి పాటల నండూరికవి నాయుడు బావ చేత ‘ఆరిపేయవే దీపమూ, యెలుగులో నీ మీద నిలపలేనే మనసు’ అని అనిపించారు. ఎంత గడుసు వాడు నాయుడు- చీకటిలోనూ ఎంకి రూపం ఒక దీపం అని ఎరిగిన వాడు కదా. ఈ ప్రేమ దీపాల వళిలో జావళీలు రాసుకునే ముందు ‘చెలరేగు చీకటిలోన ప్రకాశించు దీపం వెలుగు’ తెలుసుకొండంటారు శ్రీశ్రీ. మరో వేదాంతి ‘దీపముండగ ఇల్లు దిద్దుకోలేవా –చీకటిలో ఒంటరిగా చిందు లాడేవా?’ అని కళ్ళు, చెవులు, కంఠం, తనువూ ఏం చెయ్యాలో చెబితేఎం.ఎస్. రామారావు గారు చక్కగా పాడి వినిపించారు. నిజానికి సూర్యుడు పగటి దీపం, చంద్రుడు రాత్రి దీపం. సూర్యుడు ఎర్రటి దీపం. చంద్రుడు చల్లని దీపం. ‘నీ రూపము ఒక దీపము గతి లేని పేదకు’ అని సంబరాల రాంబాబు చేత అనిపించారు కవి రాజశ్రీ. ఒక్క పేదకే కాదు, చీకట్లో లైట్లు లేకుండా వెళుతున్న ప్రతి ఒక్కడికీ ఆ చంద్రుడే దీపం. కర దీపం. ఐతే నెలవంక నాడు మాత్రం వంకర దీపం. నవంబర్ ఒకటవ తేదీన కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గుర్తుకు రావాల్సిందే. ఎందుకంటే ఇదే రోజున ఈ కృష్ణ దీపం జన్మించింది కనుక. ఓ రవీంద్రుడు, ఓ షెల్లీ ఈ పేరులో ఇమిడిపోయి ఆంధ్రలో ఒక కొత్త వెలుగులా అవతరించారు కనుక. రవీంద్రుడు‘జనగణమన---జయహే ’ అనే ఇప్పటి మన జాతీయ గీతాన్ని ఆంధ్రాలోనే మదనపల్లి లో రచించారని అంటారు. ఆయన ‘భాగ్య విధాత’ కి జయము జయము అన్నారు. ఆ విధాత ఎవరో కాదు పంచమ జార్జ్ అని కొందరి సణుగుడు. మొత్తానికి అది మదనపల్లి గీతం ఐతే మరి దేవులపల్లి గీతం ఒకటి ఉండాలే? ఎందుకు లేదూ? దేవులపల్లి వారు మాత్రం ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి’ అని ‘దేశ మాత’నే శ్లాఘించారు. మళ్ళీ చాలా చాలా ఏళ్ళ తరువాత ‘తెలుగు తల్లి’ ని కీర్తిస్తూ ‘పాడనా తెనుగు పాట’ అని పది నోళ్ళ చేత పాడేలా చేశారు. దేవులపల్లి వారి గళం కమ్మగా పాడేది. ఆయన గళాన్ని ఒక్క గ్రామఫోను రికార్డుగా నైనా దాచుకోలేకపోవడం మన దురదృష్టం అన్నారు శ్రీశ్రీ. ఎందుకంటే శాస్త్రిగారు గొంతు కోల్పోవడం ఒక అనూహ్య పరిణామం. టెక్నాలజీ అభివృద్ధి అంతంత మాత్రం ఉన్న రోజుల్లో అలా జరిగిపోయింది. పాట అనే దీపం ఆయన కలం నుంచి వెలిగింది కాని పాడడం అనే దీపం ఆయన గళం నుండి తొలగి పోయింది. అయినా వెలిగే దీపం వైపే ఆయన తన ‘కృష్ణ రజని’ ని మలుచుకున్నారు. ఆయన లలితగీతాల లాలిత్యాన్ని మరింత మృదుత్వం అద్ది సినీ గీతాల్లోనూ అందించారు. ఆయనేమీ వేలకొలది పాటలు రాయనే లేదు. గంగి గోవు పాలు గంటె డైనా చాలనే చందాన బంగారం లాంటి విలువైన పాటల పాతర ప్రతి ఇంటి ముందూ నెలకొల్పి ఊరుకున్నారు. బి.ఎన్.రెడ్డి గారి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి’ సినిమాకి తొలిసారిగా పాటలు రాసి, తొలిసారిగా మాటలూ రాసి మళ్ళీ ఏ ఇతర సినిమాకి మాటలు రాయలేదు. కవి సి.నా.రె. మాటలు రాసిన ఏకైక చిత్రం ‘ఏక వీర’. అది కవిసామ్రాట్ విశ్వనాథ రచన. అందులో కొన్ని పాటలు సి.నా.రె. వారు రాస్తే , మరి కొన్ని కృష్ణశాస్త్రి రాశారు. సి.నా.రె. వారికి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ ల రచనలంటే వల్లమాలిన ఇష్టం. ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ , ‘అన్ని రాత్రులూ పున్నమి రాత్రులే’ అని అడపా దడపా ఆశించిన శాస్త్రి గారు చైత్రంలోని వెన్నెలనే ఇష్టపడ్డారు. ‘కార్తిక రాతిరిలో కరి మబ్బుంటుందా?’ అని ఒక పాటలో ప్రశ్నించారు కృష్ణశాస్త్రి. ఆంధ్రలోనూ, మరి కొన్ని చోట్లా ఈ కరి మబ్బు ఉండక పోవచ్చు కానీ తమిళ నాట ఈశాన్య ఋతు పవనాలు మోసుకొస్తాయి కరి మబ్బుల్ని. మరి వాళ్లకి చైత్రమాసమే ‘బెట్టర్’. ఆ చైత్రమాసంలోనూ చంద్రుడు కురిపించే వెన్నెల కూడా బాగానే ఉంటుంది. సాయంత్రం వరకు పెనంలా మాడిపోయిన పుడమి కాస్త చల్లబడ్డాక పైన చంద్రుడు కనిపిస్తే ఆ హాయే వేరు. ఇది తెలిసిన శాస్త్రిగారు ‘ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది’ పాపం అని జాలి పడ్డారు. ఇక్కడ దొర్లిన ‘వెన్నెల మాసం’ పద చిత్రం మీద అప్పట్లో ఒకటే ఎద్దేవాలూ, ఎకసక్కేలూ. మరి కొందరు ఎంత దూరం వెళ్ళారంటే రికార్డింగ్ టైం లో పాట నకలు తీసుకున్నప్పుడు పొరపాటున ‘ఇది మల్లెల మాసమనీ, ఇది వెన్నెల వేళయనీ’ అన్నది అలా తారుమారైందని కల్పించారు. దర్శక రత్న దాసరి నారాయణ రావు గారు శాస్త్రి గారి తోనూ, ఆయన సినీ గీతాల తోనూ తనకున్న అనుబంధాన్ని హాసం (పత్రిక) లో వివరిస్తూ ‘ఇది మల్లెల వేళయనీ’ పాట పల్లవిని కోదండపాణిట్యూన్ కట్టి పాడి వినిపిస్తుంటే శాస్త్రి గారు తన్మయులైపోయారని రాశారు. నా దృష్టిలో - రాసిన పాటకి ట్యూన్ చెయ్యడం సూర్య కళ. ఇచ్చిన ట్యూన్ కి పాట రాయడం చంద్రకళ. ఈ రెండూ ఉండబట్టే నాటి ప్రతి సినీ గీతం ఇప్పటికీ దినం దినం శోభిస్తోంది. కృష్ణశాస్త్రి గారు తన సినీ గీతాల్లో ఎన్ని సార్లు ‘దీపం’ ఊసు లాడారో తెలియాలంటే ‘ప్రతి రాతా ప్రసిద్ధమే’ వైపు మీరు ‘సెర్చి లైటు’ వెయ్యాల్సిందే. అందులో అన్నీ కాకపోయినా కొన్ని దీప కాంతులు చూడాలంటే, కొన్ని దీప కళికల సవ్వడి వినాలంటే కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే – అనే రెండు కిటికీల తలుపులు తెరవాల్సిందే. ‘కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి’ – అని ఆయన అన్నప్పుడు ఆ దేవిలో కలిసిపోయిన తల్లి ముందు నిత్యం వెలుగుతున్న దీపం ‘ఆ తల్లి ఎక్కడికీ పోలేదు’ అనే భరోసా ఇస్తుంది కదూ అని అనిపించింది. ‘ఆ గుడిలో దీపముంది అదియే దైవం’ అన్నప్పుడు దీపం లేనిదే దేవుడు లేడనిపిస్తుంది కదూ అన్న సత్యం కనిపించింది. ‘దీపము లేని కోవెల లోపల దేవుడు వెలిసేనా?’ అని ముందొకసారి ఆయన ప్రశ్నించారు. 'దూరాకాశ వీధుల్లో తారాదీపాలుం'టాయి. ‘అడుగడుగున చుక్క దీపముంటుందని’ మరోలా చెప్పడమే కృష్ణ శాస్త్రీయం. ఇక్కడొక కవి ప్రస్తావన తేకపోతే ఎలా? కృష్ణశాస్త్రి వారి ‘ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం’ పాట ప్రేరణతో ఆచార్య ఆత్రేయగారు కూడా ఒక కార్తీక దీపం పాట రాశారు. ఈ రెండూ ‘పాట= తిరుగు టపా’ లో చూసిన వారు కార్తీక పున్నమి చంద్రుడిలా నిండుగా ఆశ్చర్యపోతారు. కృష్ణ శాస్త్రి కవి దీపం అందించిన వెలుగు ‘హారతి వెన్నెల కర్పూరం’ అన్నంత తెల్లనిది, చల్లనిది. ఈ దేవులపల్లి కవి చంద్రుడి బొమ్మ హైదరాబాద్ ట్యాంక్ బండ్ విగ్రహాల వరసలో లేదేమిటి చెప్మా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు సాగరు మధ్యన బుద్ధదేవుడు. బుద్ధుడే కళ్ళు మూసుకుంటే మేమెంత అని ప్రభుత్వమూ కళ్ళు మూసుకుంది. ఐతే బుద్ధుడిది సదా ధ్యానం, వీరిది ఎప్పటిలా పర ధ్యానం. ఎప్పటిలా ఆ కిటకిట లాడే పొడవాటి రహదారి విద్యుత్ దీపాల శోభతో కళకళ లాడుతూంటే, మూసీ నది నీటిలోని కిరణాలు కను మూసి తెరిచే లోగా కటిక చీకటిలో స్ఫటికాలై మెరుస్తున్నాయి. కృష్ణశాస్త్రి పాటలోని విద్వత్ దీపం వీటిని మించిన కాంతివంతమైనది అని గోదావరి అక్కడకి రాలేక పోయినా వేరే చోట నవ్వుకుంటూ ప్రవహిస్తోంది. దీపం కవితా వస్తువుగా నేను 19.10.1988 న రాసిన పాటని 23.02.2008 న తిరగ రాస్తే అది ఇలా వచ్చింది: దీపం, ఏదైతేనేం? పాపం- కాలిపోవు రూపం ఏదైతేనేం? || దీపం|| మనసు గుడిలో మసలు దీపం – మమత పేరిట నిలుచు రూపం || 2 || మనిషి కన్నుల వెలుగు దీపం- కలల ఊరట మిగుల్చు రూపం || 2 || ||దీపం|| వయసు సుడిలో మునుగు దీపం – వలపు కోరిక కాల్చు రూపం || 2 || పగటి వెన్నెల కరుగు దీపం – కడలి ముంగిట తేల్చు రూపం || 2 || || దీపం|| (అంతర్ముఖులు ప్రేమ దీపాన్ని మనసులోనే వెలిగించుకుంటారు. కలలు కంటూ ఊరట పొందుతారు. కొందరు బహిర్ముఖులు హద్దు మీరుతారు. పగటి వెన్నెల నిజం కాదు అని తెలిసాక నీట మునుగుతుంది వాళ్ళ ప్రేమ) నా పాట రచనలకి ప్రేరణ గురువు గారు కృష్ణశాస్త్రి గారే. బరంపురంలో ఆయన్ని 1979 జనవరిలో సన్మానిస్తారంటే విని ఆహా ఆయన్ని చూడడం అనేది నా జన్మ దిన కానుక అని కళ్ళల్లో వత్తులు వేసుకునీ మనసులో కొవ్వొత్తి దీపాలు వెలిగించుకున్నాను. తీరా చూస్తే ఆరోగ్యం బాగా లేక శాస్త్రి గారు రాలేక పోయారు. మరి కొన్నేళ్ళకి ఆ కవి దీపం ఆరిపోవడం, నా ఆశా కొవ్వొత్తి శాశ్వతంగా కరిగిపోవడం జరిగాయి. ఈ పూట నా మాటగా ఈ దీపోత్పత్తి అనేది దీపావళి సందర్భంగా గుర్తుకు రాలేదు – ఈ దీపావళికి ఒక్క రోజు ముందు అత్యంత ఆప్తులు పరాంకుశం రామదాసు గారు ( 80 ) బరంపురంలో, ఒక రోజు తరువాత అత్యంత అలౌకిక స్త్రీ మూర్తి, ఆత్మీయురాలు బుద్ధవరపు సరోజమ్మ గారు (రోజా గారు, 70 ) రాయపూర్ లో --- రెండు ఆరిపోయిన దీపాలు అనే దుఃఖం ఒక పక్క, 1977 నవంబర్ 25 కార్తీక పున్నమి రాత్రి అమ్మను కన్న అమ్మ, అమ్మలందరికీ మంచి అమ్మ, మాఅమ్మమ్మ దీపాలు వెలిగించి ఆస్పత్రిలో ఉన్న చెట్టంత కొడుకుని ఇంటికి పూర్ణారోగ్యంతో పంపించు తల్లీ అని తులసి మాతను వేడుకున్నా తెల్లవారు ఝామునే (26 న) మా మంచి (దేవుడు) మామయ్య అనే మాకు నీడనిచ్చిన వెచ్చని దీపం ఆరిపోయినందుకు వచ్చిన ఆనాటి కోపం మరో పక్క –ఇవి నన్ను స్థిమితంగా కూర్చుండ నివ్వలేదు కనుక – ఇలా ఏదో గిలికాను. -డా. తాతిరాజు వేణుగోపాల్, 01 నవంబర్ 2011
2 Comments
sivaramakrishna buddhavarapu
2/12/2013 04:35:55 am
dr.venugopal garu
Reply
d naresh babu
1/4/2017 12:09:23 pm
sir
Reply
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|