మునుపటి నా మాట
ఫాల్గుణ శుక్ల పక్షం అంతా సద్గుణ కృష్ణ (శాస్త్రి) పక్షమే! 1 Nov 1897 - 24 Feb 1980 చూస్తే ఇది ఫాల్గుణ మాసం. ఈ శుక్ల పక్షం అంతా కృష్ణ (శాస్త్రి) పక్ష పాతిని నేను. ఫాల్గుణ మాసం గుణం ఏమిటంటే ‘ఫాల్’, అదే ఆకులు రాల్చడం. అంటే శిశిర ఋతువు అన్న మాట. మరి కృష్ణ శాస్త్రి గారేమన్నారూ- ‘శీతవేళ రానీయకు రానీయకు, శిశిరానికి చోటీయకు చోటీయకు’ అనేగా? ఆయన మాత్రం అవి రెండూ చూసుకునీ శాశ్వతంగా వెళ్ళిపోయారు. పైగా ‘రానిక నీకోసం సఖీ, రాదిక వసంత మాసం’ అని అర్ధాంగి చెవిలో ఊది ‘దూరాకాశ వీధుల్లో తారా దీపాల’ మధ్య ‘దూరాన ధ్రువతారను చేరే తీరాలని’ సెలవు తీసుకునీ వెళ్లారు. మనం ఆయన లేరని నమ్మం – ఎందుకంటే తన పాటల ఖజానాలో దాచి ఉంచిన విలువైన మాటల బట్టీ – అంటే ‘వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం’ – అన్న పంక్తిలోని మాటల బట్టీ ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ అనే ఆశాభావంతో మనం ఉంటాం కాబట్టి, ‘బ్రతుకంతా ప్రతి నిమిషం పాట లాగ సాగాలి’ అన్న ఆయన ఆశాజ్యోతిని మనం చేజిక్కించుకున్నాం కాబట్టి. అయినా కృష్ణశాస్త్రి గారు ముందే ఎందుకన్నారూ , 'దిగిరాను దిగిరాను దివినుండి భువికి' అని? 'అవని అంతా నా అక్షయ పాత్ర' అన్నదీ వారే. అటువంటిది ఈ భువిని వదిలి ఎలా వెళ్ళ గలిగారో? బహుశా మళ్ళీ మనకోసం పాటలు రాయనని చెప్పడానికి 'దివినుండి దిగి రాను' అని సరదాగా మనల్ని గిచ్చారేమో. బహుశా తన పాటల భూమియే మనకో అక్షయ పాత్ర అయినప్పుడు ఇంక తన అవసరమేముందని అలా సెలవిచ్చారేమో? కృష్ణశాస్త్రి గారంటే ఫలానా అని పాత తరానికి ఇంకా గుర్తు చెయ్యడం అంటూ ఉంటే ‘అయ్యో ఒకనాటి తెలుగు వాడా’ అని ఆక్రోశించాల్సిందే. ఆయన పద్మభూషణుడు, మహాకవి, మాట పోక ముందు గొప్ప వక్త, గాయకుడు, గాలిలో దీపం లా ప్రస్తుతం ఉన్న రేడియోకి ఒకనాడు రేడియం ఆయనే అన్నది ఇప్పటి తరం ఇచ్చే సూక్ష్మం లో మోక్ష పరిచయం. ‘మల్లీశ్వరి’ ని పిలిచి ‘ఉండమ్మా బొట్టు పెడతా’ అంటే సంతోషించని తెలుగు వారుండరు. మల్లీశ్వరి అంతలాగ మాట్లాడిందంటే అదంతా కృష్ణ శాస్త్రి చేసిన ‘వాక్’ దానమే. అందుకే ఆయన ‘మళ్ళీ ఈసారి’ అని ఎవరు అడిగినా ‘సరే కానివ్వండి’ అని తల ఊపక ఏ సినిమాకీ మాటలు రాయక పాటలతోనే సరిపెట్టుకున్నారు. మల్లీశ్వరి, ఉండమ్మా బొట్టు పెడతా, శ్రీరామ పట్టాభిషేకం – సినిమాలకి మాత్రం మొత్తం పాటలన్నీ ఆయనే రాశారు. ఆకలి, తండ్రి, రాజగురువు, అఖండుడు, ఆడజన్మ, జగత్ కిలాడీలు, జగత్ జెట్టీలు, వాడే వీడు, రాముడే దేవుడు, ధనవంతులు – గుణవంతులు, జీవితాశయం వంటి సినిమా పేర్లు గుర్తున్నాయంటే అందుక్కారణం -ఒకటీ అరా దేవులపల్లి వారి పాటలే వాటిలో ఉండడం. దేవులపల్లి వారు వేలాది పాటలు రాయలేదు. బి.ఎన్. రెడ్డి గారు వందల కొద్దీ సినిమాలు తీయలేదు. అయితేనేం- ఇద్దరూ పద్మభూషణులే. ‘భూషణం’ అంటేనే అంత- మితంలో అమితం. (స్వగతం: మనల్ని నిత్యం కూర్చునీ పొగిడేవారికన్నా అడపా దడపా నిలబడి నియంత్రించేవారే అసలైన ఆప్తులు, ఆత్మీయులూనూ. మహాకవులకి సైతం అటువంటి మహానుభావులంటేనే ఇష్టం). ఒకనాటి ‘విజయ చిత్ర’ తో సమానంగా ‘సినిమా రంగం’ అనే మాస పత్రిక ఉండేది. , దరిమిలా ఆ పత్రికే ‘ఫిల్మాలయ’ గా మారింది. ఆ పత్రిక సంపాదకులు, ప్రముఖ పాత్రికేయులు జి.వి.జి కృష్ణశాస్త్రి గారితో చేసిన ఇంటర్ వ్యూ ని సెప్టెంబర్ 1975 సంచికలో ప్రచురించేరు. అందులో కృ.శా ఒకానొక మహానుభావుని గురించి స్నేహపూర్వకంగా చెప్పిన (రాసిన) మాటలు ‘తిరుగులేని మాట’ లుగా చదవండి. ఆ మహానుభావుడెవరో కాదు- బి.ఎన్.రెడ్డి గారు.
దర్శకులు బి.ఎన్ రెడ్డిగారు ఒకరకంగా కృష్ణశాస్త్రి గారికి సినీ రచన విషయంలో మార్గ దర్శకులనే చెప్పాలి. ఆయన పట్టుబట్టి శాస్త్రి గారి చేత ‘మల్లీశ్వరి’ కి మాటలు రాయించుకున్నారు. కృ.శా తొలిసారిగా, ఆఖరిసారిగా సంభాషణలు రాసిన చిత్రం అదొక్కటే. బి.ఎన్. చిత్రాలన్నిటికీ పాటలు రాశారు శాస్త్రిగారు, ఒక్క రంగులరాట్నం చిత్రానికి తప్ప. కనులు చూసినా ఆయన పాటే - మనసున మల్లెల మాలలూగెనే, సడిసేయకో గాలి సడి సేయబోకే, అందేనా ఈ చేతులకందేనా చందమామ ఈ కనులకు విందేనా, పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా ----ఒక్కొక్క పాటలోని నాజూకు తనం ఎంత మురిపిస్తుందీ! అన్నీ బి.ఎన్ రెడ్డి గారి అభిరుచికి, నమ్రతకీ నిదర్శనాలు. కందిపోయే 'చరణాల'తో ఒక్కొక్క పాట కదలిక ఎంత జాలి కురిపిస్తుందీ! అసలు 'మనసున మల్లెల మాల' పాట కి పల్లవి లేదు, చరణాలు లేవు. అవి విడదీసిన మల్లెలు కావు. ఇద్దరి మనసులు కలిపి బంధించిన మాల ఎలా ఉండాలో కృష్ణ శాస్త్రి గారికి తప్ప వేరెవ్వరికీ తెలియలేదు గాక తెలియలేదు. ఈ బంగారు పాటలన్నీ బి.ఎన్.రెడ్డి గారు వెండి తెరమీద తీర్చిదిద్దినవే. తీస్తే ఆయనే సినిమా తీయాలి. రాస్తే కృ.శా యే రాయాలి (ఐతే బి.ఎన్. వారి 'రంగుల రాట్నం' మాత్రం శాస్త్రి గారి చేత గాక శర్మ (భుజంగరాయ) గారి చేత వడికించింది. కారణం ఏమై ఉంటుందో - జమీందారీ తనంతో వచ్చిన వల్లమాలిన బద్ధకం తనకుంది అని కృ.శా తరచు అనేవారు. అదే కారణమై ఉండాలి). ఈ నాలుగు పాటల్లో మూడింటిలో 'వెన్నెల' వెలిగించేందుకు ఒక పాటలోని 'చందమామ' అవసరమయ్యాడు. గమనించండి. మల్లికి నాగ రాజు ప్రాణం. తన ప్రియుడే తనకు ‘రాజు’ అనేది ప్రతి ప్రేయసి అనుకునేదే. మీరు చూసిన నాలుగు పాట దృశ్యాల్లో (వీడియోలు) మూడింటి మెజారిటీ ‘రాజు’వే. మల్లి ‘నాగరాజు’ రాకతో మనసున మల్లెలు పూయించుకుంది. నెత్తిన రాజమకుటం, చెంతన రాజసులోచన వంటి చెలి ఉండగా ‘బడలి ఒడిలో రాజు’ పవ్వళించడా? పగలైతే దొర గానీ రాతిరి తన రాజేగా? ఇక చందమామ సరే సరి! వెన్నెల రాజు! (మల్లి కూడా నెలరాజా వెన్నెల రాజా – అని చంద్రుడితో తన గోడు వెళ్ళ బోసుకోలేదూ?). చందమామ ని ‘నెలరాజు’ అని అనడం పాత మాట కదా, ఏదైనా కొత్తది ప్రయోగిద్దాం ‘లక్ష్మీ కటాక్షం’ కోసం అని అనుకున్నట్టున్నారు సి.నా. రె. ఆయనే కొన్నాళ్ళకి ‘ రా వెన్నెల దొరా’ అనే పాట కదిపారు. ఏమో, దీనికి ప్రేరణ కృ.శా. వారి ‘పగలైతే దొరవేరా, రాతిరి నా రాజువురా’ (బంగారు పంజరం) పాట పల్లవి కావొచ్చే! పగలు కనపడని ‘వెన్నెల దొర’ రాత్రి కనిపించే ‘నెలరాజు’! ( లక్ష్మీ, బంగారు – సరి సరి, కాకతాళీయం) కృష్ణశాస్త్రి గారు మహాకవి కాళిదాసు కాలంలో గనుక ఉండి ఉంటే కాళిదాసుకి పని తప్పేది. మల్లి, నాగరాజుల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మేఘమాలని అర్ధించడమే తప్ప అది 'మేఘ సందేశం' గా గొప్పలు చెప్పుకోలేదు కృ.శా. తరువాతి తరం కవులకది చెల్లింది. కనులు మూసినా ఆయన పాటే - కృష్ణశాస్త్రి తెలుగు వారి జయదేవులు, రవీంద్ర కవి వంటి గురుదేవులు. అందుకేనేమో- ఆయన ఇంటి పేరు 'దేవులపల్లి', కృష్ణుడి మీద రాసిన గేయ గల్పికలు రాశిలో కొన్నే అయినా వెన్నెల రాశిలో వెలకట్టలేనన్ని ముత్యాల పూసలు. తన పేరులోనే కృష్ణ శబ్దం ఉంది కనుక శాస్త్రి గారికి ‘వేణుగానం’ మీద మక్కువ ఉంటే ఉండవచ్చు. భావకవిగా ఆయన నీల మేఘ శ్యాముడి మీద లలిత గీతాలు అల్లితే అవి ఆకాశ వాణి చలవ వల్ల ఆనంద బాష్పాలు కురిపించాయి (కనులు చదివినా పాటే - కనుక అక్కడ చదవాలి). కృష్ణశాస్త్రి గారు బి.ఎన్. వారి మల్లీశ్వరి చిత్రానికి తన తొలి కృష్ణగానం అర్పించారు. ‘ఎవరే పిలిచే రల్లన మెల్లన పిల్లన గ్రోవిని ప్రియా ప్రియా’ అనే ఆ ఆనంద భైరవిని గోపికలు ఆలపిస్తూ ఉంటే ఆ నంద నందనుడు దిగి రాడూ? ఇదే మల్లీశ్వరి చిత్రంలో కృ.శా వారి యక్షగానం ఉంది. సంప్రదాయం సిన్మాల్లో చూపించడం బి.ఎన్ వారి సదాశయం! దురాచారం మీద దుమ్ము దులిపేయడమూ ఆయనకే చెల్లింది. ఇదే పద్ధతిలో పుల్లయ్య గారు ‘కన్యాశుల్కం’ లో బుర్రకథ, వీధి భాగోతం లాంటివి ప్రవేశ పెట్టేరు. ఇందులో శాస్త్రి గారు ‘బొమ్మల పెళ్ళి’ మీద పాట రాశారు. బాల కృష్ణుడి లీలలు పెద్ద కృష్ణుడి ఎదుటే ‘గేయ’ రూపకంగా చూపించాలని దర్శకులు కె.వి.రెడ్డి గారికి ఎలా ఊహ కలిగిందో గానీ మాయాబజార్ చిత్రం లో ‘విన్నావ యశోదమ్మా’ ( రచన: పింగళి నాగేంద్రరావు) గేయ రూపకం ప్రవేశపెట్టారు. కె.వి.రెడ్డి గారి కవి పింగళి వారే, బి.ఎన్. రెడ్డి గారికి దేవులపల్లి వారిలాగ. అయితే అసలైన ‘కృష్ణ గేయ రూపకాలు’ కృష్ణశాస్త్రి గారే కొన్ని సినిమాలకు రాసి పెట్టారు. నీల మోహనా రారా (డాక్టర్ ఆనంద్), అదిగో మా రాధిక( కలసిన మనసులు), ఈ దారి నా స్వామి నడిచేనే(చెల్లెలి కాపురం)- ప్రధానంగా చెప్పుకోదగ్గవి. మరి కొన్ని కృ.శా గాన విశేషాలు వచ్చేవారం------- -డా. తాతిరాజు వేణుగోపాల్ , 24 ఫిబ్రవరి 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|