మునుపటి నా మాట
నాలుగు వైపుల గిరి గీసి చూస్తే... గురువులు మెచ్చిన శిష్యుడు కనపడతాడుclick to zoom ‘కృష్ణప్రేమ’ లో గత గురు వారం , ముప్ఫై ఎనిమిదేళ్ళ క్రితం మనల్ని విడిచి పెట్టి పోయిన కోదండపాణి గారిని స్మరించుకున్నాం. ఈ గురువారం కోదండపాణి తో పాటు ఆయన గురువులనూ తలచుకుందాం. ‘గురువును మించిన శిష్యుడు’ అన్నది కోదండపాణికి దొరికిన బిరుదు కాదు, సినిమా. ఇవాళ మన దురదృష్టం ఏమిటంటే- గురువును ముంచిన శిష్యులే ఎక్కువ. కోదండపాణి గారి కాలంలో ఆయన ‘గురువులు మెచ్చిన శిష్యుడు’. నాలుగు కేటగిరీలుగా గిరి గీసి అందులో కోదండపాణి గారి ప్రతిభని పున: ప్రతిష్టించి మీకందించడమే ఈ పూట నా మాట ప్రయత్నం. 1. కోదండపాణి ‘గురువులు మెచ్చిన శిష్యుడు’ ఎలా అయ్యారు? కోదండపాణి స్వయంగా సంగీత కృషీవలుడే అయినా కోరి సుసర్ల దక్షిణా మూర్తి గారి దగ్గర, కె.వి.మహదేవన్ గారి దగ్గర ‘సహాయకు’డిగా చేరారు. వయోలిన్ కే మారు పేరైన సుస్వరాల సుసర్ల వారు వయో వృద్ధులై (దాదాపు తొంభై ఏళ్లకు పైగా జీవించి) ఇటీవలే కన్ను మూశారు. ఆయన గురించి ‘అన్నా అన్నా విన్నావా’ అంటూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. సంసారం, సంతానం, నర్తనశాల నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర వరకు ఎన్నో సినిమాలు సుసర్ల వారికి దక్షిణగా సమర్పించుకున్నాయి. ఎన్.టి.ఆర్ గారికి ఆయనంటే ఎనలేని అభిమానముండేది. 'మామా మామా మామ' – పాటతో ‘మామ’ గా పేరు పొందిన మహదేవన్ గారి పేరు చివర్లో ‘వన్’ చాలా విలువైనది. మహదేవన్, పుహళేంది వెరసి అతను ఒక్కడే అని అది సూచిస్తుంది. అలాగే తన ‘పల్లవుల’ ఎత్తుగడతోనే శ్రోతల అభిమానం ‘గెలిచారు’ అని కూడ సూచిస్తుంది. ************పదండి ముందుకు సుసర్ల వారి ప్రభావం పాణి గారి తొలి చిత్రం ‘కన్నకొడుకు (1961) ’ లో గమనించవచ్చు. ‘చాటుకు పోవే జాబిలీ’ అనే సుశీల, శ్రీనివాస్ ల యుగళ గీతం ఉదాహరణ. ఎంత చాటుకు పొమ్మన్నా సుసర్ల వారి చందమామ ‘పాణి’ గ్రహణం కాక తప్పలేదు తరువాతి కాలంలో. ‘ఇలవేల్పు (1956)’ చిత్రం కోసం రఘునాథ్ పాణిగ్రాహి (ఒడిశా గాయకులు), లీల, సుశీల – త్రయంతో ‘చల్లని రాజా ఓ చందమామా’ ( వడ్డాది వారి రచన) పాట పాడించారు సుసర్ల వారు. ఘంటసాల వారికి బదులు పాణిగ్రాహి గారు ఎ.ఎన్.ఆర్ గారికి పాడడం ఒక గొప్ప విచిత్రం, సాహసం ! లేకపోతే లీల, ఘంటసాల, సుశీల అనే లకారాంత పేర్లతో ల..ల..ల..అని అనుకునేవారేమో. బహుశా అప్పటి రేడియో ప్రసారాల్లో అలవాటుగా ‘ఇప్పుడు ఇలవేల్పు చిత్రం నుంచి ఒక యుగళ గీతం వింటారు’ అని ఉంటారు. త్రిగళ గీతం అనాలి. కోదండపాణి గారికి ఎన్.టి.ఆర్ వారు ద్విపాత్రాభినయం చేసిన ‘గోపాలుడు భూపాలుడు (1967) ‘ చిత్రం అటువంటి త్రిగళ గీతం స్వరపరచేందుకు అవకాశమిచ్చింది. జానకి, ఘంటసాల, సుశీల – త్రిగళాలతో ‘ఎంత బాగున్నది—అందరాని చందమామ అందుతున్నది’ ( డా. సి.నా.రె రచన) అనే పాట పాడించారు. (సుసర్ల) గురు ‘జాడ’ లో ఇదీ విజయ నగారా మ్రోగించింది. పాట మధ్యలో ఆలాపనలు వింటే తెలుస్తుంది పాణి పాట నెప్పుడూ ‘ఏదో అయింది’ అనిపించేలా స్వర పరచరనీ. గళాల వరస కూడా ఒకటే- స్త్రీ, పురుష, స్త్రీ గళం!
సుసర్ల వారు ‘వచ్చిన కోడలు నచ్చింది (1959)’ కాబట్టి అయిదు భాషల గీతంతో ఆ నినాద బాణం వదిలారు సినీ చరిత్రకారుల గుండె లోకి. అందులోంచి ఊడిపడ్డ తెలుగు ముక్కలు ఆచార్య ఆత్రేయ గారివి. బాణం సంగతి 'కోదండ’పాణి వారికి వేరే చెప్పాలా? తనూ 'కథానాయిక మొల్ల (1970) చిత్రం కోసం పద్మనాభం గారి కోరిక మీద అయిదు భాషల పాట బాణం ఒకటి ‘ఈశ్వరీ జయము నీవే’ (లక్ష్మీ కటాక్షం, 1970) అన్నట్టు అల్లరీశ్వరి చేత విసిరేయించారు. అసలే పొడుగైన జ్యోతిలక్ష్మికి ఈ పాట కటాక్షం తో మరింత పొడుగు ఖ్యాతి లభించింది. అందులో ‘పొగరుగల పిల్ల- ఇది తెలుగుజాతి పిల్ల, లొంగే మాట కల్ల’ అనే తెలుగు భాష్యాలు పలికినది ఉర్దూ లోనూ దిట్ట అయిన దాశరధి వారే. పాణి, పద్మనాభం, దాశరథి గారలు పొడుగు విషయంలో ముమ్మూర్తులా ఒకే ‘లెవెల్’కి చెందినా ప్రతిభ విషయంలో వారి వారి ‘లెవెలే’ వేరు. పాణి మార్కు మామ పాట ఒకటి ఒకనాడు ‘దాగుడు మూతలు (1964)’ ఆడించింది. ‘అందలం ఎక్కాడమ్మా.... అందకుండా పోయాడమ్మా’ పాట ఆ రోజుల్లో ‘గోరొంక గూటికే చేరావు చిలక’ పాటతో పాటు అందలం ఎక్కింది. అది అందకుండా పోయిందే అని మీరు బాధ పడనవసరం లేదు. కనులు మూసినా (ఆ) పాటే ఇక్కడ ప్రత్యక్షం. ‘మహదేవన్ గారి పాట ఇది’ అని బెట్ కట్టే వారితో ‘పాణి గారి పాట ఇది’ అని తలపడి పోరాడడం ఎబ్బెట్టు కాదు కొందరికి. కొంచెం మోడరన్ రోజుల్లో మామ స్వరపరచిన ‘రాక రాక వచ్చావు మా(వా---వేచి వేచి ఉన్నది భామ’ (వాణీ జయరాం పాడారు) అనే పాట పల్లవికి పాణి ఒకనాడు కట్టిన ‘లే లే లేత వయసు గల చినదానా’ (జ్వాలాద్వీప రహస్యం ,1965) వరసే ప్రేరణ అయ్యిందని అనిపించవచ్చు. కొన్ని పాటలు పాడుకుంటూ ‘పామాగారిసా ‘అని తెలిసీ తెలియని స్వరాలు మనం అనుకునే ఉంటాం. అవి పాణి- మామ గారి, సావిత్రి గారి కోరిక మీద స్వర పరచినవి అని ఆలస్యం గా తెలిసి ఆనక ఆశ్చర్యపోతాం. కన్నదాసన్ వారి రచన ‘ఒరే ఒరు ఊరిలె ఒరే ఒరు రాజా’ (తమిళ చిత్రం: పడిక్కాద మేదై, 1962 ; నాయకి-షావుకారు జానకి ) పాణి స్వర పరచినదే. కనులు చూసినా (ఆ) పాటే- కనండి. ఇదే చిత్రం ‘ఆత్మబంధువు’ (1962) గా (నాయకి- సావిత్రి) భానుమతి గారి భర్త రామకృష్ణ వారి దర్శకత్వంలో తెలుగులో తీస్తే డా. సి.నా.రె ‘అనగనగా ఒక రాజు’ అని ఎంతో తెలుగుదనం గుమ్మరించి మరీ మార్చి రాశారు. తమిళం వరసని మామ కొంచెం రిపేరు చేశారు. కొంచెం ఈ పాట ఛాయల్లోనే పాణి అదే సంవత్సరం (1962) తన ‘పదండి ముందుకు’ చిత్రం కోసం ‘ మనసు మంచిది వయసు చెడ్డది’ (ఆచార్య ఆత్రేయ రచన) అనే పాట చేశారు. కనులు మూసినా (ఆ) పాటే- వినండి. ‘మనసు మంచిది’ అని అన్నందుకేనేమో అదే సంవత్సరం మహదేవన్,సావిత్రి, ఆత్రేయల కాంబినేషన్ లో ‘మంచి మనసులు’ సినిమా వచ్చింది (‘చెడ్డ వయసు’ అని ఆ రోజుల్లో అరిచి గీ పెట్టినా ఏ సినిమాకైనా టైటిల్ కాబోదు, ఇప్పుడు వస్తే ఆశ్చర్యం కలగనే కలగదు). ‘మంచి మనసులు, 1962’ లోని కొసరాజు రచన ‘ఎంత టక్కరి వాడు నా రాజు’, 'మూగ మనసులు, 1964' లోని ఆత్రేయ రచన ‘ముక్కుమీద కోపం’ మామ గారి వరసలే అయినా పాణి పట్టు ఉన్నట్టే ఉంటాయి. నటీ మణులకే 'దేవత' అయిన సావిత్రి స్వయంగా నిర్మించి దర్శకత్వం చేపట్టిన చిత్రం ‘మాతృదేవత’ (1969). మహదేవన్ (మామ) గారే సంగీత దర్శకులు. కాని ‘మనసే కోవెలగా మమతలు మల్లెలుగా’ పాట ఉందే, అది మాత్రం కోదండపాణి గారి పంటే. బహుశా ‘దేవత’ (1965) గా పేరు పొందిన నటీ మణి సావిత్రి ‘మాతృ దేవత’ గానూ పేరు పొందాలంటే అందులోని ‘ఆలయాన వెలసిన’ పాటలాగ ఇక్కడ ‘కోవెల’ పాట నిలవాల్సిందేనేమో. అందుకే అప్పటి ఆలయాన ---జ్యోతి వెలిగించిన కోదండపాణి ఇక్కడ కోవెలలో మల్లెలు మొలిపించారు. మామ రికార్డ్ మీద ‘క్రెడిట్’ ఇస్తాను అని అన్నా ‘వద్దు గురువు గారూ’ అని ‘అప్పు’ డొద్దన్న దొడ్డ మనసు పాణిది. కనులు చూసినా (ఆ) పాటే! డబ్భైల్లోని 'పండంటి కాపురం' చిత్రం (పాణి సంగీతం) లోని ‘బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి’ వింటూ అరవైల్లోని 'మూగమనసులు' (మామ సంగీతం) లోని ‘ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో’ ఏముందని అనుకుంటూ వింటే పాటలు రెండూ కవలలేమో అనిపిస్తాయి. రెంటికీ ఘంటసాల మాస్టారు గారిదే గళం కాబట్టి ఆయన ఎంచక్కా ఉభయ కుశలోపరి. 'మూగ మనసు'లే కాదు ‘మూగ నోము’ పాట ‘తల్లివి నీవే తండ్రివి నీవే’ కూడా పాణి గారికి ప్రేరణ కలిగించి ఉండాలి. ఆ విధంగా కోదండపాణి గురువులు మెచ్చిన శిష్యుడై ‘ఏడేడు జన్మల నుండి పడి ఉంది ‘స్వర’బ్రహ్మ ముడి’ అని కొనసాగేరు. 2. చిన్నారి పాప లాంటి సావిత్రి గారిది వింత సంసారం నటీమణి సావిత్రి గారికి కోదండపాణి సంగీతం పట్ల మక్కువ లేకపోతే రెండు తమిళ చిత్రాలు (ఒకటి 'మాతృ దేవత' తమిళం వెర్షన్ అనుకుంటా) అతని చేతికిస్తారా? ఒకే జిల్లా వారమనే అభిమానమూ కావొచ్చు. స్వీయ దర్శకత్వంలో సావిత్రి నటించిన ‘వింత సంసారం, 1971’ చిత్రంలోని ‘కోనసీమ పల్లెలోన గొప్పవారి ఇంటిలోన’ పాటలో అన్నట్టు ‘గోవులాంటి మనసున్న బాబుగారు’ కోదండపాణి. అదెలా? అంటే , ఇదీ కథ! అందరూ స్త్రీలే ప్రముఖంగా ఉండేలా సావిత్రి గారు ‘చిన్నారి పాపలు, 1968’ సినిమా తీసి గాయని ‘లీల’ ను సంగీత దర్శకురాలు, సంగీత పర్యవేక్షణ- కోదండపాణి అని ప్రకటించారు. నిజానికి పూర్తి బాధ్యత పాణి గారిదే. అందులో ‘ఓయబ్బో ఏందీ సొగసు – తూరిగ రెక్కల మల్లె తుళ్ళింది మనసు’, ‘నీలో నాలో ఒకటే రక్తం’, ‘ఏ కొమ్మకు పూసేనో’ పాటల వరసలన్నీ పాణి తల ప్రతిష్టించినవే! గోవులాంటి మనసున్న పాణి రికార్డ్స్ మీద పేరు రాక పోయినా గగ్గోలు పెట్టలేదు. గత గురు వారం ‘పద్మనాభుడు తన ‘పాణి’ని మదిలోన నిలిపాడు’ అనే చిరు శీర్షిక ఇవ్వడం గమనించారో లేదో. దాని అసలు రూపం ‘పద్మనాభుడు తన సతిని మనసులోన దాచాడు’. అది ‘వింత సంసారం’ లోని కోనసీమ పాటలోనిదే. 3. పాణి స్వరవాణి, కాదా తరవాణీ సాధారణంగా తెలుగు పాటలకి ఏ హిందీవో, ఇంగ్లీషువో పాటలు ప్రేరణ అవుతాయి. పాణి కూడ 'మహాబలుడు, 1969' చిత్రం కోసం ‘మగాడంటే మజా ఉన్నా అదో లాంటి భయం’ అనే పాట పల్లవికి ‘ఆజ్ కి రాత్ – ఏ కేయిసీ రాత్’ పల్లవినే భయం లేకుండా వాడుకున్నా మిగతా అంతా మజాగా చేశారు. 'పొట్టి ప్లీడర్, 1966' లో ‘ఇదిగో ఇదిగో తమాషా’ పాటలో ‘అవునంటే పువ్వులాగా నవ్వుకోరా’ అనే పంక్తులకి తమాషాగా ఇంగ్లీష్ గానం వాడుకున్నారు. ఇక కొన్ని తమిళం చిత్రాలు తెలుగులో తీస్తే కొంతవరకు ఎం.ఎస్. విశ్వనాథన్ గారిని అనుసరిస్తూనే తన ధోరణి మాత్రం విడిచి పెట్టలేదు పాణి. ‘మనసే అందాల బృందావనం' ( మంచి కుటుంబం, 1967) పాట కొద్ది మార్పులతో కొత్త ముస్తాబుతో అందంగా తెలుగు నాట విహరించింది. ఇవాళ ఈ పాట స్టేజి మీద ఒకే గాయని కాక ఇద్దరు కలిసి ఒక్కో లైన్ చొప్పున పాడినా అందంగా ఉంటుంది. బృందావనమది అందరిది కదా. ‘ఒకే ఒక గులాబికై....క్వాక్ క్వాక్ క్వాక్ (నేనంటే నేనే, 1968) ’, ‘చాలదా ఈ చోటు రాదులే ఏ లోటు (నేనంటే నేనే, 1968) ’, ‘రాముని రూపమే మోహనము (పెళ్ళికూతురు, 1970)’ - ఇవన్నీ మార్పులతో రాణించిన తమిళ- తెలుగు కూర్పులు. అయితే ‘మోటార్ సుందరం పిళ్ళై ‘ తమిళ చిత్రంలో లేని యుగళ గీతం తెలుగు వెర్షన్ ‘మంచి కుటుంబం’ (1967) చిత్రం లో ‘నీలో ఏముందో ఏమో’ గా పాణి స్వర రచనలో పెద్ద హిట్ కొట్టింది. ఆ యుగళ గీతం కృష్ణ,విజయ నిర్మల మీద చిత్రీకరించారు. సినిమాకి పెద్ద దిక్కు ఎ.ఎన్.ఆర్ అయినా ఆయన మీద ఒక నేపధ్య గీతమే ఉంది (త్యాగశీలవమ్మా మహిళా- ఇదే కోదండపాణి-ఎ.ఎన్.ఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన ఏకైక పాట గా మిగిలింది). అక్కినేని వారు హీరో గా ‘ఆలుమగలు’ (1977) చిత్రం వస్తే ఆ సినిమా సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు ‘ఒక్కరిద్దరుగ మారేది ముచ్చటగా ముగ్గురవ్వాలని’ పాటకి వరస కడుతూ ‘నీలో ఏముందో ఏమో’ ని చాలా వరకు అనుసరించారు. అక్కినేని వారికి అయ్యో తన పాట లేదే అని కోదండపాణి వారి ఆత్మ అసంతృప్తి పడకుండా టి.చలపతిరావు చూసుకున్నారని మెచ్చుకోవాలి. ‘వామ్మో , ఏమి ట్యూన్ ‘ అని కృష్ణా రెడ్డి గారు అదే పాటని ‘దేవతలారా రండి.. మీ దీవెనలందించండి ....ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణి...’ వెదికే ప్రయత్నంగా శ్రీకాంతుల రమ్య కృష్ణ గానంగా కొత్త తరం కోసం తీర్చి దిద్దారు. విశేషం ఏమిటంటే – తొలి ఒరిజినల్ ఘంటసాల వారికి దక్కితే, మలి 'కాపీ' పి.రామకృష్ణ గారికి, తుది 'కాపీ' ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి దక్కేయి. కనులు మూసినా (ఆ మూడు) పాటలే - ఈ పూట. 4. పాణియే కావాలనుకున్న సినీ నిర్మాణ సంస్థలూ, కథకులూ, దర్శకులూ హాస్య నటుడు పద్మనాభం, వారి స్వంత నిర్మాణ సంస్థ ‘రేఖా అండ్ మురళీ ఆర్ట్స్’ గురించి గత వారం కొంచెం ముచ్చటించుకున్నాం. నిజంగా డాక్టర్, అంతే నిజమైన యాక్టర్ ప్రభాకరరెడ్డి గారు పాణి మిత్రులే. రెడ్డి గారు మంచి కథకులు. ఆయన ‘జయప్రదా ఆర్ట్ పిక్చర్స్’ పేరిట పచ్చని సంసారం (1970), పండంటి కాపురం (1972), గాంధీ పుట్టిన దేశం (1973) – సినిమాలు రాసి, తీస్తే వాటికి పి.లక్ష్మీ దీపక్ దర్శకుడు, ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకుడు. ఈ మూడు సినిమాల ద్వారా కొత్త రచయిత ‘గోపి’ వెలుగులోకి వచ్చారు. పాణి మరణించాక రెడ్డి గారు సత్యం గారి వరసలతోనూ (నాకూ స్వతంత్రం వచ్చింది, కార్తీక దీపం, గృహప్రవేశం) తృప్తి చెందారు. ‘సుఖదు:ఖాలు (1967)’ వంటి ఉత్తమ చిత్రం దర్శకులు ఐ.ఎన్. మూర్తి గారికి దక్కింది. కోదండపాణి ‘ఇది మల్లెల వేళ యనీ’, దేవులపల్లి వారు ‘ఇది వెన్నెల మాసమనీ’ పోటీ పడగా విన్నది ఈ సినిమాలోనే. ఈ మూర్తి గారే ‘జగత్ కిలాడీలు, 1969’ సినిమా కూడా పొందారు. ఇందులోని ‘ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా’, ‘వేళ చూస్తే సందెవేళ’ –అన్న దేవులపల్లి వారి పాటలు పాణి మలచిన అపురూప స్వర శిల్పాలు. ఫల్గుణా పిక్చర్స్ వారికి ‘జగత్’ సెంటిమెంటు ఉండేది. కిలాడీలు తరువాత జెట్టీలు (1970), జెంత్రీలు (1971) తీశారు. పద్మనాభం గారి ‘శ్రీరామకథ (1968)’లో చంద్రమోహన్ గారికి బాలు, హరనాథ్ గారికి ఘంటసాల పాడగా రెండు యుగళ గీతాలు విన్నాం. 'సుగుణసుందరి కథ (1970)' లో కాంతారావు గారికి ఘంటసాల, రామకృష్ణ గారికి బాలు పాడగా విన్నాం. ‘జగత్ జెంత్రీలు’ లో మాత్రం ఒక్క శోభన్ బాబు గారికే ఒకసారి ఘంటసాల, మరొకసారి బాలు చెరొక యుగళ గీతం పాడడం జరిగింది. ఇందులో విజయరత్నం అనే అరుదైన రచయిత పేరు తొలిసారిగా విన్నాం. ఇక జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకుడిగా వచ్చిన ఇద్దరు మొనగాళ్ళు, భలే మొనగాడు, లక్ష్మీ కటాక్షం; మరెన్నో జానపద చిత్రాలకి దర్శకుడైన జి.విశ్వనాథం నుంచి వచ్చిన తోటలోపిల్ల కోటలో రాణి, భూలోకంలో యమలోకం, ఉక్కు పిడుగు, ఆకాశ రామన్న – ఇవన్నీ పాణి ముత్యాలే. బాలుని చూస్తే చాలు పాణికి కల్యాణి రాగం ఇవ్వాలని పించేది కాబోలు కాంతారావు స్వంత చిత్రం ‘గండరగండడు (1969)’ లో ‘మనసులోన మౌన వీణ మధురగీతం పాడనీ’ అనే మధుర యుగళ గీతం (బాలు,జానకి) ప్రత్యక్షమయ్యింది. పి.ఎస్.ఆర్ పిక్చర్స్, గౌరీ ప్రొడక్షన్స్ వారి చిత్రాలనగానే ఆ రోజుల్లో కోదండపాణి పాటల కోసం వేచి చూసేవారు. ఆ పాటల్లో ఎంత స్పీడో అంత మెలోడీ ఉండేవి. ఈ రోజుల్లో ‘వై దిస్ మెలోడీ మెలోడీ’ – అని ‘ధనుష్’ ప్రశ్నించేవాడే , ఎందుకంటే ‘కోదండ’ పాణితో తన పేరు బాగానే మ్యాచ్ అయ్యింది కాబట్టి. టి.ఎం. సౌందర్ రాజన్ మన మధ్య ఉన్న ఆ తరం గాయకులు. ఆయన్ని ఏ తెలుగు సినీ జర్నలిస్టూ తన లిస్టు లో వేసుకునీ ఇంటర్ వ్యూ చేసిన దాఖలాలు లేవు. 'ఇదేనా ...ఇదేనా.. తర తరాల చరిత్రలో జరిగింది ఇదేనా? జరిగేదీ ఇదేనా? ' అని ఆయన పాటలోని ప్రశ్నలే మిగిలాయి. కనులు మూసినా ( ఆ ) పాటే , చివరికి. ముక్తాయింపు: హార్మోనియం, బాల సుబ్రమణియం – ఇవే కోదండపాణి మిగిల్చిన ఆస్తులు. కుమారుడు ఈశ్వర్ ఆ హార్మోనియం లో తండ్రిని చూస్తాడు. అన్న, గురువు కోదండపాణి అని భావించే బాలు ‘పాణి లేనిదే ఇవాళ బాలు లేడు’ అని ప్రతి తలపులోనూ ఆయనకి ‘నండ్రి’ (కృతజ్ఞత) చెబుతారు. ఇవాళ బాలు ‘గురువు తెచ్చిన శిష్యుడు’ గానే కాక ‘ పదుగురు మెచ్చిన భాష్యుడు’ గా ఎదగడం పాణి చూస్తూనే ఉంటారు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మదన్ మోహన్, కోదండపాణి కవలలై పుడతారని అభిమానులు కలగంటూ ఉంటారు. పాణి నోట్స్ గా 'స్వరాల' పుస్తకాలు రాసుకునీ ఉంటే గనుక వాటిని అచ్చు వేయించడం ఈశ్వర్, బాలు ల వల్లే జరిగే పని. వారిద్దరికీ అదే విన్నపం. 'శ్రీరామరాజ్యం' - బాపు అక్షరాల చోద్యం లాగ 'కోదండపాణి -స్వరాక్షర వాణి' సాధ్యం! ---------------------------------------------------------------- (‘భూలోకంలో యమలోకం’ లాగ నిన్న ‘భూకంపంతో సునామీ రంపం’ వచ్చి పడుతుందని హడలు, గుండె దడలు పుట్టాయి. ప్రమాదం తప్పింది. సునామీ అంటే ‘మంచి పేరు!’ అని అనుకునే ప్రమాదం ఉంది. మీ,నా అనే భేదాలు లేవు సుమీ , అల విసిరితే అంతా విలవిలలాడాల్సిందే అని హెచ్చరించే అలవోక చూపు, మనకి అలవాటు లేని రూపు అది. పుస్తకాల్లో ఎంత చదివినా ప్రకృతి ఎప్పటికప్పుడు వింతలూ విడ్డూరాలు ప్రవేశపెడుతూ ఉంటుంది. మరో పది రోజుల తరువాత మస్తిష్కం పదనుపెట్టేది , మస్త్ గా ఇష్క్ పెట్టి చద్వాలని చెప్పేది పుస్తకం అని ఒక రోజు రాబోతోంది. ఆ రోజు ‘ఈ ‘పుట’ నా మాట’ గా కలుసుకుందాం). -డా. తాతిరాజు వేణుగోపాల్ , 12 ఏప్రిల్ 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|