మునుపటి నా మాట
యుగాంతం ...యుగాంతం అని దేశవిదేశాల్లో ఎందరో గొంతులు చించుకున్నారు, కొందరు సరదాగా, మరికొందరు నిజంగానే భయపడుతూనే. మాయన్లు (మయన్లు) ఏదో పాపం వాళ్ళ పూర్వీకులు లెక్క కట్టి చెబితే మిగతా వారంతా ఈ ‘జగమే…. మాయ కావడం’ ఖాయం అనుకున్నారు. ‘ఖాయము కాదిలన్ మనుజ కాయము’ అన్నారు కరుణశ్రీ కవిపుంగవులు. అయితే గియితే మనిషికే గాని ఈ ఇలకేదో ముంపు ఉందని ఎవరూ అనుకోరు. ఇంతకీ మాయన్లు ఏమన్నారూ? 21-12-2012 నాటికి 5,125 సంవత్సరాలు పూర్తయి ఒక శకం ముగుస్తుంది అనేగాని మొత్తం మానవ జాతి అంతరిస్తుందని కాదు. అంతెందుకూ, సరిగా మన పంచాంగం మనం తిరగేస్తే మనకి కూడా ఈ ఏడాదికి 5,113 కలియుగ సంవత్సరాలు ముగిసాయని తెలిసేది. అసలు మన కలియుగ కాలం ఎంత? 4,32,000 సంవత్సరాలు. అబ్బో—ఎంత దూరమూ అది ఎంత దూరమూ ! కాలం గురించి చెబుతూ దూరం దూరం అనడం ఘోరంగా లేదూ? కాలమే ‘దూరం’ అవ్వడం ఒక కాంతి సంవత్సరానికే సాధ్యం. మరో వారంలో మననుంచి దూరం అవుతుంది ఈ యేడు. మరో కొత్త వత్సరం, అదో కొత్త ఉత్సాహం. ఎన్నో కాంతులు, ఎన్నో చీకట్లు కలబోసుకుని ఒక్కొక్క సంవత్సరం వస్తుంటుంది. ఇంతా చేస్తే ఈ కాల చక్రమంతా ఈ భూమి ఊరుకోక సూర్యుడి చుట్టూ తిరగడంవల్ల వచ్చినదే. అనాదిగా పుడమికి, సూర్యుడికి మధ్య ఎంతో అనుబంధముంది. అది యుగయుగాల అనుబంధం, భూమివల్ల సూర్యుడికి ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు ఉత్తర,దక్షిణ కదలికలున్నాయి. ‘లీప్’ సంవత్సరం కావడం చేత ఈ ఏడాది డిసెంబర్ 21న సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు తన తిరుగు ప్రయాణం చేశాడు. లేకపోతె డిసెంబర్ 22 న జరిగేది.
పైగా ఇది ధనుర్మాసం, మార్గశీర్ష మాసం. మాసాల్లో మార్గశీర్షాన్ని నేను అని సగర్వంగా చాటాడు శ్రీకృష్ణుడు. గోదాదేవి, ఆమె అల్లిన మాలికలు, ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా ప్రకటించడం, కట్టిన మాల తన మెడలో ముందు ధరించి తరువాత స్వామికి సమర్పించడం, జయదేవుడు, మీరాల్లాగ తాను కూడా ‘పాశురం’ పాడి స్వామికి నివేదించడం – ఇదంతా మార్గశీర్ష మాసంలో చెప్పుకునే నిర్మలభక్తి మార్గంలోని వెలుగు రేఖలు. శ్రీకృష్ణుడు అని పొడిగానో,విడిగానో చెప్పి ఊరుకుంటే ఆయన మెచ్చడు. రాధాకృష్ణుడు అతను. ఆరువేల భామలు, అష్ట భార్యలు...అదంతా మాయ. ప్రేమ మూర్తి రాధ అంటే కృష్ణుడికి బృందావన ఛాయ, యమునా నది పాయ. శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం ఘంటసాలవారి పుణ్యమా అని తెలుగువారికి బాగా దగ్గరైంది. మాసాల్లో మార్గాశీర్షాన్ని నేను అని గీతాచార్యుడు అంటే ‘గీతాలకు మార్గదర్శి ఘంటసాల మాస్టారు’ అని తెలుగువారంటారు. ఇలాంటి సమయంలో సూర్యుడు దక్షిణంనుంచి ఉత్తరం వైపు తిరుగు ముఖం పడుతుంటే, మనం ఘంటసాల మాస్టారు గారిని మనసారా మనసులోకి రప్పించి మనతో ముచ్చటించమనడం సాధ్యమా? సాధ్యమే అయితే సంభాషణ ఎలా ఉంటుందో? ఘంటసాల మాస్టారు పాడిన లలిత గీతాలు, దేశభక్తి గీతాలు ఉన్న లాంగ్ ప్లే రికార్డ్ ‘ఆన్' చేశాను. చుట్టూ ఉన్న నిశ్శబ్దంలో ‘కర్ర్’ అని శబ్దం. మొట్ట మొదటి పాట ఇంకా రాక ముందు రికార్డ్ చేసే శబ్దం అది. ******* ‘మాష్టారూ.. దక్షిణం నుంచి ఉత్తరం వైపు సూర్యుడు ప్రయాణిస్తున్నాడు కాబట్టి , మిమ్మల్ని మా కృష్ణప్రేమలో తలుచుకుంటున్నాం కాబట్టి, మీరేమీ అనుకోకపోతే ఒక్కసారి మీ గళం నుంచి హిందీ వరసల ఆధారంగా వచ్చిన తెలుగు పాటలు వినాలని ఉంది. మీరు వేరే సంగీత దర్శకులకి అలా హిందీ వరసలు పాడడం అన్నది పక్కన పెడితే మీరు స్వయంగా సంగీతమందించిన చిత్రాలు కొన్నిట్లో హిందీ వరసలు వినిపించాయి, అదెలా సాధ్యమండీ? నిర్మాతలు మొహమాట పెట్టే ఉంటారు. ‘శాంతి నివాసం’ సినిమాకి మీరు సంగీత దర్శకులు. అప్పటికది ఒక నాటకంగా పద్మనాభం గారి డ్రామా ట్రూప్ ద్వారా ప్రదర్శించబడుతుండేది. ఆ టైముకి అప్పటికే బాగా జనం నోళ్ల నలిగిన రెండు వేర్వేరు హిందీ సినిమాల్లోని పాటలు తీసుకునీ మీరు వాటికి ‘హిట్టో’పదేశం’ చేశారు. హిందీ వరస కానిదొక పాట అదే సినిమాలో వినిపించి మీ హిందోళ రాగ ముద్రని భద్రపరిచారు. ఆ పాట- లీల గారు పాడిన ‘కలనైనా నీ వలపే'. అలాగే హిందీ లో మంచి హిట్ అయిన ‘వక్త్’ సినిమా తెలుగులో ‘భలే అబ్బాయిలు’ గా వస్తే హిందీ వరసల మధ్య హిందీలో లేనిదొకటి స్వరపరచి మీ స్వేఛ్చను తెలియపరచారు. అది ‘కలగన్నానే తీయని కలగన్నానే’ అనే యుగళ గీతం. మీరూ,సుశీలమ్మా పాడారు. చూశారా మాస్టారూ..ఈ రెండు ఉదాహరణల్లో స్వంత స్వర రచన అనగానే ‘కల’ అన్న మాట వినిపించింది. ఈ రోజుల్లో స్వంత రచనలు రావడం కల లెండి. కొరియా,కెన్యా, కొలంబో, కువైట్ – నకలు సంగీత దిగుమతికి ఎన్నో ‘క’లు (కకారాలు). మధ్య కాలంలో ‘అభిమానం’ అనే చిత్రానికి మీరే సంగీతమిచ్చారు. అందులో ‘ఓహో బస్తీ దొరసానీ బాగా ముస్తాబయ్యింది’ పాట హిందీ వరసే. అయినా అందులో హిందీ వరస కానిది ఒక పాట- ఊయలలూగీ నాహృదయం తీయని పాటా పాడెనే’ అన్నది ఉంది. శ్రీశ్రీ రచన. అందులో పల్లవిలోనే ఊయల శబ్దం ఉంది కాబట్టి హిందోళం వేస్తారేమో అనుకున్నాం. మీరు ఎప్పటిలా మీకిష్టమైన ‘రాగేశ్రీ’ రాగాన్ని అందుకున్నారు. కారణం - శ్రీశ్రీ గారిలోని సగం శ్రీ కారమే కాబట్టి, ఔనా? అవునండీ మాస్టారూ.... మీకు ఇలా హిందీ వరసలు కాపీ చెయ్యడం ఇష్టముండదట. మీ శిష్యుడు జె.వి.రాఘవులే ఏదో నిర్మాతల మనసు నొప్పించలేక మిమ్మల్ని ఒప్పించేవారట. అయినా సరే.. మీరు పాడిన ఆ వరసలు ఒక్కొక్కటి ఎంతెంత హిట్టూ, మాతృకలకన్నా ఇవే బావున్నాయి అన్నట్టు. మీరు ఎక్కువగా రఫీగారి పాటల వరసలే పాడారు. అవి కూడా చిత్రగుప్త, ఓపీ నయ్యర్, శంకర్-జైకిషన్ వంటి దిగ్గజాల స్వర రచనలే. తలత్ మెహమూద్ వారి పాట ఒక్కటే పాడారు. ముకేష్, కిషోర్ కుమార్ వంటి మేటి గాయకుల గళం నుంచి వచ్చిన హిందీ వరసలు మీరు పాడలేదేమో. అయ్యయ్యో .. ఏదో కంగారు... ఏం మాట్లాడానో ..ఏమో..’ ‘కం కం కం...కంగారు నీకేలనో...’ ‘హిందీ వరసలంటూ ఏవేవో గుర్తు చేశాను. ఈ పాట చెప్పి మీరు మా బాగా గుర్తు చేశారు. ఇది వసంత్ దేశాయ్ గారి స్వర రచన. తలత్, లతా పాడారు. ఎందరో గాయనీ గాయకుల భవిష్యత్తుకి తన కచేరీల ద్వారా లిఫ్ట్ ఇచ్చిన ఈయన 1975 డిసెంబర్ 22న ఇంటి దగ్గర జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయారు. ..’ ‘మహానుభావులు అమరులు ..నా వైపు నుంచి ఆ మహానుభావుడికి నా సంగీతంలో వచ్చిన ‘వసంత గానం’ ఒకటి, దేశ్ రాగం లోని పాట ఒకటి వినిపిద్దూ..’ ‘తప్పక ..మాష్టారూ.. అర్ధమైంది. వసంతాలు, బృందావనాలు కృష్ణుడి వినోదాలు. అలాగే కృష్ణుడి అలుక గురించి మీరు దేశ్ రాగంలో ఎంతో కమ్మగా పాడించారు. లీల, సుశీలల గళాలు, సంగీత వనంలో తులసీ దళాలు. ‘రెండు పాటలూ పింగళి నాగేంద్రరావు గారివే, చిత్రాలు విజయా వారివే. వీరి పాటలూ, చిత్రాలు ఎప్పుడూ హాయిగా ఉండేవి.’ ‘ఆ రోజుల్లో ప్రేక్షకులు కూడా ‘హా..యి’ గా బయట సినిమాలు చూస్తూ ఇంట్లో ఆనందంగా ఉండేవారట. హా- అంటే మధ్యాహ్నం (సినిమా) హాల్లో, యి- అంటే రాత్రికి యింట్లో ...వెరసి ‘హాయి’ అయ్యింది కాబోలు. అదేమిటో ఇప్పుడు చెప్పుకున్న పాటల్లో ‘తీయని’ అన్న మాటే ఎక్కువగా ఉంది... పింగళి వారు ‘ఎంతహాయి ఈ రేయి, ఎంత మధురమీ హాయి’ అన్నారు. అలా మాకు రేయింబవలు మీ పాటలు తీయగా, హాయిగా, మధురంగా ఎప్పటికీ వినిపిస్తాయి’ ‘కృష్ణశాస్త్రి గారు ప్రతి రాత్రి వసంత రాత్రి ...ప్రతి నిమిషం పాటలాగ సాగాలి అన్నారు కదా. పాట రాసే వారికి, పాడే వారికి ఆ వాక్యాలు నిత్య స్మరణీయం. నా చివరి రోజుల్లో ఒక ఏడాది కొన్ని నెలలపాటు నేను పాడకుండా, పాట లేకుండా ఉన్నవాణ్ణి. అంతకన్నా శిక్ష మరొకటి లేదు బాబూ’’ ‘వసంతమన్నా ఆమని అన్నా ఒకటే కనుక అలనాడు మీరూ, జిక్కి గారు పాడిన ‘హాయిహాయిగా ఆమని సాగే’ వినిపించాలని ఉంది. కాదు కాదు మీతో పాటు అక్కినేని,అంజలీదేవి,ఆదినారాయణరావుల ప్రతిభని రెట్టించి మరీ చూపించాలని ఉంది. రెట్టించడమెందుకంటే - రేపు మహమ్మద్ రఫీ గారి జయంతి మాస్టారూ. రాగమాలికల ఆ పాట హిందీ వరస ఇప్పటికీ ఆదినారాయణరావు గారికి తరగని కీర్తిని తెచ్చి పెడుతోంది.’ ‘వినిపిస్తే వినిపించు గానీ.. నేనా, సోదరుడు రఫీయా , సోదరి జిక్కియా, లతమ్మా ఎవరు బాగా పాడామో అన్నది ఆ రోజుల్లోలాగనే ఇప్పటికీ మీకు చర్చనీయాంశమేనా? ఏ పాటైనా పాడి జనాన్ని మెప్పించడం అనేది ఒక యజ్ఞం, ఒక తపన. గాయనీ గాయకులు ఎవరి కృషి వారి తాహతుకు తగ్గట్టు చేస్తారు. అందరినీ వినాలి. అందరినీ ప్రోత్సాహించాలి. తప్పులుంటే సరి దిద్దాలి. సరే బాబూ.. నీ దగ్గర తిరుప్పావై పాశురం ఏదైనా ఉందా? దేవులపల్లి కవివర్యులు చక్కగా రాశారు, సులభమైన తెలుగులో. మన సినిమాల్లో పాశురాలు ఇంత వరకూ వినపడలేదనే నేననుకుంటాను. బాపు, దాసరి వంటి ప్రతిభావంతులు వాటికి చక్కని రూపకల్పన ఇవ్వగలరు..’ ‘మేం మరచిపోతున్న వాటిని మీరు మా గుండె దగ్గరుండి గుర్తు చేస్తున్నారు.. ఇప్పుడు తిరుపతిలో జరగబోయే తెలుగు సభల్లో మిమ్మల్ని మనసారా తలుచుకుంటారో లేదో కానీ మీరు పాడిన ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ దృశ్య గానాన్ని చూపిస్తాను. పాశురాలు తప్పక వినిపిస్తాను, కొత్త సంవత్సరంలో..అదే ..వచ్చే నెల..’ ‘మార్గశీర్షం....కృష్ణ పక్షంలోనా?’ ‘ప్రస్తుతం మేమంతా మీ పక్షం’ ***** లాంగ్ ప్లే రికార్డ్ లో ఆరు పాటలు పూర్తయి పోయి, రికార్డ్ తిరగడం అయిపోయి ‘టక్’ అనే శబ్దం రావడంతో ఈ లోకంలోకి వచ్చాను. -డా. తాతిరాజు వేణుగోపాల్, 23 డిసెంబర్ 2012 (ఆదివారం) (In view of death anniversary of Musician Vasant Desaiji on 22 December and birth anniversary of Legendry Md. Rafi saab on 24 December, this particular feature on Teugu Legendry, Late Ghantasala, provides songs rendered by Ghantasala that had Hindi origin. However, the Hindi song –‘kuhu kuhu bole koyaliya’ sung by Lata and Rafi from Swarn Sundari was a reproduction from the original ‘Haayi haayigaa aamani saage’ from Suvarna Sundari. Both versions composed by Late P Adinarayana Rao in Ragamalika are hits even today.)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|